మామిళ్లగూడెం, డిసెంబర్ 28: తెలంగాణ రాష్ట్ర ప్రభుతం ప్రవేశపెట్టిన ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా అభయహస్తం ఆరు గ్యారెంటీల కోసం జిల్లా వ్యాప్తంగా మొదటి రోజు 25,351 దరఖాస్తులు అందాయని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. షెడ్యూల్ ప్రకారం జనవరి 6 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తామని, ఈ విషయంలో ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. గ్రామసభ ప్రారంభంపై ఖమ్మంలోని ఐడీవోసీలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దరఖాస్తుదారులు తమ అప్లికేషన్కు ప్రస్తుతం వారి వద్ద ఉన్న ఆధార్ కార్డు, రేషన్కార్డుల జిరాక్స్ కాపీలతోపాటు ఒక ఫొటో జత చేస్తే సరిపోతుందని అన్నారు. రేషన్ కార్డు లేనివారు గతంలో ఉన్న పాత రేషన్ కార్డులో కుటుంబ సభ్యులుగా ఉంటే దాని నెంబర్తో దరఖాస్తు చేయాలని సూచించారు. ఆధార్ కార్డులో తెలంగాణ అని ఉండాలంటూ, కుల ఆదాయ ధ్రువపత్రాలు కావాలంటూ బయట జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు. అలాంటివేమీ అక్కరలేదని స్పష్టం చేశారు. దరఖాస్తులు నింపే సమయంలో సందేహాలుంటే సభా ప్రాంగాణాల్లోని హెల్ప్ డెస్కులను సంప్రదించాలని సూచించారు. అనివార్య కారణాల వల్ల గ్రామ సభ జరిగిన సమయంలో దరఖాస్తుదారులు తమ అప్లికేషన్ను అందించలేకపోతే కంగారు పడాల్సిన పనేమీ లేదన్నారు. ఆ మరుసటి రోజు పంచాయతీలో గ్రామ కార్యదర్శికి, మున్సిపాలిటీల్లో అధికారులకు అందిస్తే సరిపోతుందని అన్నారు. వివిధ ధ్రువపత్రాలు, ఆధార్ కార్డులో చేర్పులు మార్పులు అంటూ ప్రజలెవరూ ఆందోళనతో మీసేవా కేంద్రాలకు వెళ్లొద్దని సూచించారు. ధ్రువపత్రాలు జత చేయాలంటూ సోషల్మీడియాలో జరుగుతున్న ప్రచారం పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు.
కూసుమంచి(నేలకొండపల్లి), డిసెంబర్ 28 : ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో ప్రతి దరఖాస్తును తీసుకోవాలని ప్రజలను ఇబ్బందులు పెట్టవద్దని కలెక్టర్ వీపీ గౌతం అన్నారు. నేలకొండపల్లి మండలం ఆరెగూడెంలో గురువారం ప్రజాపాలన గ్రామ సభ జరిగిన తీరును ఆయన సీపీ విష్ణు ఎస్ వారియర్తో కలిసి పరిశీలించి మాట్లాడారు. ఒకే రోజు దరఖాస్తులన్నీ ఇవ్వాలని లేదని వచ్చే నెల ఆరు వరకు దరఖాస్తులు తీసుకుంటారని తెలిపారు.
ప్రజల సమస్యలు పరిష్కారానికి గ్రామ సభలు ఏర్పాటు చేశారని, వాటిల్లో వారి వారి సొంత సమస్యలపై అర్జీలు తీసుకోవాలని సీపీ విష్ణు ఎస్ వారియర్ అన్నారు.గ్రామ సభలకు పోలీస్లు బందోబస్తు నిర్వహిస్తారని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
ముదిగొండ, డిసెంబర్ 28 : అభయహస్తం పథకాల అమలుకు నిర్వహిస్తున్న ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం గురువారం మండలంలో ప్రారంభమైంది. అమ్మపేట, మల్లన్నపాలెం, ఖాణాపురం, పండ్రేగుపల్లి గ్రామాల్లో అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. బాణాపురం గ్రామంలో కలెక్టర్ వీపీ గౌతమ్ పర్యటించగా ఆయన వెంట సీపీ విష్ణు వారియర్ కూడా ఉన్నారు. కలెక్టర్ అధికారులు, దరఖాస్తుదారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తరువాత మాట్లాడుతూ ప్రతి దరఖాస్తుకు రేషన్కార్డు నెంబర్ తప్పనిసరిగా ఉండాలనీ ఒక దరఖాస్తుకు ఒక నెంబర్ మాత్రమే ఉండాలనీ ఒకే నెంబర్ ఇద్దరు ఇస్తే ఆన్లైన్లో తీసుకోదని, దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమాల్లో తహసీల్దార్ వై రామారావు, ఎంపీడీవో అశోక్, ఎంపీవో సూర్యనారాయణ, ఎంపీపీ సామినేని హరిప్రసాద్, జడ్పీటీసీ పసుపులేటి దుర్గ, సర్పంచ్ మాలోజి ఉష, ఏవో రాధ, డీటీ రెహ్మాన్, ఆర్ఐలు వహీద, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.
తిరుమలాయపాలెం/ఖమ్మం రూరల్/కూసుమంచి, డిసెంబర్, 28 : మండలంలోని జోగులపాడు, తిమ్మక్కపేటలో ఎంపీపీ బోడ మంగీలాల్ ప్రజాపాలన దరఖాస్తులస్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మండల ప్రత్యేకాధికారి విజయనిర్మల గ్రామ సభల నిర్వహణను పర్యవేక్షించారు. రూరల్ మండలం బారుగూడెంలో గ్రామసభను నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్, డిప్యూటీ కలెక్టర్ ఎం రాజేశ్వరీ ప్రారంభించి తహసీల్దార్ పీవీ రామకృష్ణ, ఏసీపీ బస్వారెడ్డితో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి మాట్లాడారు. కూసుమంచి మండలం జక్కేపల్లి, జక్కేపల్లి ఎస్సీ కాలనీ, గన్యాతండా, గంగబండతండా ,లాల్సింగ్ తండా, సంధ్యాతండాల్లో జరిగిన గ్రామసభల్లో స్పెషల్ ఆఫీసర్, డీఎస్వో గంటా శ్రీలత పాల్గొన్నారు. అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.
మధిర/ఎర్రుపాలెం, డిసెంబర్28 : కోటి ఆశలతో ప్రజలు సంక్షేమ పథకాల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారని, అర్హులందరినీ గుర్తించి పథకాలు అందించాలని జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. నక్కలగరుబులో సర్పంచ్ మునగ వెంకట్రావమ్మ అధ్యక్షతన గురువారం జరిగిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లోని ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రజలకు సౌకర్యాలు కల్పించాలన్నారు. ఎర్రుపాలెం మండలం కండ్రిక, రామాపురం, భీమవరం హరిజనవాడ, లక్ష్మీపురం గ్రామాల్లో స్పెషల్ఆఫీసర్ వేణుమనోహర్, ఎంపీపీ దేవరకొండ శిరీష, జడ్పీటీసీ శీలం కవిత, తహసీల్దార్ ఎం.ఉషాశారద దరఖాస్తులు స్వీకరించారు.
పెనుబల్లి/సత్తుపల్లి టౌన్/తల్లాడ/వేంసూరు, డిసెంబర్ 28 : ప్రభుత్వం చేపట్టే ఆరు పథకాలు అర్హులందరికీ అందుతాయి… ఎవరూ ఆందోళన చెందవద్దని, జాగ్రత్తగా దరఖాస్తులు పూర్తిచేసి ఇవ్వాలని ఎమ్మెల్యే మట్టా రాగమయి అన్నారు. గురువారం ఆమె నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభల్లో పాల్గొన్ని దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వచ్చే నెల 6వ తేదీ వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఆరు గ్యారెంటీల అమలుపై ఎవరూ అపోహలు పడవద్దని అన్నారు. అధికారులను ప్రజల వద్దకు తీసుకురావడమే ప్రజాపాలన విధానమని, ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి సారథ్యంలో అర్హులైన ప్రతిఒక్కరికీ ఆరు గ్యారెంటీలు అందజేస్తామని అన్నారు. ఆయా మండలాల్లో అధికారులు ఆర్డీవో అశోక్చక్రవర్తి, స్పెషల్ ఆఫీసర్ ఆంజనేయులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కల్లూరు/సత్తుపల్లి రూరల్, డిసెంబర్ 28 : ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీమ్లు అర్హులందరికీ అందుతాయని ఆర్డీవో అశోకచక్రవర్తి అన్నారు. కొర్లగూడెం ప్రజాపాలన గ్రామసభలో అధికారులతో కలిసి గురువారం ఆయన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి మాట్లాడారు. ప్రతిఒక్కరూ దరఖాస్తులు చేసుకోవాలని, అర్హులను గుర్తించి పథకాలను అందజేస్తామన్నారు. మండలంలోని యాతాలకుంట గ్రామసభలో జడ్పీటీసీ కూసంపూడి రామారావు పాల్గొని దరఖాస్తులు స్వీకరించారు.
బోనకల్లు/చింతకాని, డిసెంబర్28 : సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని మండల అధికారులను ఖమ్మం ఆర్డీవో గణేశ్, డీఆర్డీవో పీడీ విద్యాచందన ఆదేశించారు. గురువారం మండలంలోని రామాపురం, గోవిందాపురం-ఎల్, నారాయణపురం, లక్ష్మీపురం గ్రామాల్లో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని వారు పరిశీలించి మాట్లాడారు. చింతకాని మండలంలో నిర్వహించిన గ్రామసభల్లో మొత్తం 907దరఖాస్తులు అందాయని ఎంపీడీవో తేళ్లూరి శ్రీనివాసరావు, తహసీల్దార్ ఎన్ రమేశ్ తెలిపారు. గ్రామసభలను డీఆర్డీవో పీడీ విద్యాచందన, ఆర్డీవో గణేశ్, వైరా ఏసీపీ రహమాన్, సీఐ సాగర్ సందర్శించారు.
వైరా రూరల్, డిసెంబర్ 28: ప్రజల వద్దకే ప్రజాపాలన వస్తుందని ఎమ్మెల్యే రాందాస్నాయక్ అన్నారు. గురువారం మండలంలోని కొష్టాల గ్రామ పంచాయతీలో ప్రజాపాలనలో భాగంగా ఆరు గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. దరఖాస్తులు దారులు ఆరు గ్యారంటీల దరఖాస్తు ఫారాన్ని నింపి సంబంధిత అధికారులకు అందజేయాలన్నారు. వైరా పట్టణంలో ఒకటి, రెండు వార్డుల్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, కమిషనర్ కరుణాకర్రెడ్డి ప్రారంభించారు. తొలుత ఆయా వార్డుల్లో ఇంటింటికీ తిరుగుతూ అప్లికేషన్ ఫామ్లు ఇస్తామని తెలిపిన అధికారులు సభ వద్దకు వచ్చినా దరఖాస్తుదారులకు దరఖాస్తులు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అంతేకాకుండా దరఖాస్తు ఫారంలో ఎలాంటి వ్యక్తిగత సమాచారం అడగకుండా ఆధార్కార్డు, రేషన్ కార్డు మాత్రమే ఇవ్వాలని చెప్పడంతో దరఖాస్తుదారులు అయోమయానికి గురవుతున్నారు.
ఖమ్మం, డిసెంబర్ 28: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన కార్యక్రమం రెండో రోజైన శక్రువారం నగరంలోని పలు డివిజన్లలో జరుగనున్నాయి. నగరంలోనీ 1, 3, 7, 8 డివిజన్ల పరిధిలో అధికారులు ప్రజాపాలన సభలను నిర్వహించి అభయహస్తం పథకాల దరఖాస్తులను ప్రజల నుంచి స్వీకరించనున్నారు. 1వ డివిజన్ సభలు కైకొండాయిగూడెం డివిజన్ కార్యాలయం, ఎస్సీ స్టడీ సర్కిల్లో, 3వ డివిజన్ సభలు బల్లేపల్లి ప్రాథమిక పాఠశాల, జడ్పీఎస్ఎస్ ఉన్నత పాఠశాల్లో, 7వ డివిజన్ సభలు టేకులపల్లి, డబుల్బెడ్రూమ్ కాలనీ, మహిళా ప్రాంగణాల్లో, 8వ డివిజన్ సభలు బాలపేట ప్రాథమిక పాఠశాల, డబుల్ బెడ్ రూం ఇళ్లు, గోపాలపురం ప్రాథమిక పాఠశాలల్లో జరుగనున్నాయి.
ఖమ్మం, డిసెంబర్ 28: ఆరు గ్యారెంటీల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన సభలు ఖమ్మం నగరంలో గురువారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు 5, 6, 9, 10, 11, 13, 17, 19, 24 డివిజన్లలో అధికారులు సభలను నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. మొదటి రోజు ఈ పది డివిజన్ల నుంచి 109 కౌంటర్ల ద్వారా 6,682 దరఖాస్తులు అందాయి.