సిటీబ్యూరో, (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నగర జీవనది అయినా మూసీకి పునర్జీవం పోస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి ప్రణాళికల వెనుక అతిపెద్ద విధ్వంసమే ఉందని స్పష్టమవుతున్నది. పర్యావరణాన్ని నిర్వీర్యం చేసే ప్రణాళికలతో చేపడుతున్న అధ్యయనాలు మూసీ పరీవాహాక ప్రాంతాన్ని కాంక్రీట్ నిర్మాణాలకు ఆవాసంగా మారుస్తోందన్నది స్పష్టమవుతున్నది. నదికి ఉన్న సహజ సిద్ధమైన రూపాన్ని, ప్రవాహా ప్రాంతాన్ని కాంక్రీట్ కాలువగా చేసే చర్యలకు పూనుకుంటున్నది.
మొదటి విడత కింద ప్రతిపాదించిన ఫేజ్-1ఏలో భాగంగా హిమాయత్సాగర్ నుంచి బాపుఘాట్ వరకు ఉన్న 9.2కి.మీలు, అదేవిధంగా ఫేజ్-1బీలోని ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు ఉన్న 11.3కి.మీ పరిధిలోనే ఏకంగా 199 హెక్టార్ల భూమిని అభివృద్ధి పేరిట కాంగ్రెస్ సర్కార్ కాంక్రీట్ పరిచేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో రెండు ఫేజ్లలోనూ చేపట్టే ప్రణాళికల్లో అభివృద్ధి పేరిట రిటైనింగ్ గోడలు, రోడ్లు, యూటిలిటీ కారిడార్లు, పార్కింగ్ జోన్లు తప్ప 90శాతం నది పరీవాహాక ప్రాంతాన్ని సర్కార్ వినియోగించుకునేందుకు సిద్ధమైంది.
మూసీ నది ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో 85-145 మీటర్ల వెడల్పుతో విస్తరించి ఉంది. కానీ ప్రాజెక్టు కింద నది ఇరువైపులా కాంక్రీట్ రిటైనింగ్ గోడలు నిర్మించడం ద్వారా నదిని నిరుపయోగంగా కాంక్రీట్ కాలువగా కుదించేలా ప్రణాళికలను కాంగ్రెస్ సర్కార్ సిద్ధం చేసింది. ఇరువైపులా 30మీటర్ల వెడల్పుతో సర్వీసు రోడ్లు అదనంగా నిర్మిస్తుండగా, నదికి ఇరువైపులా ఆర్సీసీ రిటైనింగ్ వాల్స్, గాబియాన్ గోడలను కట్టనున్నది. దీంతో సహజసిద్ధంగా ప్రవహించే నది రూపం మారి… నీటిని పీల్చుకునే నది గర్భం మాయమైపోనున్నది.
హైడ్రాలిక్స్, నదీ అభివృద్ధి పేఇట లక్షలాది ఘనపు మీటర్ల మట్టిని, నది అడుగున ఉన్న రాళ్లను తొలగించనుంది. దీంతో నది సహజ వాలును, ప్రవాహ గతి మారిపోనుండగా, భారీ స్థాయిలో నది ఉపరితలాన్ని తవ్వడం ద్వారా భూగర్భ జలాల పునరుద్ధరణ సామర్థ్యం పూర్తిగా దెబ్బతింటుందపి పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు.
ప్రతిపాదించిన చెక్ డ్యామ్ల నిర్మాణం వలన నీరు నిలిచిపోయి, సహజ సిద్ధంగా పారే నది కాస్తా మురుగు నీటి గుంటలా మారే ప్రమాదముందనీ వాపోతున్నారు. నది పర్యావరణాన్ని కాపాడే క్రమంలో కాంక్రీట్ గోడలు, భారీ భవనాలు ఎందుకునీ నగరవాసులు ప్రశ్నిస్తున్నారు సర్కారు చిత్తశుద్ధి ఉంటే… భారీ మౌలిక వసతుల కల్పన వల్ల సహజ పరివాహాక ప్రాంతానికి ఎలాంటి నష్టం లేకుండా అభివృద్ధి ప్రణాళికలను అమలు చేయాలని పర్యావరణవేత్తలు డిమాండ్ చేస్తున్నారు.