చింతకాని, నవంబర్ 26: ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధమని ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాథ్ అన్నారు. జాతీయ ఎన్నికల కమిషన్, కలెక్టర్ ఆదేశాల మేరకు తిమ్మినేనిపాలెం ఉన్నత పాఠశాల విద్యార్థులకు చునావ్ పాఠశాల కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయన విద్యార్థులతో కలసి ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 18సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ ఓటు హక్కు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
బోనకల్, నవంబర్ 26: 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు నమోదు చేయాలని ఆర్డీవో రవీంద్రనాథ్ అన్నారు. ముదిగొండ మండలం వనంవారి క్రిష్ణాపురంలో ఏర్పాటు చేసిన ఓటరు నమోదు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఓటు ప్రాముఖ్యంపై గ్రామంలో అవగాహన కల్పించి పెద్దఎత్తున ఓటు నమోదు చేసుకునేలా చూడాలన్నారు.
ఎర్రుపాలెం, నవంబర్ 26: అర్హులైన ప్రతిఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని తహసీల్దార్ తిరుమలాచారి పేర్కొన్నారు. శనివారం మండలంలోని పలు గ్రామాల్లో ఓటు నమోదు కేంద్రాలను ఆయన ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. రాజ్యాంగంలో ఓటుహక్కు వజ్రాయుధం లాంటిందని, ప్రతిఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలని కోరారు.
చింతకాని, నవంబర్ 26: కలెక్టర్ గౌతమ్ ఆదేశాల ప్రకారం పల్లెల్లో ఓటర్ల నమోదు, సవరణ కార్యక్రమం పకడ్బందీగా చేపట్టాలని తహసీల్దార్ మాలోత్ మంగీలాల్ శనివారం అన్నారు. ఈ సందర్బంగా పలు గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను ఆయన తనిఖీ చేసి బీఎల్వోలకు పలు సూచనలు చేశారు. మండల వ్యాప్తంగా 49 పోలింగ్ కేంద్రాల్లో శని, ఆదివారాల్లో నూతన ఓట్లు నమోదు చేనున్నామని, శనివారం ఒక్కరోజే ఫారం-6 దరఖాస్తులు 103 అందాయని, 300కు పైగా చనిపోయిన వారి వివరాలు సేకరించామని, ఓటరు కార్డు సవరణ కోసం ఫారం-8 దరఖాస్తులు 9 అందాయని తెలిపారు. ఆదివారం నాడు ఆయా గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల్లో నూతన ఓటర్ల నమోదు, సవరణ కోరకు బీఎల్వోలు అందుబాటులో ఉంటారన్నారు.