జిల్లా మార్కెటింగ్ శాఖ కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశాల మేరకు కొద్ది రోజుల క్రితమే జిల్లాలో 10 సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పరిధిలో మూడు, మధిర ఏఎంసీ పరిధిలో మూడు, మద్దులపల్లి ఏఎంసీ పరిధిలో రెండు, నేలకొండపల్లి, వైరా ఏఎంసీల పరిధిలో ఒక్కోటి చొప్పున కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటిలో ఇప్పటి వరకు 12,590 క్వింటాళ్ల పత్తి పంటను కొనుగోలు చేశారు. ప్రస్తుతం మార్కెట్ యార్డుల్లో పత్తి పంటకు గరిష్ట ధర క్వింటాకు రూ.6,300 పలుకుతోంది. సీసీఐ మాత్రం ఈ ఏడాది మద్దతు ధరను క్వింటాకు రూ.7 వేలు నిర్ణయించి పంటను కొనుగోలు చేస్తోంది.
ఖమ్మం వ్యవసాయం, డిసెంబర్ 8: భారత పత్తి సంస్థ (సీసీఐ) ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 12,590 క్వింటాళ్ల పత్తిపంటను కొనుగోలు చేసింది. కలెక్టర్ వీపీ గౌతమ్ అదేశాల మేరకు కొద్ది రోజుల క్రితమే జిల్లా మార్కెటింగ్ శాఖ జిల్లాలో 10 సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పరిధిలో మూడు, మధిర ఏఎంసీ పరిధిలో మూడు, మద్దులపల్లి ఏఎంసీ పరిధిలో రెండు, నేలకొండపలి, వైరా ఏఎంసీల పరిధిలో ఒక్కోటి చొప్పున కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో జీఆర్ఆర్ జిన్నింగ్ మిల్ సెంటర్లో 1,469 క్వింటాళ్లు, అమరావతి టెక్స్టైల్స్ జిన్నింగ్ మిల్లులో 2,162 క్వింటాళ్లు, మంజీత్ కాటన్ మిల్ సెంటర్లో 1,381 క్వింటాళ్లు, శ్రీశివ కాటన్ మిల్లులో 887 క్వింటాళ్లు, ఉషశ్రీ కాటన్ మిల్లులో 2,235 క్వింటాళ్లు, ఎంఎస్ స్టప్లర్చ్ జిన్నింగ్ మిల్లులో 793 క్వింటాళ్లు, అలాగే, జీఆర్ఆర్ జిన్నింగ్ మిల్లు ద్వారా 2,604 క్వింటాళ్లు, శ్రీభాగ్యలక్ష్మి కాటన్ మిల్లు ద్వారా 1,056 క్వింటాళ్లను సీసీఐ బయ్యర్లు కొనుగోలు చేశారు.
మొత్తం పది కేంద్రాలను ఏర్పాటు చేయగా వాటిలో రెండు సీసీఐ కేంద్రాల్లో శుక్రవారం నాటికి క్రయవిక్రయాలు ప్రారంభం కాలేదు. మిగిలిన 8 కేంద్రాల్లో మాత్రమే సీసీఐ ఖరీదుదారులు పంటను కొనుగోలు చేస్తున్నారు. ఏటా ప్రారంభం నుంచి చివరి వరకు సీసీఐ సుమారుగా లక్ష క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేస్తుంటుంది. అయితే, ఈ ఏడాది శుక్రవారం నాటికి సీసీఐ 12 వేల క్వింటాళ్ల పంటను మాత్రమే కొనుగోలు చేసింది. ప్రస్తుతం మార్కెట్ యార్డుల్లో పత్తిపంటకు గరిష్ట ధర క్వింటాకు రూ.6,300 పలుకుతోంది. సీసీఐ మాత్రం ఈ సంవత్సరం మద్దతు ధరను క్వింటాకు రూ.7 వేలు నిర్ణయించి పంటను కొనుగోలు చేస్తోంది. ప్రైవేటు కంటే సీసీఐలోనే మంచి ధర ఉన్నప్పటికీ ఆ స్థాయిలో పంట కొనుగోళ్లు జరగడం లేదని రైతులు చెబుతున్నారు. ఒకవైపు అనేక నిబంధనలు, మరోవైపు సీసీఐ కొర్రీల కారణంగా సీసీఐ కేంద్రాలకు రైతులు పంటను తీసుకరావడానికి ఆసక్తి చూపట్లేదు. దీనికితోడు కొద్ది రోజుల నుంచి తేమశాతం పడిపోవడంతో పంట నాణ్యతా ప్రమాణాలు సీసీఐ నిబంధనలకు అనుగూణంగా ఉండడం లేదు. ప్రస్తుతం పొడి వాతావరణం నెలకొనడంతో తిరిగి సీసీఐ కొనుగోళ్లు జోరందుకునే అవకాశం కన్పిస్తోంది.