కొత్త ఓటు నమోదుతోపాటు సవరణలకు ఎన్నికల సంఘం అవకాశం ఇచ్చింది. 2023 జనవరి 1వ తేదీకి 18 ఏండ్లు నిండే యువతీ యువకులు ఓటర్లుగా నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఇప్పటికే బీఎల్వోలు గత నెల 26, 27వ తేదీల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక క్యాంపులు నిర్వహించారు. ఈ నెల 3, 4 తేదీల్లో మరోసారి క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. యువత శిబిరాల వద్ద బీఎల్వోలకు దరఖాస్తులు సమర్పించవచ్చు. కొత్త ఓటు నమోదుకు ఈ నెల 8వ తేదీ వరకు గడువు ఉన్నది. ఓటరు ముసాయిదా జాబితా సవరణల ప్రక్రియను జిల్లా యంత్రాంగం వేగవంతంగా చేపడుతున్నది. జనవరి 5వ తేదీన తుది ఓటరు జాబితా ప్రకటించనున్నది.
అశ్వారావుపేట, డిసెంబర్ 1: ఓటు మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు. ఎన్నికల బరిలో నిలబడిన వారిలో మనకు నచ్చిన వ్యక్తులను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకునే వజ్రాయుధం. మెరుగైన సమాజ నిర్మాణంలో ఓటు హక్కు కీలకం. అందుకే పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఎన్నికల సంఘం ఏటా అర్హులకు ఓటు హక్కు కల్పించేందుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నది. రెవెన్యూశాఖ అధికారుల ద్వారా ఓటు హక్కు నమోదుపై అవగాహన కల్పిస్తున్నది.
ప్రస్తుతం ఎన్నికల సంఘం 2023 జనవరి 1వ తేదీకి 18 ఏండ్లు నిండే యువతీ యువకులు ఓటర్లు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ చొప్పున ఇప్పుడు 17 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న పిల్లలూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. తల్లిదండ్రులు సామాజిక బాధ్యతగా తీసుకుని తమ పిల్లలతో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేయించాలని ఈసీ భావిస్తున్నది. కొత్త ఓటర్లతో పాటు సవరణలకూ ఈసీ కోరుతున్నది. ఇప్పటికే బీఎల్వోలు గత నెల 26, 27వ తేదీల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక క్యాంపులు నిర్వహించారు. ఈ నెల 3, 4వ తేదీల్లో మరో సారి క్యాంపులు జరుగనున్నాయి.
యువత శిబిరాల వద్ద బీఎల్వోలకు దరఖాస్తులు సమర్పించవచ్చు. కొత్త ఓటు నమోదుకు ఈ నెల 8వ తేదీ వరకు గడువు ఉన్నది. పదో తరగతి సర్టిఫికెట్, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు, రేషన్కార్డు, ఆధార కార్డుతో పాటు వయస్సు ధ్రువపత్రాలు సమర్పించి ఓటు హక్కు పొందవచ్చు. గతంలో ఓటు హక్కు పొందిన వారు బూత్ లెవెల్ కేంద్రాలకు వెళ్లి ఓటరు జాబితాలో తమ పేర్లు ఉన్నాయో.. లేవో.. అన్న విషయాన్ని నిర్ధారించుకోవాలి. ఒకవేళ జాబితాలో పేరు లేకుంటే వెంటనే ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలి. మరోవైపు ఓటరు ముసాయిదా జాబితా సవరణల ప్రక్రియను జిల్లా యంత్రాంగం వేగవంతంగా చేపడుతున్నది. జనవరి 5న తుది ఓటర్లు జాబితా ప్రకటిస్తుంది.
కొత్త ఓటు నమోదుతోపాటు సరవణలకు ఎన్నికల సంఘం అవకాశం ఇచ్చింది. ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లో బీఎల్వోల నుంచి దరఖాస్తులు తీసుకోవచ్చు. ఫారం-6: కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకునే వారు ఫారం-6 తీసుకోవాలి. ఫారాన్ని నింపి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు, ఆధార్ కార్డు లేదా నివాస చిరునామా ధ్రువపత్రాలను బీఎల్వోలకు అందించాలి.
ఫారం-7: ఓటరు జాబితాలో పేర్ల తొలిగింపునకు ఫారం-7 పూర్తి చేయాలి. బీఎల్వోలు సమగ్ర విచారణ తర్వాత పేర్లు తొలిగిస్తారు.
ఫారం-8: పేరు, పుట్టిన తేదీల్లో తప్పులు ఉంటే సవరించేందుకు ఫారం-8 నింపాలి. సవరించాల్సిన పేరుకు సంబంధించిన డిక్లరేషన్, పదో తరగతి మెమో, డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఏదో ఒక గుర్తింపుకార్డు జత చేయాలి.
ఫారం-8ఏ: ఓటరు చిరునామా సవరణకు ఫారం-8ఏ నింపాలి. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారినప్పుడు పూర్వ చిరునామాకు సంబంధించిన గుర్తింపుకార్డు జిరాక్స్, ప్రస్తుత చిరునామా ధ్రువపత్రాన్ని జత చేయాలి.
ఫారం-6ఏ: ఎన్నారైలు ఫారం-6ఏ నింపాలి. అందుకు వారు నివసిస్తున్న దేశాల్లో సిటిజన్ మెంబర్షిప్ లేదని అక్కడి అంబాసిడర్తో డిక్లరేషన్ పత్రం జత చేయాల్సి ఉంటుంది.
జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం ఓటర్లు 8,98,409 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 4,39,769 మంది కాగా స్త్రీలు 4,58,612 మంది. వీరితోపాటు ఎన్ఆర్ఐలు 42 మంది, సర్వీస్ ఓటర్లు 729 మంది ఉన్నారు. ఎక్కువ మంది ఓటర్లు (2,24,250 మంది) కొత్తగూడెం నియోజకవర్గం, తక్కువ మంది ఓటర్లు (1,40, 346 మంది) భద్రాచలం నియోజకవర్గంలో ఉన్నారు.
18 ఏళ్లు నిండిన యువతీ యువకులు రాజ్యాంగం కల్పిస్తున్న ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలి. గత నెల 26, 27న బీఎల్వోలు పోలింగ్ కేంద్రాల వద్ద స్పెషల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. డిసెంబర్ 3, 4 తేదీల్లోనూ క్యాంపులు కొనసాగుతాయి. కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకునే యువత ఫారం-6ను పూర్తి చేసి అవసరమైన ధ్రువపత్రాలు జత చేయాలి. ఓటరు కార్డుల్లో సవరణలకూ ఓటర్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 8 వరకు గడువు ఉంది.
– కర్నాటి వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్, కొత్తగూడెం