Khammam | భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): ఆ ఊరి పరిసరాలన్నీ పచ్చగా కనిపిస్తాయి. ఎటు చూసినా ఆకుకూరల క్షేత్రాలు దర్శనమిస్తాయి. 500 కుటుంబాలు నివాసం ఉంటే పల్లెలో సుమారు 200 కుటుంబాలకు పైగా పెరటి పంటలనే ఆధారపడి జీవిస్తాయి. సుమారు 500 ఎకరాల్లో ఆకుకూరల సాగు జరుగుతున్నది. తెల్లవారేదే ఆలస్యం అందరూ వ్యవసాయ క్షేత్రాల్లోనే ఉంటారు. ఏ క్షేత్రానికి వెళ్లినా ఇంటిల్లిపాదీ ఆకుకూరలు కోస్తూ, ఏ ఇంటికి వెళ్లినా కోసిన కూరలను కట్టలు కడుతూ కనిపిస్తారు. ఆ గ్రామమే సుజాతనగర్ మండలంలోని రాఘవపురం. ఆ ఊరి రైతులపై నేటి ప్రత్యేక కథనం.
ఒకప్పుడు రాఘవాపురం గ్రామస్తుల్లో ఎక్కువ మంది కూలి పనులకు వెళ్లేవారు. తర్వాత ఒకరిద్దరు ఆకుకూరల సాగు ప్రారంభించారు. ఒకరిద్దరు కాస్త పదుల సంఖ్యకు చేరింది. క్రమేపీ పదుల సంఖ్య ఇప్పుడు వందల మందికి చేరింది. మొత్తానికి ఆ ఊరు ఆకుకూరల సాగుకు కేరాఫ్గా మారింది. రైతులు ఉపాధి పొందుతూనే సమీప గ్రామాల ప్రజలకు తాజా ఆకుకూరలు అందజేస్తున్నారు. తమ వ్యవసాయ క్షేత్రాల్లో మరికొందరు కూలీలకు ఉపాధి కల్పిస్తున్నారు. అలా ఆ గ్రామస్తులంతా పరస్పర సహకారం అందించుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఆర్థికంగా ఎదుగుతున్నారు.
ఇక్కడి రైతులు తోటకూర, గోంగూర, పాలకూర, బచ్చలకూర, మెంతికూర, చుక్కకూర, పుదీన, కొత్తిమీర, గంగబైల కూరలు ఎక్కువగా పండిస్తారు. ఉదయం కూరలు కోసి కట్టలు కట్టిన తర్వాత ఇంట్లోని మగవారు మోపెడ్లపై వాటిని సుజాతనగర్, చుంచుపల్లి, చండ్రుగొండ, సత్తుపల్లి, రుద్రంపూర్, పాల్వంచ, అన్నపురెడ్డిపల్లి, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, కొత్తగూడెంతో పాటు సమీప గ్రామాల్లోని విక్రయ కేంద్రాలకు తరలిస్తారు. ఏ కూరైనా వంద కట్టలకు సుమారు రూ.200 నుంచి రూ.300 వరకు హోల్సేల్ రేట్లకు విక్రయిస్తారు. ఒక్కో రైతు రోజుకు తక్కువలో తక్కువ రూ.వెయ్యి వరకు ఆదాయాన్ని ఆర్జిస్తారు. గరిష్ఠంగా రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు సంపాదిస్తారు.
గ్రామస్తులు తమకు ఉన్న కొద్దిపాటి భూమిలోనే రకరకాల ఆకుకూరలు పండిస్తారు. దీంతో ఒక పంటలో ఆదాయం తగ్గినా మరో పంట ద్వారా ఆ లోటును భర్తీ చేసుకునేలా ప్లాన్ చేస్తారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలకు ప్రాధాన్యం ఇచ్చి పండిస్తారు. కరోనా సంక్షోభం తర్వాత ఎక్కువ మంది ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో శరీరానికి ఎక్కువ పోషకాలు అందించే ఆకుకూరలు కొనేందుకు ఆరోగ్యాభిలాషులు ఆసక్తి చూపుతున్నారు. వారి అవసరాలకు తగ్గట్టు రైతులు ఆకుకూరలు పండిస్తున్నారు. ఎక్కువ పెట్టుబడులు పెట్టి వాణిజ్య పంటలు పండించి నష్టపోయే కన్నా, చిన్న చిన్న కమతాల్లో రకరకాల కూరగాయలు, ఆకుకూరలు పండించి లాభాలు ఆర్జిస్తున్న రాఘవాపురం రైతులను కొందరు ఆదర్శంగా తీసుకున్నా వారి భవిష్యత్తు బంగారు బాటే.
మాఊరి రైతులంతా ఆకుకూరలే పండిస్తారు. కుటుంబ సభ్యులంతా భాగస్వాములు అవుతారు. మగవాళ్లు ద్విచక్రవాహనాలపై విక్రయ కేంద్రా ల్లో ఆకుకూరలు వేసి వస్తారు. భూమిలేని వారు మా క్షేత్రాల్లోనే పని చేస్తారు. వారికి రోజు కూలి గిడుతుంది. ఇప్పుడు మా ఊరి ప్రజలకు కూలి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేదు. ఉన్న ఊరిలోనే ఉపాధి పుష్కలం. – పెంటి రాము, రైతు
భార్యాభర్తలిద్దరం రోజూ వ్యవసాయ క్షేత్రంలోనే ఉంటాం. ఇంటిల్లిపాదీ సాగు పనిలోనే ఉంటాం. ఆకుకూరలు పండి స్తూ మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నాం. ఆకుకూరల సాగుకు పెద్దగా పెట్టుబడి అవసరం ఉండదు. నీటి వసతి ఉంటే చాలు. కొద్దిపాటి స్థలంలోనే కూరలు పండించొచ్చు. చలికాలంలో పంటలను కాస్త తెగుళ్లు ఆశిస్తాయి. సస్యరక్షణ చర్యలు చేపడితే సులువుగా తెగుళ్లను నివారించొచ్చు.
– దొడ్డా సైదులు, రైతు
మార్కెట్లో ఆకుకూరలకు మంచి డిమాండ్ ఉంది. రైతులు ఎంత పండించినా అంతా అమ్ముడుపోతుంది. మా క్షేత్రంలో మా కుటుంబ సభ్యులతో పాటు ఇద్దరు కూలీలు పనిచేస్తారు. కూలి ఖర్చులు పోగా రోజుకు కనీసం రూ.వెయ్యి మిగులుతుంది. ఎప్పుడో ఒకసారి పంటలకు తెగుళ్లు వస్తాయి. ఆ సమయంలో జాగ్రత్తగా ఉంటే చాలు. మాకు నిత్యం ఆకుకూరలు తీసుకునే ఖాతాలు ఉన్నాయి. వారికి సకాలంలో కూరలు అందిస్తాం.
– ఆకుల వెంకటేశ్వర్లు, రైతు