భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): భద్రాద్రి జిల్లాను ఆయిల్ ఫామ్ హబ్గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. కొత్తగూడెం ప్రగతి మైదానంలో శనివారం నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దినోత్సవంలో ఆయన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జిల్లా ప్రజలనుద్దేశించి మాట్లాడారు. జిల్లాలో పోడు రైతులు కూడా పామాయిల్ పంటలను సాగు చేసేందుకు అవకాశం కల్పించామన్నారు.
వచ్చే పుష్కరాల నాటికి భద్రాచలాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. కొత్తగూడెంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మాణానికి ఫిజుబిలిటీ వచ్చిందని, భూసేకరణ దిశగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. పర్యాటక రంగం ద్వారా మరింత ఉపాధి కల్పనకు ఊతమిస్తామని అన్నారు.

కిన్నెరసాని, భద్రాచలంలు పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చెందుతాయన్నారు. అలాగే, పరిశ్రమల పుట్టినిల్లుగా భద్రాద్రి జిల్లాకు మంచి పేరు ఉందని గుర్తుచేశారు. కేటీపీఎస్, బీటీపీఎస్, ఐటీసీ, నవభారత్, సింగరేణి వంటి పరిశ్రమలు ఈ జిల్లాలో ఉండడం ఎంతో గర్వకారణమని అన్నారు. లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సీతారామ ప్రాజెక్టు కూడా మన జిల్లాలో ఉండడం మన అదృష్టమని అన్నారు.
ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ మన ప్రాంతానికి సీతారామ ఒక వరం లాంటిదని అన్నారు. విద్య, వైద్యరంగాలకు ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. అభివృద్ధి పనులను కేవలం ప్రభుత్వమే చేస్తే సరిపోదని, ప్రజల భాగసామ్యం కూడా అవసరమని అన్నారు. అనంతరం, విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు, ఉద్యోగులకు మంత్రి ప్రశంసా పత్రాలు అందజేశారు. కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్రాజు, డీఎఫ్వో విక్రాంత్సింగ్, అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందన, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.