సిబ్బంది ఎప్పటికప్పుడు మురుగు తొలగించాలి
ఖాళీ బాటిళ్లు, కొబ్బరి బోండాలు వేస్తే చర్యలు తప్పవు
సైడ్ కాలువల్లో మురుగు నిలువకుండా పూడిత తీయాలి
ప్రతి డివిజన్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలి
నగరంలో ‘పట్టణ ప్రగతి’ పనులను సత్వరం పూర్తి చేయాలి
నగర పర్యటనలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్
శ్రీనివాసనగర్లో రూ.30 కోట్లతో మురుగు నీటి శుద్ధి కేంద్రం
ఖమ్మం, జూన్ 16: ‘పట్టణ ప్రగతి’లో చేపట్టిన ప్రతి పనినీ పూర్తి చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సూచించారు. నగరంలోని పలు డివిజన్లలో గురువారం బైక్పై విస్తృతంగా పర్యటించిన ఆయన.. పారిశుధ్య పనులను పరిశీలించారు. చెరువుబజార్లోని పాత కబెళా వద్ద చేపట్టనున్న ప్రధాన కాలువ మురుగు తొలగింపు పనులను ప్రారంభించారు. అనంతరం మయూరి సెంటర్, ముస్తాఫానగర్, స్టేషన్ రోడ్డు, కస్బాబజార్, కమాన్బజార్, రావిచెట్టు బజార్, చర్చికాంపౌండ్, ధంసలాపురం ప్రాంతాల్లో పర్యటించి ఆయా పనులను పరిశీలించి పర్యవేక్షించారు. ఆయా పనుల్లో స్వయంగా పాల్గొన్నారు. వైరా రోడ్డులోని బాబూరావు పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న కాల్వ పూడికతీత పనులను ప్రారంభించి స్వయంగా మురుగును తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుకాణాదారులు, వీధి వ్యాపారులు ఖాళీ బాటిళ్లు, కొబ్బరి బోండాలు, చెత్తాచెదారాన్ని డ్రెయిన్లలో వేయొద్దని సూచించారు.
సైడ్ కాలువల్లో నిత్యం పూడిక తీస్తూ మురుగు నీరు ఎక్కడా నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నాళా స్థలాల రక్షణకు చర్యలు చేపట్టాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కాలినడకన పర్యటిస్తూ నాళాలను పర్యవేక్షించాలని, అక్రమ కట్టడాలు, ఆక్రమణలపై చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే ప్రతి డివిజన్లో మూడు క్రీడా ప్రాంగణాల ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రజల విజ్ఞప్తుల మేరకు వారి వారి డివిజన్లలో అవసరమైన చోట అంతర్గత రోడ్లు, మురుగునీటి కాలువలు నిర్మించాలన్నారు. అనంతరం బోనకల్లు రోడ్డులోని లక్ష్మీ గార్డెన్స్ వద్ద 2022-23 గ్రీన్ బడ్జెట్తో ఏర్పాటు చేసిన నర్సరీని మంత్రి ప్రారంభించారు. మేయర్ నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా, సుడా చైర్మన్ విజయ్కుమార్, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, అసిస్టెంట్ కమిషనర్ మల్లీశ్వరి, ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్కుమార్, కార్పొరేటర్లు కర్నాటి కృష్ణ, ఆళ్ల నిరీషా తదితరులు పాల్గొన్నారు.
రూ.30 కోట్లతో మురుగు నీటి శుద్ధి కేంద్రం
నగరంలోని శ్రీనివాసనగర్లో ముఖ్యమంత్రి వాగ్దాన నిధులు రూ.30 కోట్లతో నిర్మించనున్న గోళ్లపాడు ఛానల్ మురుగు నీటి శుద్ధి కేంద్ర నిర్మాణ పనులకు మంత్రి అజయ్కుమార్ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గోళ్లపాడు కాలువ 10.40 కిలోమీటర్లు ఉండేదని, పట్టణీకరణ వల్ల ఈ కాలువకు ఇరువైపులా ఆక్రమణకు గురై మురుగుతో ప్రజలు ఇబ్బందులు పడేవారని అన్నారు. గతంలో ఖమ్మంలో పర్యటించినప్పుడు సీఎం కేసీఆర్ దీనిని గమనించి మురుగు నీటి శుద్ధి కేంద్రాన్ని మంజూరు చేశారని గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 10.40 కిలోమీటర్ల పొడవునా పీవరేజ్ పైప్లైపు పైపులు, 20 ఎంఎల్టీ సామర్థ్యం గల సీనరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, ముంపు నివారణకు 5.50 కిలోమీటర్ల మేర కాల్వల నిర్మాణం, ఆక్రమణల నిరోధానికి 17 కిలోమీటర్లు పొడవున ఫెన్సింగ్ మెష్, పార్కుల నిర్మాణం, పిల్లల ఆట పరికరాల ఏర్పాటు, ఓపెన్ జిమ్లు ఏర్పాటు, వాకింగ్ ట్రాక్, ప్లాంటేషన్, ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేశామని వివరించారు. ఇప్పటికే 812 ఆక్రమణలకు తొలిగించామన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నగరంలో ముంపు సమస్య ఉండదన్నారు. మురుగు నీటి శుద్ధితో శుద్ధి చేసిన నీటిని తిరిగి మున్నేరులో వదులుతామని, దీంతో అవి సాగు నీటికి ఉపయోగపడతాయని వివరించారు. ఈ నీటిని మొక్కలు, నర్సరీలకు సైతం వినియోగించవచ్చునని అన్నారు. 17, 28, 29, 30, 31, 33, 34, 35, 36, 46, 47, 48 డివిజన్ల ప్రజలకు మురుగు దుర్వాసన దూరమవుతుందని అన్నారు. కార్పొరేటర్లు ఆళ్ల నిరీష, ధనాల రాధ, నవ్యజ్యోతి, నాయకులు ముజాహిద్, మజీద్, లింగరాజు, నయిమ్, ప్రవీణ్, శేఖర్ పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు ప్రారంభం
రఘునాథపాలెం, జూన్ 16: ‘పల్లె ప్రగతి’తో గ్రామాల రూపురేఖలు మారిపోయాయని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. గురువారం ఆయన మండలంలోని హర్యాతండాలో రూ.31 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీలను ప్రారంభించి మాట్లాడారు. మండలంలో రూ.3 కోట్ల సీడీపీ, రూ.6 కోట్ల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, ఏఎంసీ చైర్మన్ లక్ష్మీప్రసన్న, జడ్పీటీసీ మాళోతు ప్రియాంక, ఎంపీపీ భుక్యా గౌరి, పంచాయతీరాజ్ ఈఈ ఏవీకే శ్రీనివాస్, తహసీల్దార్ నర్సింహారావు, ఎండీవో రామకృష్ణ, సర్పంచ్ మాళోతు కాంతి పాల్గొన్నారు.