సారపాక, అక్టోబర్ 25 : శాసనసభ ఎన్నికలు నవంబర్ 30న జరగనున్న దృష్ట్యా తాము ఓటు వేయాల్సిన పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు ‘ఓటరు సహాయమిత్ర’ను వినియోగించుకోవచ్చు. కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్లో ఉన్న ఈ యాప్తోపాటు ఓటరు హెల్ప్లైన్ యాప్ ద్వారా కూడా వివరాలు తెలుసుకునే అవకాశం ఉన్నది. పోలింగ్ కేంద్రాలకు వెళ్లేముందే ఓటర్లు తాము ఓటు వేయాల్సిన బూత్ ఎక్కడుందో సమగ్రంగా తెలుసుకోవాలి. ఈసారి కుటుంబాలవారీగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో గతంలో మాదిరి కాకుండా కుటుంబంలో ఓటు హక్కు ఉన్న వారందరికీ ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. ఈ క్రమంలో ఓటర్ల పోలింగ్ స్టేషన్లు మారనున్న దృష్ట్యా ముందుగానే వివరాలు తెలుసుకోవడం వల్ల ఇబ్బందులు తప్పనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారులు పేర్కొంటున్నారు.
నవంబర్ 10వ తేదీలోగా నామినేషన్ల పర్వం ముగియనున్నందున ఆ తర్వాత ఓటర్లకు పోలింగ్ స్లిప్లు కూడా పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది. గత అనుభవాల దృష్ట్యా ఈసారి ఎలాంటి సమస్యలకు ఆస్కారం లేకుండా ఓటర్లు ఓటింగ్లో పాల్గొనేలా ప్రోత్సహించే విధంగా 20 రోజుల ముందుగానే పోలింగ్ స్లిప్లు పంపిణీ చేయాలని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించినట్లు జిల్లా యంత్రాంగం పేర్కొంది. ఈసారి నిర్దిష్ట సమయంలో 100 శాతం పోలింగ్ పూర్తిచేసేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తోంది. ఓటరు సహాయమిత్ర ద్వారా వివరాలు తెలుసుకోవాలంటే http://ceotelangana.nic. in వెబ్సైట్లో ఓటర్లు సంప్రదించాలి.