అశ్వారావుపేట, ఫిబ్రవరి 2 : అపరిష్కృతంగా ఉన్న తాగునీటి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోక పోవడంతో ఆగ్రహించిన మహిళలు శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కొత్తూరు గ్రామంలో ఖాళీ బిందెలతో రోడ్డెక్కి ధర్నా చేపట్టారు. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడగా.. ఇంటర్మీడియట్ పరీక్షకు వెళ్లే విద్యార్థులు పొలాల మీదుగా పరీక్షా కేంద్రాలకు పరుగులు తీశారు. వివరాల్లోకి వెళితే.. మిషన్ భగీరథ తాగునీరు సక్రమంగా సరఫరా కావడం లేదు. కొన్ని నెలలుగా మోట ర్లు తరుచూ మరమ్మతులకు గురవుతున్నాయి. దీంతో శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు అధికారులను వేడుకున్నా పరిష్కారం లభించకపోవడంతో ఆగ్రహించి వేలేరుపాడు-అశ్వారావుపేట ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో బైఠాయించారు. రోడ్డుపై వెదురు తడికలు, మొద్దులు, ముళ్ల కంచె, టెంట్లు వేసి ఆందోళనకు దిగారు.
దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పరీక్షలకు వెళ్లే విద్యార్థులు సమీప పంట పొలాల మీదుగా కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు మహిళల ఆందోళన కొనసాగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని మహిళలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ససేమిరా అన్నారు. చివరికి ఎంపీడీవో జి.శ్రీనివాసరావు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ లక్ష్మి, మిషన్ భగీరథ ఏఈ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి బాబు సంఘటనా స్థలానికి చేరుకుని తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కార చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేయడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.