పోరాడి సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ. ఈ తొమ్మిదేళ్లలో అన్నిరంగాల్లో అభివృద్ధి చెందింది. సబ్బండవర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. పదో వసంతంలోకి అడుగిడుతున్న శుభసందర్భంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మహిళా సంక్షేమ దినోత్సవాన్ని పండుగ వాతావరణంలో జరుపుకున్నారు. మహిళలు బతుకమ్మలతో ఆడిపాడారు. కోలాట ప్రదర్శన ఆకట్టుకున్నది. మండల సమాఖ్యలకు ఎమ్మెల్యేలు చెక్కులు పంపిణీ చేశారు. వివిధ రంగాల్లో ఉత్తమసేవలు అందిస్తున్న మహిళలను సన్మానించారు. ఖమ్మంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో 300రకాల పౌష్టికాహార తినుబండారాలు, స్వయం సహాయక సంఘాల సభ్యుల ఆధ్వర్యంలో జ్యూట్బ్యాగులు, బనియన్స్, పచ్చళ్లు, హోమ్ఫుడ్స్ స్టాళ్లను ఏర్పాటు చేశారు.
ఖమ్మం నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ వీపీ గౌతమ్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, పాలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, వైరాలో ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్, భద్రాద్రి జిల్లా చుంచుపల్లి మండలంలో జరిగిన వేడుకల్లో కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, మణుగూరులో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, అశ్వారావుపేటలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ఇల్లెందులో ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ తదితరులు పాల్గొని మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన పథకాలను వివరించారు.
-ఖమ్మం, జూన్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దశాబ్ది ఉత్సవాలు జోరుగా కొనసాగుతున్నాయి. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఖమ్మం రూరల్ మండలంలోని బైపాస్రోడ్లోని టీసీవీ ఫంక్షన్హోల్లో మహిళా సంక్షేమ దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. ఈ వేడుకలకు పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు హాజరయ్యారు. సత్తుపల్లిలోని సిద్ధారం రోడ్లోని లక్ష్మీప్రసన్న ఫంక్షన్హాల్లో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పాల్గొన్నారు.
మధిరలో జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజు, ఖమ్మంలో కలెక్టర్ గౌతమ్, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. చుంచుపల్లిలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, కలెక్టర్ అనుదీప్, మణుగూరులో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఇల్లెందులో హరిప్రియానాయక్, అశ్వారావుపేటలో మెచ్చా నాగేశ్వరరావు వేడుకల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు మహిళలు, అధికారులు పుష్పగుచ్చాలతో, కోలాట నృత్యాల నడుమ, బతుకమ్మ ఆటపాటల మద్య ఘనస్వాగతం పలికారు. అనంతరం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మిల్లెట్ ఆహార ప్రదర్శనను పరిశీలించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన మహిళా అధికారులకు ప్రశంసా పత్రాలు అందించి శాలువ, మోమోంటోలతో సత్కరించి అభినందించారు.
– నమస్తే నెట్వర్క్