– ఏఐఎస్ఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు బూర.మనోజ్
ఖమ్మం రూరల్, ఆగస్టు 01 : తెలంగాణ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఇటీవల ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల ఉపాధి అర్హతలపై మాట్లాడే క్రమంలో వారిని క్రిమినల్ వేస్ట్ అని సంబోధిస్తూ చేసిన వాక్యాలను ఏఐఎస్ఐ రాష్ట్ర సమితి సభ్యుడు బూర.మనోజ్ శనివారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇటువంటి వాక్యాలు చేయడం చాలా దురదృష్టకరమని అన్నారు. సీఎం వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఇంజినీరింగ్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపకులు, విద్యా సంస్థల మనోధైర్యాన్ని తీవ్రంగా దెబ్బతీసిందన్నారు. ఒకవైపు జెన్ జీ యువతకు గౌరవం ఇవ్వాలని, వారి ప్రతిభను వినియోగించుకోవాలని చెబుతూ, మరోవైపు ఇంజినీరింగ్ విద్యార్థులను కించపరిచేలా మాట్లాడడం ఆయన ద్వంద వైఖరికి నిదర్శనమన్నారు.
ఇంజినీరింగ్ విద్యార్థులు దేశ అభివృద్ధికి అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను సంపాదించేందుకు కష్టపడుతున్నారని, అలాంటి విద్యార్థుల మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇంజినీరింగ్ కళాశాలల పరిస్థితికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ఉన్నత విద్య శాఖలో పర్యవేక్షణలో లోపాలు, సరైన తనిఖీలు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, ఇంజినీరింగ్ విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే చర్యలు చేపట్టాలని మనోజ్ డిమాండ్ చేశారు.