ఖమ్మం, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధర పెరగడంతో పంట పండించిన రైతుల్లో ఆశలు చిగురించాయి. సోమవారం క్వింటా ఏసీ మిర్చి ధర రూ.1,200, కొత్త మిర్చి ధర రూ.500 చొప్పున పెరగడంతో ఆనందం వ్యక్తమవుతోంది. గత బుధవారంతో పోల్చితే ఒక్కరోజే మిర్చి ధర భారీగా పెరిగింది. ఏసీ మిర్చి రూ.19,700, కొత్త మిర్చి ధర రూ.19,500లకు చేరింది. ఈ ఏడాదిలోనే ఇది అత్యధిక పెరుగుదల అని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నారు.
మార్కెట్లో కొన్ని వారాలుగా మిర్చి ధరలు నిలకడగా లేకపోవడంతో ఆందోళనకు గురైన రైతులు తాజాగా పెరిగిన ధర కొంత ఊరట ఇస్తున్నది. అయితే వాతావరణ మార్పులు, పంట దిగుబడి తగ్గడం, నాణ్యమైన మిర్చికి దేశీయ మార్కెట్లో డిమాండ్ ఉండడం వల్లే ధరలు ఒక్కసారిగా పెరిగినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు విక్రయానికి వచ్చే మిర్చి తగ్గిపోవడంతో వేలం పాటలో వ్యాపారుల మధ్య పోటీ సైతం నెలకొంది. దీనివల్ల ధరలు పెరిగినట్లు కూడా సమాచారం.
గత నెల వరకు పోల్చితే మిర్చి ధర కేవలం రూ.15 వేలకే పరిమితమైంది. వరుస సెలవుల తర్వాత మార్కెట్కు భారీగా మిర్చి చేరుకోవడంతో రూ.20 వేల సమీపానికి చేరింది. మార్కెట్కు కొత్త మిర్చి భారీగా వస్తుండడంతో ధరలో పురోగతి కనిపిస్తున్నది. 2024లో మిర్చి క్వింటా ధర రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు పలికింది. రెండేళ్లుగా తెలంగాణ మిర్చికి విదేశాల్లో డిమాండ్ లేకపోవడంతో ఒక్కసారిగా ధర భారీగా పతనమైంది. కాగా, ఈ ఏడాది తెగుళ్లు, అధిక వర్షాల కారణంగా దిగుబడులు పూర్తిగా తగ్గాయి. ఏటా లక్ష ఎకరాల్లో సాగయ్యే మిర్చి ఈ ఏడాది కేవలం 40 వేల ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. సీజన్లో మార్కెట్కు వచ్చే సరుకు పెరిగినప్పటికీ ఇదే ధర కొనసాగాలని పంట సాగు చేసిన రైతులు కోరుకుంటున్నారు.