సత్తుపల్లి, జనవరి 24 : వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు, అధిక వర్షాలు, చలి తీవ్రత, పొగమంచు ప్రభావం మామిడి పూతపై తీవ్రంగా పడింది. ఏటా నవంబర్, డిసెంబర్ నెలల్లో మామిడి తోటలు పూతతో నిండిపోవడంతోపాటు సంక్రాంతి పండుగలోపే పిందెలు కాసి కళకళలాడేవి. కానీ.. ఈ ఏడాది పండుగ పోయినా పూత జాడ కనిపించడం లేదు. తోటలోని ఏ చెట్టు చూసినా కొత్త ఇగురు, పూత లేకపోవడంతో వెలవెలబోయి కనిపిస్తున్నాయి. జిల్లాలో పరిస్థితి ఇలాగే ఉంటే మామిడి పంట దిగుబడి ప్రశ్నార్థకంగా మారనున్నది.
జిల్లాలో 33 వేల ఎకరాల్లో మామిడి తోటలను రైతులు సాగు చేస్తున్నారు. సాధారణంగా మామిడి చెట్లకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టకుండానే సీజన్ వచ్చిందంటే విరగబూస్తాయి. అలాంటిది.. ఉద్యాన శాఖ అధికారుల సూచన మేరకు ఈ ఏడాది తోటల్లో అనేక సస్యరక్షణ చర్యలు చేపట్టినా పూత కనిపించడం లేదని పలువురు రైతులు దిగులు చెందుతున్నారు. ఏటా మామిడి వ్యాపారులు పూత దశలోనే తోటలను కొనుగోలు చేస్తారు. ఈ ఏడాది పూత సరిగా రాకపోవడంతో తోటల కొనుగోలుకు వ్యాపారులు ముందుకు రావడంలేదు. దీంతో మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు.
మామిడి తోటలో ఎకరాకు దాదాపు 100 నుంచి 150 వరకు మొక్కలు నాటుతున్నారు. వీటిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ.. పంట చేతికొచ్చే సమయానికి రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు పెట్టుబడికి ఖర్చు అవుతుందని రైతులు చెబుతున్నారు. అయితే తోటల్లో వందల సంఖ్యలో చెట్లు ఉన్నప్పటికీ ఒకటి, రెండు చెట్లకు మాత్రమే పూత పూస్తున్నదని, ప్రస్తుత పరిస్థితుల్లో పూత పరిస్థితిని చూస్తే ఈ ఏడాది పెట్టిన పెట్టుబడి కూడా చేతికి వస్తుందో.. లేదోనని.. రైతులు దిగులు చెందుతున్నారు. సాధారణంగా నవంబర్, డిసెంబర్ నెలల్లోనే పూతకొచ్చి జనవరి మాసంలో చిరు దశలో పిందెలు చేతికొస్తాయి. ఉగాది నాటికి ఆశించిన స్థాయిలో పంట దిగుబడి ఉంటుంది. కానీ.. ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నది. ఉద్యాన శాఖ అధికారులు మామిడి తోటలను సందర్శించి.. ఎలాంటి చర్యలు తీసుకుంటే పూత పరిస్థితి మెరుగవుతుందో అవగాహన కల్పించాలని రైతులు కోరుతున్నారు.
ఉష్ణోగ్రతల హెచ్చు తగ్గులు, అధిక వర్షాలతో మామిడి చెట్లకు పూత ఆలస్యంగా వస్తున్నది. జిల్లాలో 33 వేల ఎకరాల్లో మామిడి తోటలను రైతులు సాగు చేస్తుండగా.. సగానికి పైగా చెట్లకు పూత వచ్చింది. ఫిబ్రవరి, మార్చి వరకు మామిడి చెట్లకు పూత వచ్చే అవకాశం ఉన్నది. రైతులకు సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పిస్తున్నాం.
ఈ ఏడాది మామిడి చెట్లకు పూత కనిపించడం లేదు. గతంలో ఇప్పటికే చెట్లన్నీ పూతతో నిండి ఉండేవి. ఈ ఏడాది ఇప్పటివరకు ఏ చెట్టు చూసినా పూత కనిపించడం లేదు. సంక్రాంతి పండుగ తర్వాత పూత వచ్చినా అది నిలిచే అవకాశం తక్కువ. ఈసారి మామిడి దిగుబడి భారీగా తగ్గే అవకాశం ఉన్నది. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు.