రఘునాథపాలెం, మే 22 : వానకాలం సీజన్ సమీపిస్తోంది. మరికొద్ది రోజుల్లో రైతులు సాగు పనుల్లో నిమగ్నమైపోతారు. విత్తనాలను నాటిన రైతులకు యూరియా తప్పనిసరి అవుతుంది. కానీ, ఖమ్మం జిల్లాలో యూరియా నిల్వలు మాత్రం లేవు. కాంగ్రెస్ సర్కారులో యూరియా పేరెత్తితేనే రైతులు ‘అమ్మో..!’ అంటూ నోరెళ్లబెడుతున్నారు. ‘ఈ ఏడాది కూడా యూరియా కోసం బారులు తీరాల్సిందేనా?’ అనే భయాందోళనలో అన్నదాతలు ఉన్నారు. ఇప్పటివరకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళిక రూపొందించుకోకపోవడం, పకడ్బందీ కార్యాచరణ లేకపోవడంతో ‘ఈసారి కూడా క్యూలైన్ల పాట్లు తప్పవా?’ అనే సందేహాలను రైతులు వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది ముందస్తు వానలుంటాయని వాతావరణ శాఖ చెబుతోంది. జూన్ 3 నుంచే వర్షాకాలం మొదలవుతుందని కూడా తెలియజేసింది. దీని ప్రకారం మరికొద్ది రోజుల్లోనే వానకాలం సీజన్ మొదలవుతుంది. సీజన్ ప్రారంభమైందంటే ఎరువులు, యూరియాతోనే రైతులకు పని. అయితే, అటు ప్రభుత్వం, ఇటు జిల్లా వ్యవసాయ శాఖ యంత్రాంగం ఇప్పటివరకు సరైన కార్యాచరణ రూపొందించలేదనే విమర్శలు ఉన్నాయి. దీంతో సొసైటీల్లో ‘నో స్టాక్’ బోర్డులు దర్శన మిస్తున్నాయి. ప్రైవేటు దుకాణాల్లో నామమాత్రంగా స్టాక్ ఉన్నట్లు వ్యవసాయ శాఖ నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ముందుగా సొసైటీలు, ప్రైవేటు డీలర్లకు యూరియాను పంపిణీ చేస్తే తమకు సౌకర్యంగా ఉంటుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఎక్కడా సరైన విధంగా యూరియా నిల్వలు లేవు. సీజన్ మొదలైన తరువాత యూరియా కోసం రైతులు ఒకేసారి వచ్చే పరిస్థితి ఉంటుంది. అదే జరిగితే మళ్లీ దుకాణాల ఎదుట రైతులు బారులు తీరాల్సిన పరిస్థితులు కనిపిస్తాయి. నిరుడు ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఈ సమస్య తీవ్రంగా కనిపించింది. గతేడాది ఉత్పన్నమైన ఈ సమస్యను గుణపాఠంగా తీసుకొని ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం అప్రమత్తమై పకడ్బందీ ప్రణాళికను రూపొందించుకోవాల్సి ఉంటుంది. కానీ, ఆ దిశగా కార్యాచరణ లేదనే విమర్శలు ఉన్నాయి.
ఈ ఏడాది తమ దుకాణాల్లో యూరియా, డీఏపీ విక్రయాలు చేపట్టబోమని తెలంగాణ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పష్టం చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం నిరుడు డిసెంబర్ 20 నుంచి ఫెర్టిలైజర్ యాప్ను అమల్లోకి తీసుకొచ్చింది. దీని ద్వారా రైతులు ముందుగా బుక్ చేసుకొని నిర్ధారించిన సమయంలో ఎంపిక చేసుకున్న కేంద్రాలకు వెళ్లి యూరియాను తీసుకోవాల్సి వస్తోంది. అయితే, యాప్ అమల్లోకి వచ్చాక రైతులు ముందుగా బుక్ చేసుకొని కావాల్సిన ఎరువు మాత్రమే తీసుకుంటున్నారు.
అంతకుముందు యూరియా కోసం వచ్చే రైతులకు వాటితోపాటు డీఏపీ, కాంప్లెక్స్, ఎంవోపీ, ఎస్ఎస్పీ వంటి ఇతర ఎరువులను కూడా అంటగట్టి వ్యాపారపరంగా ప్రయోజనం పొందేవారు. కానీ, యాప్ వచ్చిన డీలర్లకు ఆ అవకాశం లేకుండా పోయింది. డీలర్లు ప్రస్తుతం రైతులు బుక్ చేసుకున్న ఎరువు మాత్రమే ఇవ్వాల్సి వస్తోంది. ఈ క్రమంలో ప్రైవేటు వ్యాపారులకు యూరియా విక్రయాలపై పెద్దగా మార్జిన్ లేకపోవడం, ఇతర ఎరువులను విక్రయించే పరిస్థితి లేకపోవడం వంటి కారణాలతో వారు వీటి విక్రయాలపై ఆసక్తి చూపడం లేదనే ప్రచారం సాగుతోంది. అయితే, యూరియాను యాప్లో బుక్ చేసుకునే పద్ధతి వల్ల నిరక్షరాస్యులైన కొందరు రైతులు కూడా ఇబ్బందులు పడిన ఘటనలు ఉన్నాయి.