రఘునాథపాలెం జూన్ 5 ;ఉమ్మడి జిల్లాలో పారిశ్రామిక ప్రగతి పరిఢవిల్లుతున్నది. రోడ్ల విస్తరణ జరగడం, పరిశ్రమలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతుండడం, నీటి వనరులు అందుబాటులోకి రావడం, భూగర్భజలాలు ఉండడం వంటి అంశాలన్నీ పరిశ్రమల స్థాపనకు బీజం వేస్తున్నాయి. దీనికితోడు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించి సత్వరం పరిశ్రమలను నెలకొల్పేందుకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ‘టీఎస్ ఐపాస్’ విధానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు యూనిట్లు నెలకొల్పేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించి వారు సత్వరం పరిశ్రమలను నెలకొల్పేందుకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ‘టీఎస్ ఐపాస్’ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధానంలో 35 ప్రభుత్వ శాఖల నుంచి పరిశ్రమల స్థాపనకు క్లియరెన్స్ వస్తుంది. కొత్త యూనిట్ల స్థాపనకు ప్రభుత్వం నుంచి రాయితీలు, పోత్సహకాలు అందిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నారు. బ్యాంకులు సైతం పరిశ్రమల యాజమాన్యాలకు 80శాతం రుణాలను అందించేలా చర్యలు తీసుకున్నారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో ఉండడంతో పారదర్శకత వచ్చింది.
పరిశ్రమల స్థాపనకు ఉమ్మడి జిల్లా అనుకూలం..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రోడ్ల విస్తరణ జరగడం, తగినంత మ్యాన్ పవర్ లభిస్తుండడం, పరిశ్రమలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతుండడం, నీటి వనరులు అందుబాటులోకి రావడం, భూగర్భజలాలు దండిగా ఉండడం వంటి అంశాలన్నీ పారిశ్రామిక వేత్తలను ఆకర్షిస్తున్నాయి. మార్కెటింగ్, రవాణాకు రెండు జిల్లాలు అనువుగా ఉన్నాయి. గోదాములు, కోల్డ్ స్టోరేజీలు, రైస్ మిల్లులు, మామిడి పల్ప్, షుగర్ ఫ్యాక్టరీలు, సీడ్ ప్రాసెసింగ్, ఎగ్ ట్రేల తయారీ, అట్టల తయారీ, రైస్ మిల్లులు, ఎర్త్ మూవింగ్, ప్యాకింగ్ కంపెనీ వంటి యూనిట్లు నెలకొల్పేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా గ్రానైట్ పరిశ్రమలకు కేరాఫ్గా నిలుస్తున్నది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 400 గ్రానైట్ పరిశ్రమలు నడుస్తున్నాయి. పరిశ్రమల్లో వేలాది మంది ఉపాధి పొందుతున్నారు.
ఉభయ జిల్లాల్లో దరఖాస్తులు ఇలా..
పథకం ద్వారా ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు 925 యూనిట్లకు అనుమతులు వచ్చాయి. పారిశ్రామిక వేత్తలు రూ.1,295.30 కోట్ల పెట్టుబడి పెట్టారు. ఆ పరిశ్రమల ద్వారా ప్రస్తుతం 10,484 మందికి ఉపాధి లభించింది. భద్రాద్రి జిల్లాలో ఇప్పటివరకు పారిశ్రామికవేత్తలు రూ.22,053 కోట్ల పెట్టుబడి పెట్టారు. 429 యూనిట్లు నెలకొల్పారు. వీటి ద్వారా సుమారు 11 వేల మంది ఉపాధి పొందుతున్నారు.
‘పవర్ ప్లాంట్స్, ఐటీసీ పరిధిలో..
పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్) దశాబ్దాల నుంచి రాష్ర్టానికి విద్యుత్ వెలుగులు అందిస్తున్నది. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత మణుగూరులో ఏర్పాటైన భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (బీటీపీఎస్) కూడా రాష్ట్రంలోని చీకట్లను పారద్రోలుతున్నది. బీటీపీఎస్ నిర్మాణం, కేటీపీఎస్ విస్తరణకు రెండు యాజమాన్యాలు, ఇవేగాక భద్రాచలం ఐటీసీ, అప్పారావుపేటలోని పామాయిల్ ఫ్యాక్టరీ యాజమాన్యాలూ టీఎస్ ఐపాస్కు దరఖాస్తు చేసుకున్నాయి. ప్రభుత్వం నుంచి రాయితీలు, ప్రోత్సాహకాలు పొంది నాలుగు యాజమాన్యాలు రూ.20,053 కోట్లతో 2,081 యూనిట్లు నెలకొల్పాయి. వీటి ద్వారా ప్రస్తుతం 12 వేల మంది ఉపాధి పొందుతున్నారు.
‘టీ- ఐడియా’ ద్వారా..
పరిశ్రమల స్థాపనంలో ఓసీ, బీసీ పారిశ్రామికవేత్తలకు రాయితీ ఇచ్చేందుకు సీఎం ఏసీఆర్ తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధి పురోగతి పథకాన్ని (టీ-ఐడియా) అమలు చేస్తున్నది. పథకం లబ్ధికి ఇప్పటివరకు ఖమ్మం జిల్లావ్యాప్తంగా 2,329 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలకు రూ.68.85 కోట్ల్ల రాయితీ ఇచ్చింది. పథకం లబ్ధికి భద్రాద్రి జిల్లావ్యాప్తంగా 273 దరఖాస్తులు వచ్చాయి. సర్కార్ పారిశ్రామికవేత్తలకు రూ.27 కోట్ల రాయితీలు ఇచ్చింది. యూనిట్ల ద్వారా ప్రస్తుతం 750 మంది ఉపాధి పొందుతున్నారు.
‘టీ-ప్రైడ్’ రాయితీలు..
షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, దివ్యాంగుల అభ్యున్నతి కోసం సర్కార్ టీ-ప్రైడ్ పథకాన్ని అమలు చేస్తున్నది. పథకం ద్వారా పారిశ్రామిక వేత్తలకు పరిశ్రమలు, సేవాధారిత సంస్థల స్థాపనకు అదనపు రాయితీలు అందుతాయి. పథకం ద్వారా 2014 నుంచి ఇప్పటివరకు ఖమ్మం జిల్లాలో ఎస్సీలకు సంబంధించిన 1009 యూనిట్లకు రూ.67.67 కోట్లు, ఎస్టీల సంబంధించిన 1,116 యూనిట్లకు రూ.55.80 కోట్లు, దివ్యాంగులకు సంబంధించిన 80 యూనిట్లకు రూ.6.45 కోట్లు రాయితీ అందింది. భద్రాద్రి జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన 1,379 యూనిట్లకు రూ.72 కోట్ల రాయితీ అందింది. యూనిట్ల ద్వారా 1,100 మంది ఉపాధి పొందుతున్నారు. పథకం ద్వారా పారిశ్రామిక వేత్తలకు పారిశ్రామిక వాడల్లో ప్లాట్ల అలాట్మెంట్, పెట్టుబడి, స్టాంప్ డ్యూడీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ, అమ్మకపు పన్ను, విద్యుత్ చార్జీలు, పారిశ్రామిక భూముల కొనుగోలుపై రాయితీలు వర్తిస్తాయి. అలాగే ఉద్యోగుల నైపుణ్య అభివృద్ధికీ ప్రోత్సాహకాలు అందుతాయి. మహిళా పారిశ్రామిక వేత్తలకు అదనపు పోత్సహకాలు లభిస్తాయి.
‘టీఎస్ ఐపాస్’ దరఖాస్తు విధానం..
దేశవ్యాప్తంగా అతి తక్కువ సమయంలో పరిశ్రమల స్థాపనకు అనుమతులు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ. అనుమతులకు ప్రభుత్వం సింగిల్ విండో, స్వయం ధ్రువీకరణ, ఏకీకృత దారఖాస్తు విధానాన్ని అమలు చేస్తున్నది. అన్నీ పత్రాలు కలిపి పదిలోపే ఉంటాయి. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో ఉంటుంది. టీఎస్ ఐపాస్ లబ్ధిదారులు దరఖాస్తుదారులు రెండు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుంది. ఫారం-1లో పరిశ్రమ పేరు, చిరునామా, ఉత్పత్తి, ఉత్పాదక, పెట్టుబడి వ్యయం వంటి వివరాలను భర్తీ చేయాలి. ఫారం-2లో పరిశ్రమలో ఉత్పత్తితో పాటు ఇతర అనుమతులకు దరఖాస్తు చేయాలి. అనంతరం పారిశ్రామిక అధికారులు దరఖాస్తుదారుని పరిశ్రమ కేంద్రాన్ని సందర్శిస్తారు. అక్కడి వాస్తవ పరిస్థితులు, ఉత్పత్తి సాధన వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఏమైనా అభ్యంతరాలను గుర్తిస్తే దరఖాస్తుదారుడికి తెలియజేస్తారు. వాటిని పరిష్కరించుకోవాలని సూచిస్తారు. అన్నీ సరిగ్గా సాగితే కేవలం 15 రోజుల్లోనే పరిశ్రమ స్థాపనకు అనుమతులు ఇస్తారు. నిర్ణీత గడువులోపు అధికారులు అనుమతులు ఇవ్వకుంటే ప్రభుత్వం వారికి రోజుకు రూ.వెయ్యి చొప్పున జరిమానా విధిస్తుంది.
సులభంగా అనుమతులు..
నేను ఎగ్ ట్రే పరిశ్రమ నెలకొల్పాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాను. ఆన్లైన్లో టీఎస్ ఐపాస్కు దరఖాస్తు చేసుకున్నాను. ధ్రువపత్రాలన్నీ సక్రమంగా ఉండడంతో నెలరోజుల్లోపే మాకు అనుమతులు వచ్చాయి. ప్రభుత్వం అందించిన రాయితీలతో చకచకా పరిశ్రమ చేశాం. ప్రస్తుతం మా పరిశ్రమలో పది మంది ఉపాధి పొందుతున్నారు. పరిశ్రమలు నెలకొల్పాలనుకునే వారికి టీఎస్ ఐపాస్ వరం.
– పేరం రమాదేవి,శ్రీమాల్యాద్రి ఎగ్ ట్రే ఇండస్ట్రీ నిర్వహకురాలు, బూర్గంపహాడ్
టీఎస్-ఐపాస్ విప్లవం..
రాష్ట్ర ప్రభుత్వం దూరదృష్టితో ఆలోచించి టీఎస్ ఐపాస్ విధానాన్ని అమలు చేస్తున్నది. ఈ విధానం ఒక విప్లవం. గతంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు నెలకొల్పాలంటే సంవత్సరాలు పట్టేది. ఇప్పుడు ఆన్లైన్ విధానం అమలులోకి వచ్చిన తర్వాత నెలరోజుల్లోపే అనుమతులు ఇస్తున్నాం. పరిశ్రమలు వచ్చాక వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతున్నది. యువత ప్రభుత్వ రాయితీలు, ప్రోత్సాహకాలు సద్వినియోగం చేసుకొని ఎంట్రప్రెన్యూర్స్గా రాణిస్తున్నారు.
– సీతారాంనాయక్, భద్రాద్రి జిల్లా పరిశ్రమలశాఖ జీఎం
అద్భుత ప్రగతి..
సీఎం కేసీఆర్ విజన్తో రాష్ట్రం అన్ని రంగాల్లో అద్భుత ప్రగతి సాధించింది. సింగరేణి, కేటీపీఎస్, బీటీపీఎస్ వంటి అన్ని సంస్థలు దిగ్విజయంగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం పరిశ్రమలకు 24 గంటల పాటు కరెంట్ ఇస్తుండడంతో పరిశ్రమలు నిరంతరాయంగా నడుస్తున్నాయి. టీఎస్ ఐపాస్ మంచి ఫలితాలనిస్తున్నది. ఎంటర్ప్రెన్యూర్స్ పరిశ్రమలు నెలకొల్పి వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దూరదృష్టితోనే ఇదంతా సాధ్యమైంది.
– కలవల చంద్రశేఖర్,సింగరేణి ఎస్సీ లైజన్ ఆఫీసర్, కొత్తగూడెం