రామగుండం సీపీ సత్యనారాయణ
విత్తన దుకాణాలు, పాత నేరస్తుల కదలికలపై వ్యవసాయ అధికారులు, పోలీసులు నిఘా
కాగజ్నగర్టౌన్, జూన్ 2: నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని రామగుండం సీపీ, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఇన్చార్జి ఎస్పీ సత్యనారాయణ అన్నారు. కాగజ్నగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నదని, నకిలీ పత్తి విత్తనాలతో రైతులు నష్టపోకుండా ఉండేందుకు పోలీసులు, వ్యవసాయాధికారులు దాడులు చేస్తూ ముఠాపై దృష్టి సారించామని అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ విత్తనాల మాఫియా కొనసాగుతుందనే సమాచారం మేరకు రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు కుమ్రం భీం ఆసిఫాబాద్ ఏఎస్పీ వైవీఎస్ సుధీంద్ర ఆధ్వర్యంలో కాగజ్నగర్రూరల్ సీఐ రాజేంద్రప్రసాద్, ఎస్ఐ సందీప్, టాస్క్ఫోర్స్ పోలీసులు, ఏవోలు, ఏఈవోల సహాయంతో కలిసి బృందాలుగా ఏర్పడి దాడులు నిర్వహించారు.
అబ్దుల్ బషీర్ వద్ద 4 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నామని వీటి విలువ రూ. 8లక్షలు ఉంటుందని అన్నారు. ఇట్టి నకిలీ విత్తనాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరుకు చెందిన నవీన్ అనే వ్యక్తి వద్ద తీసుకున్నట్లు విచారణలో తేలిందని తెలిపారు. నకిలీ విత్తనాలు, పురుగుల మందులను అమ్ముతూ రైతులను మోసం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అదే విధంగా ఇటీవల చింతలమానేపల్లి గూడెం వద్ద రూ.42లక్షల విలువైన 21 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకొని ముగ్గురిపై కేసు నమోదు చేశామన్నారు. ఇప్పటి వరకు రూ. 68 లక్షల విలువైన నకిలీ విత్తనాలు పట్టుకున్నామని తెలిపారు. నకిలీ విత్తనాలు కలిగి ఉన్న, అమ్మిన వ్యక్తులపై పీడీయాక్టు చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ట్రాన్స్ఫోర్ట్, ఫర్టిలైజర్, విత్తన దుకాణాలపై, పాత నేరస్తుల కదలికపై ఎప్పటికప్పుడు వ్యవసాయ, పోలీసు అధికారులు కలిసి నిఘా పెట్టాలని ఆదేశించారు. ప్రజలు, రైతులకు ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్ముతున్నారే సమాచారం
ఉంటే డయల్ 100 నంబర్కు ఫోన్ చేయాలని, లేదా స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని సూచించారు. సమావేశంలో డీఎస్పీ అచ్చేశ్వర్రావు, జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.