మధిర, నవంబర్ 20 : తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మధిర నియోజకవర్గంలో పెనుమార్పులు వచ్చాయి. ఐదు మండలాలతోపాటు మధిర మున్సిపాలిటీలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతున్నది. 2014 నుంచి నేటివరకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కండ్లకు కట్టినట్లు కనపిస్తున్నది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల అభివృద్ధికి అహర్నిశలు కృషిచేస్తుంటే మధిర నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు దూరంగా ఉండిపోయారు. కానీ సీఎం కేసీఆర్ మాత్రం ఈ నియోజకవర్గ అభివృద్ధికి సుమారు రూ.800 కోట్లు విడుదల చేశారు. స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోకపోవడంతో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేశారు. దీంతో అభివృద్ధికి ఆమడదూరంగా ఉన్న గ్రామాలన్నీ పచ్చని పల్లెలుగా మారగా.. పట్టణాలు అందంగా తయారయ్యాయి. ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందడంతో బీఆర్ఎస్ ప్రభుత్వంపై చల్లని దీవెనలు కురుపిస్తున్నారు.
ఒకనాడు పూడికతో పూడుకుపోయి పిచ్చిమొక్కలు, రబ్బరుచెట్లు మొలిచి చెరువులన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. నీరు లేక వ్యవసాయానికి, తాగునీటికి ఇబ్బందులు తలెత్తాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ‘మిషన్ కాకతీయ’ పథకం ద్వారా నియోజకవర్గంలో బోనకల్లు, మధిర, ఎర్రుపాలెం, చింతకాని, ముదిగొండ మండలాల్లోని 122 చెరువులను రూ.18 కోట్లతో బాగుచేసింది. పూడికతీత, పిచ్చిచెట్లు తొలగించడంతోపాటు, తూములు, చెరువుకట్టల నిర్మాణాలు చేపట్టింది. దీంతో చెరువులు ఎప్పుడుచూసినా నేడు నీటితో కళకళలాడుతున్నాయి. రైతులకు సాగునీటి, ప్రజలకు తాగునీటి సమస్య పూర్తిగా తొలగిపోయింది.
ఒకనాడు తాగడానికి నీరు లేక బోరుబావులు, ఫ్లోరైడ్వాటర్ను తాగే పరిస్థితి ఉండడంతో ప్రజలు అనారోగ్యానికి గురయ్యేవారు. నేడు మిషన్ భగీరథతో గ్రామాలకు ఓవర్హెడ్ ట్యాంకులు ప్రభుత్వమే ఏర్పాటు చేసి, పైపులైన్ ద్వారా ప్రతి ఇంటికీ నల్లా ద్వారా స్వచ్ఛమైన నీటిని సరఫరా చేస్తున్నది. ఫ్లోరైడ్హ్రిత సమాజం కోసం 76,400 మంచినీటి పంపులను ఏర్పాటు చేసింది.
డబుల్ బెడ్రూం పథకం పేరుతో ప్రతి కుటుంబానికి రూ.5.50 లక్షలు నిధులు వెచ్చించి ప్రభుత్వమే పేదలకు సొంత గూడును నిర్మించింది. మధిర నియోజకవర్గంలో 779 డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి వారి కలను నెరవేర్చింది. అదేవిధంగా గృహలక్ష్మి పథకంలో 5000 ఇళ్లు మంజూరు చేసి పత్రాలను లబ్ధిదారులకు అందించారు. గతంలో ముదిగొండలో 150, బోనకల్లులో 100, ఎర్రుపాలెం 60, చింతకానిలో 259, మధిరలో 260 డబుల్ బెడ్రూంలను మంజూరు చేసింది.
ఉమ్మడి రాష్ట్రంలో దళితులను కనీసం పట్టించుకోకపోవడంతో పాలేరులుగా, కూలీలుగా మిగిలిపోయారు. దళిత కుటుంబాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ‘దళితబంధు’ పథకం పెట్టి చరిత్ర సృష్టించారు. ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఉపాధి కల్పన కోసం వారు ఎన్నుకున్న వ్యాపారానికి నిధులు ఇచ్చారు. మధిర నియోజకవర్గంలో చింతకానిలో పైలెట్ ప్రాజెక్టు కింద దళితబంధు పథకాన్ని అమలుచేయడంతో 3,462 కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున యూనిట్లను మంజూరు చేశారు. నియోజకవర్గానికి మరో వంద యూనిట్లు మంజూరు చేయడంతో మధిర మండలంలో 86 యూనిట్లు, ఎర్రుపాలెం 6, ముదిగొండ 5, బోనకల్లు 3 మొత్తం మధిర నియోజకవర్గంలో 3,562 యూనిట్లకు రూ.356,20 కోట్లు విడుదల చేశారు. దీంతో ఆ కుటుంబాలు ఉపాధి పొందుతూ అభివృద్ధి పథంలో పయనిస్తున్నారు.
నాడు గ్రామపంచాయతీగా ఉన్న మధిర క్రమేపీ నగర పంచాయతీగా రూపుదిద్దుకొని తెలంగాణ వచ్చిన తర్వాత మున్సిపాలిటీగా మారింది. మున్సిపాలిటీ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం వంద కోట్లను ఖర్చు చేస్తున్నది. వీటితో చిల్డ్రన్పార్క్, మధిర ట్యాంక్బండ్ నిర్మాణం, వెజ్ నాన్వెజ్ మార్కె ట్, నూతన కోర్టు భవన నిర్మాణాలు జరుగుతున్నాయి.
ఇవే కావు.. పేదలను ఆదుకుంటున్న పథకాలు ఎన్నో ఉన్నా యి. ఆడపిల్లల తల్లిదండ్రులకు భరోసాగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పేరుతో రూ.1,00,116 అందించి ఆర్థిక ఇబ్బందులు తొలగించింది. నియోజకవర్గంలో 8,228 ఆడపిల్లలకు రూ.76 కోట్ల చెక్కులను అందించి అండగా నిలిచింది. దివ్యాంగులకు రూ.4,016, వితంతువులు, వృద్ధులు, చేనేత కార్మికులు, బోదకాలు, ఒంటరి మహిళలకు రూ.2,016 చొప్పున వారి ఖాతాల్లో ఇప్పటివరకు నియోజకవర్గంలో 44,252 మంది ఆసరా పెన్షన్దారులకు వారి రూ.92 కోట్లను అందజేసింది.
ప్రతి గ్రామంలో పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేయడంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది. ఏ గ్రామానికి వెళ్లిన సీఎం కేసీఆర్ మార్క్ కచ్చితంగా కనిపిస్తున్నది. నియోజకవర్గంలో 185 పల్లె ప్రకృతి వనాలను నిర్మించి దానికోసం 32,03,75,000 ఖర్చు చేసింది. ప్రతి గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో వైకుంఠధామాలను నిర్మించింది. నియోజకవర్గంలోని 132 గ్రామాల్లో మొత్తం రూ.146 కోట్లను ఖర్చు చేసింది. బోనకల్లు, చింతకాని, ఎర్రుపాలెం మండలాల్లో రూ.50 లక్షల వ్యయంతో ఒక్కొక్క భవనాన్ని నిర్మించి పోలీసు అధికారులు, సిబ్బందికి ఇబ్బంది లేకుండా చేసింది. ఒక్కో పోలీస్స్టేషన్కు రూ.26 లక్షలతో రెండు వాహనాలను ఏర్పాటు చేసి ప్రజారక్షణకు నిధులు మంజూరు చేసింది.
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘రైతుబంధు’ పథకంతో రైతులు వ్యవసాయాన్ని ఉత్సాహంగా చేసుకుంటున్నారు. విత్తనాలు, పెట్టుబడుల కోసం రైతుల వెన్నంటే ఉంటూ ప్రభుత్వం సహకారం అందిస్తుంది. వ్యవసాయం అంటే నేడు పండుగలా మారింది. నియోజకవర్గంలో 76,951 మంది రైతులకు రెండు పంటల సాగుకు ప్రతి ఎకరాకు రూ.10 వేలు చొప్పున ఏడాదికి రూ.740 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నది.
అప్పట్లో రైతు చనిపోతే ఆ కుటుంబం వీధిపాలయ్యేది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుబీమా పథకాన్ని అమలు చేస్తుండండంతో ఒక కుంట భూమి ఉన్న రైతు దగ్గర నుంచి ఎంత భూమి ఉన్న రైతుకైనా రూ.5 లక్షలు బీమా పథకాన్ని వర్తింపజేస్తున్నది. నియోజకవర్గంలోని 979 రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.48,95 కోట్లు వారి కుటుంబ సభ్యులకు అందించింది.
ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడం కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పల్లె దవాఖానలతోపాటు బస్తీదవాఖానాలను ఏర్పాటు చేసింది. మధిరలో కమ్యూనిటీ హెల్త్సెంటర్ ఉన్నప్పటికీ వైద్య సదుపాయాలు మెరుగుపరిచేందుకు మధిరలో రూ.34 కోట్లతో వంద పడకల ఆసుపత్రిని నిర్మిస్తున్నది. మన ఊరు- మన బడి పేరుతో పథకాన్ని అమలు చేసి నియోజకవర్గంలోని 96 పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టి కొత్త భవనాలు, మంచినీటి ట్యాంకులు, ల్యాబోరెటరీలు, మరుగుదొడ్ల నిర్మాణాలను ఏర్పాటు చేశారు. విద్యాభివృద్ధికి ప్రభుత్వం రూ.23 కోట్లు మంజూరు చేసి విద్యార్థులకు విద్యాసదుపాయాలను కల్పించింది.
మధిర నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్ రూ.800 కోట్లను మంజూరు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క ఈ నియోజకవర్గంలో ఏనాడు గ్రామాలు, మున్సిపాలిటీ అభివృద్ధి కోసం పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి మధిరను మున్సిపాలిటీగా మార్చి గ్రామాలను అభివృద్ధిపథంలో తీసుకెళ్లారు. ప్రతి ఇంట్లో రెండు, మూడు పథకాలు అందించారు. మధిర నియోజకవర్గం అన్నివిధాలా అభివృద్ధిపథంలో దూసుకుపోతున్నది. ప్రజల దీవెనలే ప్రభుత్వానికి శ్రీరామరక్ష.