ఖమ్మం, మార్చి 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వివిధ రూపాల్లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వాహన చోదకులకు ప్రభుత్వం ఇచ్చిన అవకాశంపై అనూహ్య స్పందన లభిస్తోంది. తమ వాహనాలపై భారీగా పేరుకపోయిన చలాన్లను చెల్లింపును కారుచౌకగా వదిలించుకునేందుకు వాహనదారులు పెద్దసంఖ్యలో మీసేవా కార్యాలయాల ఎదుట బారులు తీరుతున్నారు. అన్ని రకాల వాహనాలకు సంబంధించి గతంలో విధించిన చలాన్లపై 75 శాతం రాయితీ కల్పించి 25 శాతమే చెల్లించే వెసులుబాటు ఇవ్వడంతో వాహనదారులు చలాన్ల కట్టడానికి పోటీ పడుతున్నారు.
ప్రజా భద్రతకు పెద్దపీట వేసిన తెలంగాణ ప్రభుత్వం రహదారి ప్రమాదాలు, ట్రాఫిక్ ఉల్లంఘనలపై ప్రత్యేక దృష్టి సారించింది. వాహనదారులు కనీసం భద్రతా ప్రమాణాలు పాటించకుండా వ్యవహరించడంతోపాటు ప్రభుత్వం విధించిన పలు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారు. దీంతో పోలీస్ శాఖ ఇలాంటి వాహనదారులకు పెద్ద ఎత్తున జరిమానాలు విధించింది. దీనిలో భాగంగానే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో 2018 నుంచి ఇప్పటి వరకు ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు. ఈ జరిమానాలు చెల్లించేందుకు ప్రజలు అంతగా ఆసక్తి చూపకపోవడంతోపాటు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల నుంచి ఖమ్మం నగరంతోపాటు పలు పట్టణాలకు వివిధ ఉపాధి పనుల కోసం వచ్చిన కార్మికులు, రైతులు అధికంగా ఉన్నారు. ట్రాఫిక్ నిబంధనలపై కనీస అవగాహన లేనివారు అధికంగా ఉండడంతోపాటు పోలీసులు విధించిన జరిమానాలు వారు చెల్లించే స్థితిలో వారు లేరు. దీని కారణంగా జరిమానాల చెల్లింపులు జరగడంలేదు. దీంతో ప్రజల పరిస్థితిని గమనించిన ప్రభుత్వం ప్రజలుల ట్రాఫిక్ ఉల్లంఘనలు, ఇతర కేసుల్లో చెల్లించే జరిమానాలో రాయితీ కల్పించింది. ప్రజలు ప్రస్తుతం వారి వాహనాలపై ఉన్న ఈ-చలాన్లలో 25 శాతం చెల్లిస్తే సరిపోతుందని పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వాహనదారులకు ఈ అవకాశం ఈ నెల 31 ఉంటుందని తెలిపింది.
కొవిడ్ నేపథ్యంలో తొలిసారిగా లాక్డౌన్ విధించిన సమయంలో వాహనాలు, దుకాణాలు సీజ్ చేయడంతోపాటు ఎపిడమిక్ డిసీజ్, ఈడీ యాక్ట్ల అమలులో భాగంగా కేసులు నమోదు చేశారు. ఆ సమయంలో 18,283 పిట్టీ కేసులు నమోదయ్యాయి. వాటిలో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన కేసులు 10,491తోపాటు మరో వెయ్యి మందిపై కేసులు నమోదు చేయడంతో పాటు వేల వాహనాలు సీజ్ చేశారు. రెండోసారి లాక్డౌన్ విధించినప్పుడు 16,426 కేసులు నమోదు చేయగా వాటిలో 2,361 వరకు పిట్టీ కేసులున్నాయి. భౌతికదూరం పాటించని ఘటనల్లో నమోదుచేసినవి 557 కేసులు, అధిక సంఖ్యలో జనం గుమికూడిన ఘటనల్లో 120 కేసులు నమోదయ్యాయి.
గడిచిన మూడేళ్లలో వాహనదారులు వివిధ సందర్భాల్లో ట్రాఫిక్, ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన సమావేశంలో పోలీసులు కేసులు నమోదు చేశారు. వాటిలో కొన్ని కేసుల్లో డిజాస్టర్ మేనేజెమెంట్ యాక్ట్ కింద 400 కేసులున్నాయి. 3,760 వాహనాలను సీజ్ చేశారు. మాస్క్ ధరించకపోవడంతో 2,016 కేసులు నమోదు చేయగా వాటిలో ఈ-చలాన్ కేసులు 1,018 ప్రకటించారు. 2019లో 2,961 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయగా 838 మందికి శిక్ష పడింది. 2020లో 851 కేసులకు గాను 158 మందికి, 2021లో 2,314 కేసులకుగాను 1,343 మందికి శిక్ష పడింది. మద్యం తాగి వాహనం నడిపిన వారిపై 11.88 లక్షల కేసులు నమోదు కాగా సుమారు రూ.27.40 కోట్లు జరిమానా విధించారు. ఆయా చలాన్లను నాన్ కాంటాక్ట్ కేసుల కింద వర్గీకరించి కెమెరాల ద్వారా కేసులు నమోదు చేశారు. వాటిల్లో 2019లో నాన్ కాంటాక్ట్ కింద 3,20,289 కేసులు నమోదు చేయగా వాటి ద్వారా రూ.5.80 కోట్లు, కాంటాక్ట్ కింద 21,148 కేసుల ద్వారా రూ.18 లక్షల జరిమానాలు విధించారు. 2020లో నాన్ కాంటాక్ట్ కింద 9,35,551 కేసులు నమోదు చేసి రూ.1.78 కోట్లు, కాంటాక్ట్ కింద1,012 కేసులు నమోదు చేసి రూ.1.68 లక్షలు, 2021లో నాన్ కాంటాక్ట్ కింద 4,47,078 కేసులు నమోదు చేసి రూ.13.12 కోట్లు, కాంటాక్ట్ కింద 44,773 కేసులు నమోదు చేసి రూ.32.5 కోట్లు ఫైన్లు వేశారు. వీటన్నింటికీ 75 శాతం రాయితీ ఇచ్చినా జిల్లా నుంచి సుమారు రూ.20 కోట్ల మేర ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరే అవకాశం ఉంది.