ఒకప్పుడు పల్లెల్లో సరైన వసతులు లేక గ్రామస్తులు ఇబ్బంది పడేవారు. సమస్యలన్నీ ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే..’ అన్న చందాన పేరుకుపోయేవి.. వీధులు చెత్తాచెదారంతో నిండి ఉండేవి.. వానకాలంలో రోడ్లపై వరద ప్రవహించేది. కానీ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ‘పల్లె ప్రగతి’ అమలు చేసి గ్రామాలను అభివృద్ధి బాట పట్టించారు. ప్రతి పల్లెను సుందర వనాలుగా తీర్చిదిద్దారు.. డంపింగ్యార్డులు, ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు నిర్మించారు.. వీధుల పక్కన అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా మొక్కల పెంపకం చేపట్టారు. మొక్కలకు నీరు పెట్టేందుకు ప్రతి పంచాయతీకి ట్యాంకర్, చెత్త తరలించేందుకు ట్రాక్టర్ కేటాయించారు.. అంతటి విజయం సాధించిన ‘పల్లె ప్రగతి’ పై నేటి స్పెషల్ స్టోరీ..!
భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 14 (నమస్తే తెలంగాణ): నాడు సమస్యల వలయంలో చిక్కుకున్న పల్లెలు నేడు ప్రగతి పథంలో పయనిస్తున్నాయి. ‘పల్లె ప్రగతి’ పథకంలో భాగంగా ప్రతి పంచాయతీ క్లీన్ అండ్ గ్రీన్ అయింది. పల్లెలు, పట్టణాలు సుందరంగా మారాయి. పచ్చని మొక్కలు, చెట్లతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. జిల్లావ్యాప్తంగా ఉన్న 481 పంచాయతీలు ఇప్పుడు పరిశుభ్రతకు కేరాఫ్గా నిలుస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 1,280 పల్లె ప్రకృతి వనాలు, 100 బృహత్ వనాలు, డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు ‘పల్లె ప్రగతి దినోత్సవం’ జరుగనున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం.
కే్రంద, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలులో జిల్లా ముందు వరుసలో నిలుస్తున్నది. ప్రధానంగా పరిశుభ్రతలో జిల్లా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది. స్వచ్ఛ సర్వేక్షణ్-2022లో జిల్లా దేశంలోనే మూడో ర్యాంకు సాధించింది. కేంద్ర ప్రభుత్వం మిషన్ డైరెక్టర్, స్వచ్ఛ భారత్, జల్ జీవన్ మిషన్ అదనపు కార్యదర్శి జిల్లాకు ప్రశంసాపత్రాలు అందించారు. దేశవ్యాప్తంగా 22 స్వచ్ఛ సర్వేక్షణ్ బృందాలు అన్ని రాష్ర్టాల్లోని గ్రామాల్లో సర్వే చేపట్టాయి. సర్వేలో నెగ్గి జిల్లా నంబర్వన్ ర్యాంక్ సాధించింది. ఓడీఎఫ్లోనూ జిల్లా ముందంజలోనే ఉన్నది. స్వచ్ఛభారత్లో భాగంగా అధికారులు జిల్లావ్యాప్తంగా 89,506 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించారు. 32,791 ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో ఇంకుడు గుంతలు అందుబాటులోకి వచ్చాయి. ఇవి గాక ఇతర చోట్ల 1,331 ఇంకుడు గుంతలు నిర్మించారు. కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, పాల్వంచ ప్రాంతాల్లో డ్రై రిసోర్స్ కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. వీటిలో పాటు నాలుగుచోట్ల ఫికల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
జిల్లాలోని ప్రధాన రహదారుల వెంట విరివిగా మొక్కలు పెరుగుతున్నాయి. 384 కిలోమీటర్ల పరిధిలో మొక్కలు పచ్చందాలు పంచుతున్నాయి. అవెన్యూ ప్లాంటేషన్లో జిల్లా రాష్ట్రంలోనే టాప్లో నిలిచింది. జాతీయ రహదారుల పక్కన 2,30, 40 0 మొక్కలు పెరుగుతున్నాయి. జిల్లా అధికారులు జాతీయ రహదారుల్లో మొక్కలు నాటించి ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు. జాతీయ, అం తర్గత రహదారుల్లో అవెన్యూ ప్లాంటేషన్లో మొక్క లు నాటి జిల్లాకు మంచిపేరు తీసుకొచ్చారు.
తండాలు, గిరిజన గూడేలు పంచాయతీలుగా మారడంతో అభివృద్ధి సాధ్యమైంది. ప్రజలకు పాలన మరింత దగ్గరైంది. పల్లె ప్రగతిలో భాగంగా ప్రతి పంచాయతీకి ట్రాక్టర్, ట్యాంకర్ సమకూరింది. పారిశుధ్య కార్మికులు గ్రామాలను ఎప్పటికప్పుడు పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు. పల్లె ప్రగతి కారణంగా జిల్లాలోని పలు పంచాయతీలకు జాతీయ స్థాయిలో అవార్డులు వరించాయి.
– కలెక్టర్ దురిశెట్టి అనుదీప్
పల్లెప్రగతితో గ్రామాల్లో సమూల మార్పులు వచ్చాయి. కొత్త పంచాయతీరాజ్ వ్యవస్థను తీసుకురావడంతో అభివృద్ధి సాధ్యమైంది. అభివృద్ధి కోసం పంచాయతీలకు ప్రత్యేక నిధులు విడుదలవుతున్నాయి. గ్రామాల్లో పారిశుధ్యంతో వ్యాధులూ తగ్గుముఖం పట్టాయి.
– డీపీవో రమాకాంత్