ఖమ్మం వ్యవసాయం, నవంబర్ 24: ఖమ్మం వ్యవసాయ మార్కెట్ నిర్వహణ తీరు అన్ని విభాగాల్లోనూ అద్భుతంగా ఉందని వరంగల్ వ్యవసాయ మార్కెట్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం ప్రశంసలు కురిపించింది. వారం రోజుల క్రితం వరంగల్ వ్యవసాయ మార్కెట్లో ఖరీదుదారులు, సాగు రైతులకు మధ్య గోనె సంచుల వ్యవహారంపై ఘర్షణ జరిగిన విషయం విదితమే. దీంతో ఆ మార్కెట్లో క్రయవిక్రయాలను ఖరీదుదారులు ఒకరోజుపాటు నిలిపివేశారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు.. వ్యాపారులు, కార్మిక, రైతు సంఘాలు, అధికారులతో సమీక్షించారు.
పంటను గోనె సంచుల్లో తీసుకొస్తున్న రైతులకు పంటను కొనుగోలు చేసిన వ్యాపారులు గోనె సంచులకు నగదు చెల్లించడం లేదనే వాదన జరిగింది. అయితే పూర్తి అధ్యయనం కోసం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ను సందర్శించాలనే ఆదేశాలతో వరంగల్ ఏఎంసీ బృందం గురువారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ను సందర్శించింది. ఈ సందర్భంగా వారికి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, ఉన్నతశ్రేణి కార్యదర్శి మల్లేశం స్వాగతం పలికారు. వరంగల్ జిల్లా మార్కెటింగ్శాఖ అధికారి పీ.ప్రసాదరావు, వరంగల్ మార్కెట్ కమిటీ సెక్రటరీ రాహుల్, వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రధాన కార్యదర్శి వేద ప్రకాశ్లు తొలుత పత్తి, మిర్చి యార్డులను పరిశీలించారు.
అనంతరం ఈ-నామ్ విధానం అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం చైర్పర్సన్ చాంబర్లో ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రస్తుతం ఖమ్మం మార్కెట్లో ఒక్కో గోనె సంచికి రూ.25 చొప్పున రైతులకు చెల్లించే విధానంపై వారు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఖమ్మం వర్తకసంఘం భవనంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష కార్యదర్శులు చిన్ని కృష్ణారావు, మెంతుల శ్రీశైలంతో సమావేశమయ్యారు. గ్రేడ్ టూ అధికారి బజార్, వ్యాపారులు దిరిశాల వెంకటేశ్వర్లు, ముత్యం ఉప్పలరావు, మాటేటి నాగేశ్వరరావు, సతీశ్, నల్లమల ఆనంద్, సంతోశ్, వరంగల్ రైతుసంఘం నాయకులు పాల్గొన్నారు.
Committee team visiting