ఒకప్పుడు పిల్లలను మెడిసిన్ చదివించాలంటే తల్లిదండ్రులు.. ‘ అంత సొమ్ము మన దగ్గర ఉందా..? హాస్టల్ ఉంచి చదివించగలమా..? ఫీజులకు రూ.లక్షలకు లక్షలు కుమ్మరించగలమా..?’ అనుకునేవారు.. విద్యార్థులు కూడా ‘మెడిసిన్ అనేది సంపన్నులు మాత్రమే చదువుకునే కోర్సు.. పేద, మధ్యతరగతి వర్గాలకు సాధ్యమయ్యేనా..?’ అని ప్రశ్నలు వేసుకునేవారు.. అయితే కాలం మారింది.. సీఎం కేసీఆర్ వైద్య విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. స్వరాష్ట్రం రాకముందే రాష్ట్రవ్యాప్తంగా 5 మెడికల్ కళాశాలలు ఉండగా తెలంగాణ వచ్చిన తర్వాత కొత్తగా 29 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశారు. అడ్మిషన్లలో రాష్ట్ర విద్యార్థులకు ప్రాధాన్యం ఇచ్చి అతి తక్కువ ఫీజుతో కోర్సులు చదువుకునేలా చర్యలు తీసుకున్నారు. దీనిలో భాగంగా గతేడాది కొత్తగూడెంలో మెడికల్ కళాశాలలో తరగతులు ప్రారంభమయ్యాయి. ఖమ్మం కాలేజీలో ఇటీవల తరగతులు ప్రారంభమయ్యాయి. దీంతో మెడిసిన్ సీట్లు పొందిన విద్యార్థులు, పిల్లల కల నెరవేర్చినందుకు తల్లిదండ్రులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. వారి అభిప్రాయాల మాలికతో ‘నమస్తే’ కథనం.
– ఖమ్మం, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మాది వైరా పట్టణం. తల్లిదండ్రులు నాగేంద్రప్రసాద్, మాధవీలత. నాన్న ప్రస్తుతం తిరుమలాయపాలెం ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అమ్మ గతంలో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. తర్వాత మా కోసం గృహిణిగా మారారు. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి నన్నెంతో ప్రోత్సహించారు. నేను వైరా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివాను. అధ్యాపకులు చదువుకు ఎంతో సహకరించారు. చిన్నప్పటి నుంచి నాకు మెడిసిన్ చదవాలనే కోరిక. నీట్లో మంచి మార్కులు సాధించేందుకు శ్రమించా. 3,265 ర్యాంక్ సాధించా. కొత్తగూడెం మెడికల్ కళాశాలలో సీటు పొందాను.
– నిబానపుడి శ్రీసత్యలీన, మెడిసిన్ విద్యార్థిని
వైద్య విద్య చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించారు సీఎం కేసీఆర్. స్వరాష్ట్రం రాకముందు రాష్ట్రవ్యాప్తంగా కేవలం ఐదు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఉండేవి. వీటి పరిధిలో 850 మెడిసిన్ సీట్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం రాష్ట్రంలో మెడికల్ కళాశాలల సంఖ్య 29కి చేరింది. దీంతో మొత్తం 3,790 మెడిసిన్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఏడాది మరో800 సీట్లు అందుబాటులోకి రాను న్నాయి. దీంతో సీట్ల 4,590 సంఖ్య పెరగనున్నది. ఈ చొప్పున రాష్ట్రం రాకమునుపు ఇప్పుడు కలిపి ఐదు రెట్లు సీట్లు పెరిగినట్లు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 29 కళాశాలలు కొత్తగా ఏర్పడినట్లు. దీనిలో భాగంగా ఉమ్మడి జిల్లాలోని ఖమ్మం, కొత్తగూడెం మెడికల్ కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి. గతేడాది కొత్తగూడెం మెడికల్ కళాశాల ప్రారంభమవగా ఈ ఏడాది కూడా అడ్మిషన్లు పూర్తయ్యాయి.
ఖమ్మం ప్రధానాసుపత్రికి అనుసంధానంగా ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలను సీఎం కేసీఆర్ వర్చువల్ పద్ధతిలో హైదరాబాద్ నుంచి ప్రారంభించారు. ఒకప్పుడు పిల్లలను మెడిసిన్ చదివించాలంటే తల్లిదండ్రులకు రూ.లక్షలకు లక్షలు కుమ్మరించాల్సి ఉండేది. ప్రభుత్వ కళాశాలలో సీటు రాకపోతే ఇక సాధారణ, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఎంబీబీఎస్ చదవడం అసాధ్యం. కానీ సీఎం కేసీఆర్ ఆ కలను సాకారం చేశారు. మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసి అతి తక్కువ ఫీజుతో విద్యార్థులు మెడిసిన్ చదువుకునేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి కళాశాలలోనూ రాష్ర్టానికి చెందిన విద్యార్థులకే ఎక్కువ సీట్లు కేటాయించడం మరో విశేషం. ఉమ్మడి జిల్లాలోని రెండు మెడికల్ కళాశాలల్లో మెడిసిన్ సీట్లు పొందిన విద్యార్థుల ఆనందోత్సాహాలు రెట్పింపయ్యాయి. వారి తల్లిదండ్రులూ తమ కల నెరివేరిందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– భద్రాద్రి కొత్తగూడెం (నమస్తే తెలంగాణ)/ సారపాక/ టేకులపల్లి/సత్తుపల్లి/ముదిగొండ/వైరాటౌన్, సెప్టెంబర్ 16
పేద పిల్లలకు వరం..
మాది పాల్వంచ. కానీ న్యాయవాదిగా హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నా. మా పాప భవానీరెడ్డిని మెడిసిన్ చదివించాలనేది మా కోరిక. ఫ్రీ సీటు రాకుండా మెడిసిన్ చదివించడమంటే మధ్యతరగతి కుటుంబాలకు సాధ్యమయ్యే పనికాదు. సీఎం కేసీఆర్ పుణ్యమా అని జిల్లాకో మెడికల్ కళాశాల వచ్చింది. మాపాప ఎంసెట్లో 6 వేలు ర్యాంక్ సాధించి కొత్తగూడెం మెడికల్ కళాశాలలో మెడిసిన్ సీటు సాధించింది. ఇక్కడ మెడికల్ కాలేజీ రాకపోతే మేం చదివించే పరిస్థితి లేదు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పిల్లలు అతి తక్కువ ఫీజులతో మెడిసిన్ చదువుకునేందుకు వీలుగా సీఎం కేసీఆర్ వైద్యవిద్యలో మార్పులు తీసుకొచ్చారు. ఇంతకంటే మాకేం కావాలి. తెలంగాణలో పుట్టినందుకు ఇప్పుడు నాకెంతో గర్వంగా ఉంది.
– మెడిసిన్ విద్యార్థిని భవానీరెడ్డి తండ్రి లక్ష్మారెడ్డి
కల సాకరమైంది..
మాది ముదిగొండ మండలం కమలాపురం. మాది నిరుపేద కుటుంబం. నాన్న రామచంద్రం ఆటో డ్రైవర్. తల్లి సామ్రాజ్యం వ్యవసాయ కూలీ. నాకు చిన్నప్పటి నుంచి మెడిసిన్ చదవాలనే కోరిక ఉండేది. కానీ పేద కుటుంబంలో పుట్టి మెడిసన్ చదవడమంటే ఎంతో కష్టం అని అనుకున్నా. సీఎం కేసీఆర్ జిల్లాకో మెడికల్ కలశాల ఏర్పాటు చేయడంతో కల సాకారమైంది. నేను 1నుంచి 10 వరకు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోనే చదివాను. ఇంటర్మీడియట్ బైపీసీ కరీంనగర్లోని అలుగునూరు గురకులంలో పూర్తి చేశాను. అక్కడి యాజమాన్యం మాకు ఉచితంగా నీట్ కోచింగ్ ఇచ్చింది. ఎలాగైనా మెడికల్ సీటు సాధించాలని పట్టుదలతో చదివాను. ఇంటర్మీడియట్ ఇంగ్లిష్ మీడియంలో చదువుకోవడంతో నీట్కు ప్రీపర్ కావడం సులభతరమైంది. నీట్లో నేను యూజీ విభాగంలో ఆల్ ఇండియా 18,166 ర్యాంకు, క్యాటగిరీ ర్యాంకు 11,000 సాధించాను. నాకు ఎక్కడో సీటు వస్తుందని భయపడ్డాను. కానీ నా అదృష్టం ఖమ్మం మెడికల్ కళాశాలలోనే సీటు వచ్చింది. సీటు సాధించేందుకు అహర్నిశలు చదివాను. రూపాయి ఖర్చు లేకుండా మెడిసిన్ సీటు రావడం ఎంతో ఆనందాన్నిచ్చింది. నా కల సాకారమైంది.
– కుక్కల రమ్య, ఖమ్మం మెడికల్ కళాశాల విద్యార్థిని
ఖమ్మంలోనే సీటు వస్తుందనుకోలేదు..
మా అమ్మాయి మెడిసిన్ కోర్సు చదువుతానంటే ఎంతో ఖర్చు అవుతుందనుకున్నాను. ఎలా చదివించాలా అని మదనపడ్డాను. మాది రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం. రూ.లక్షలకు లక్షలు ఖర్చు చేసి చదివించాలంటే కష్టమే అనుకున్నా. కానీ సీఎం కేసీఆర్ కొత్తగా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడంతో కొత్త ఆశలు వచ్చాయి. మా అమ్మాయి కష్టపడి చదవి ఖమ్మం మెడికల్ కళాశాలోనే సీటు సాధించింది. అందుకు ఎంతో ఆనందంగా ఉన్నది. సీఎం కేసీఆర్ సార్ ప్రత్యేక చొరవతోనే మాలాంటి ఎంతోమంది పేద కుటుంబాలకు చెందిన పిల్లలకు మెడిసిన్ సీట్లు వస్తున్నాయి. సీఎం కేసీఆర్ సార్కు రుణపడి ఉంటాం.
– రామచంద్రం, మెడిసిన్ విద్యార్థిని రమ్య తండ్రి
నా కలను మా కుమార్తె సాధించింది..
నా పేరు ఎండీ ఫారూఖ్. మాది టేకులపల్లి. నాకు చిన్నప్పటి నుంచి మెడిసిన్ చదవాలనే కోరిక ఉండేది. కానీ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అది సాధ్యమయ్యే పని కాదు. నేను చిన్న వయస్సులోనే ఎన్నో ప్రైవేటు పనులు చేశా. మెళ్లగా వాచ్ రిపేరింగ్ నేర్చుకున్నా. వాచ్ రిపేర్ షాపు ప్రారంభించా. కానీ షాపు నడవలేదు. తర్వాత వ్యయప్రయాసలు పడి చెప్పుల షాపు పెట్టాను. నాలాగే మా కుమార్తె ఫిర్దోసికీ మెడిసిన్ చదవాలని కోరిక. మా అభిలాషను గమనించి కుమార్తె నీట్కు సిద్ధమైంది. నీట్లో మంచి ర్యాంక్ సాధించింది. సీటు ఎక్కడ వస్తుందో అని మదనపడ్డాం. కానీ ఖమ్మం మెడికల్ కళాశాలలోనే సీటు రావడం ఆనందాన్నిచ్చింది. నా కలను మా కుమార్తె సాకారం చేస్తున్నది. సీఎం కేసీఆర్ లోకల్ కాలేజీలు ఏర్పాటు చేయడంతోనే అది సాధ్యమైంది.
– మెడిసిన్ విద్యార్థిని ఫిర్దోసి తండ్రి ఫారూఖ్
కుమార్తెలను ఉన్నత స్థానాల్లో చూడాలన్నదే ఆకాంక్ష..
మాది సత్తుపల్లి. మాది సామాన్య కుటుంబం. నేను సత్తుపల్లిలోని మసీద్ ఎదురుగా ఆంత్రాలు కట్టి కుటుంబాన్ని పోషించుకుంటున్నా. భార్య అస్మా గృహిణి. మాకు ఇద్దరు ఆడపిల్లలు. పెద్ద కుమార్తె షఫియా కౌసర్, చిన్నకుమార్తె అతియా కౌసర్. వీరిద్దరినీ ఉన్నత చదువులు చదివించడమే లక్ష్యంగా పెట్టుకున్నా. పెద్ద కుమార్తె షఫియా కౌసర్ మెడికల్ సీటు సాధించింది.రూ.లక్షలకు లక్షలు పెట్టి ఎంబీబీఎస్ చదవించాలంటే ఎంతో కష్టంతో కూడుకున్న పని. సీఎం కేసీఆర్ పేద విద్యార్థులకు వైద్యవిద్యను దగ్గరు చేస్తూ వైద్యకళాశాలు తీసుకొచ్చారు. అతితక్కువ ఫీజుతో పిల్లలు మెడిసిన్ చదువుకునేందుకు అవకాశం కల్పించారు.
– మెడిసిన్ విద్యార్థిని కౌసర్ తండ్రి జాకీర్ అహ్మద్
మంచి డాక్టర్ అవుతాను..
మాది మధ్యతరగతి కుటుంబం. నాకు చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనే కల ఉంది. నేను 1-10వ తరగతి వరకు సత్తుపల్లిలో చదివా. ఏపీలోని ఉయ్యూరులో విశ్వశాంతి కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాను. అక్కడే మెడిసిన్ సీటు కోచింగ్ తీసుకున్నా. నీట్లో 443 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 8,609 ర్యాంకు తెచ్చుకున్నా. నాకు మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు వచ్చింది. కళాశాలలో ఇటీవల జాయిన్ అయ్యా. కళాశాల వాతావరణం ఎంతో బాగుంది. అక్కడ మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యరంగంపై ప్రత్యేక దృష్టి సారించి జిల్లాకో మెడికల్ కాలేజీ కేటాయించారు. మాలాంటి ఎంతోమంది విద్యార్థుల మెడిసిన్ కలను నెరవేర్చారు.
– మెడిసిన్ విద్యార్థిని షఫియా కౌసర్
మాటల్లో చెప్పలేని ఆనందం..
నేను ప్రైవేటుగా డాక్యుమెంట్ రైటర్గా పనిచేస్తున్నాను. మా కుటుంబం ఇప్పటికీ అద్దె ఇంట్లోనే ఉంటుంది. భార్య గృహిణి. మా పాప అపర్ణ మైథిలిని డాక్టర్ చదివించాలనేది మా కల. కానీ డాక్టర్ చదువు చదవాలంటే రూ.లక్షలు లక్షలు కుమ్మరించాలని అనుకునేవాళ్లం. జీవితాంతం సంపాదించినా పాపను డాక్టర్ చేయలేం అని నిర్ధారించుకున్నాం. భగవంతుడు సీఎం కేసీఆర్ రూపంలో వచ్చి కొత్తగూడేనికి మెడికల్ కళాశాల తీసుకొచ్చారు. మా పాపకు ఎంసెట్లో 2,400 ర్యాంకు వచ్చింది. సీటు ఎక్కడో వస్తదని భయపడ్డా. కానీ కొత్తగూడెంలోని సీటు వచ్చిందని తెలిసి ఆనందపడ్డా. అతి తక్కువ ఫీజుతో పాపను మెడిసిన్ చదివిస్తున్నా. పాపకు ఉచిత హాస్టల్ వసతి లభించింది. పాప మెడిసిన్ చదువుతున్నందుకు చెప్పలేని ఆనందం.
– మెడిసిన్ విద్యార్థిని ఈగ అపర్ణ మైథిలి తండ్రి శ్రీధర్
పేదలకు వైద్యసేవలందించడమే లక్ష్యం..
చిన్ననాటి నుంచి నాకు డాక్టర్ కావాలని నా కల. మాది మధ్యతరగతి కుటుంబం. నేను 1-10వ తరగతి వరకు సారపాకలో బీపీఎల్ స్కూల్లో చదివా. ఇంటర్మీడియట్ హైదరాబాద్లోని శ్రీచైతన్య కాలేజీలో పూర్తి చేశా. తర్వాత రెండేళ్లపాటు ఇంట్లో ఉండే నీట్కు ప్రిపేర్ అయ్యా. తల్లిదండ్రులు దేవిరెడ్డి వెంకట్రామిరెడ్డి, ధనలక్ష్మి నన్నెంతో ప్రోత్సహించారు.మెడిసిన్ సీటు కోసం నేను రోజుకు 15 నుంచి 16 గంటల పాటు చదివేదానిని. నీట్లో 510 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 2,031 ర్యాంకు సాధించా. ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కళాశాల నిర్మించడంతో నేను కొత్తగూడెం మెడికల్ కళాశాలలో మెడిసిన్ సీటు సాధించా. శుక్రవారం నుంచి తరగతులకు హాజరవుతున్నా. కళాశాలలో ల్యాబ్, లైబ్రరీతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఎంబీబీఎస్ పూర్తి చేసి పేద ప్రజలకు వీలైనంత వైద్య సేవలు అందించడమే ధ్యేయంగా పెట్టుకున్నా. సీఎం కేసీఆర్ మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసి మాలాంటి మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు.
– దేవిరెడ్డి ప్రత్యూష, మెడిసిన్ విద్యార్థిని
ఏజెన్సీలో వైద్య విద్యా వెలుగులు
భద్రాద్రి జిల్లా రాష్ట్రంలోనే పూర్తి ఏజెన్సీ జిల్లా. ఇక్కడికి మెడికల్ కాలేజీ వస్తదని ఏనాడూ ప్రజలు ఊహించలేదు. సీఎం కేసీఆర్ ఒక మంచి ఆలోచన చేసి భద్రాద్రికి మెడికల్ కాలేజీ మంజూరు చేశారు. కళాశాలలో ఇప్పటికే రెండో సంవత్సర తరగతులు ప్రారంభమయ్యాయి. విద్యార్థులకు మెరుగైన హాస్టల్ వసతి కల్పించాం. విద్యార్థులకు సీనియర్ ఫ్యాకల్టీ పాఠాలు బోధిస్తున్నారు. మొదటి సంవత్సరంలో 10 మంది, ఈ ఏడాది 11 మంది జిల్లా విద్యార్థులు మెడిసిన్ సీట్లు పొందారు.
– డాక్టర్ లక్ష్మణరావు, కొత్తగూడెం మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్