Thirumalayapalem | పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యంతో గీత కార్మికులు ఉపాధి కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళ్తే..ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండలంలోని దమ్మైగూడెంలో గ్రామపంచాయతీ కార్యదర్శి రమేష్ నిర్లక్ష్యం వలన గీత కార్మికులకు జీవనాధారమైన ఈత చెట్లు కాలిపోయాయి. వివరాల్లోకెళ్తే దమ్మాయిగూడెం ఊర చెరువు పక్క కాలువలో ఉపాధి హామీ పనులు చేపట్టేందుకు కంపకట్టలను కూలీలతో తొలగించకుండా పంచాయతీ కార్యదర్శి నిప్పు పెట్టించాడు.
దీంతో చెత్తాచెదారానికి అంటించిన అగ్ని వ్యాప్తి చెంది చెరువుగట్టు పై ఉన్న ఈత చెట్లన్నీ కాలిపోయాయి. దీంతో గీత కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఉపాధి హామీ పనుల పేరుతో మంట పెట్టి మా జీవనాధారాన్ని మంటలో కలిపేశారని గీత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం చెట్లు తగలబడుతున్న వాటిని రక్షించేందుకు ప్రయత్నం కూడా చేయలేదని గీత కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈత చెట్లు కాలిపోయేందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను గీత కార్మికులు డిమాండ్ చేశారు.