International Yoga day | మనిషిలో ఏకాగ్రతను పెంచుతుంది.. అలసటను తగ్గిస్తుంది.. రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. నిత్యం పనులతో సతమతమయ్యే ఉద్యోగులు, వ్యాపారులు, ఇతర పనుల్లో తలమునకలయ్యే వారికి యోగా దివ్య ఔషధం మాదిరిగా పని చేస్తుంది. వివిధ రోగాలతో ఆస్పత్రుల చుట్టూ తిరిగే వారు యోగాపై దృష్టి సారిస్తే ఆరోగ్యవంతులుగా ఉంటారని యోగా గురువులు చెబుతున్నారు. బుధవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
– కొత్తగూడెం టౌన్, జూన్ 20
కొత్తగూడెం టౌన్, జూన్ 20 : ప్రస్తుత యాంత్రిక యుగంలో నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు బతుకు జీవన పోరాటంలో విశ్రాంతి అనేదే లేని పయనం… ఈ క్రమంలో ఎన్నో శారీరక, మానసిక, సామాజిక అనారోగ్య రుగ్మతలు, ఆస్పత్రుల చుట్టూ తిరిగినా నయం కానీ జబ్బులు.. వెరసి వీటన్నింటి నుంచి ఉపశమనం కలిగించే దివ్య ఔషధమే యోగా. నేటి పరిస్థితుల్లో యోగాపై ప్రాధాన్యత మరింత పెరిగింది. శిక్షకులూ పెరుగుతున్నారు. జిల్లావాసులు యోగాపై మరింత ఆసక్తి కనబరుస్తున్నారు. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా అనేక యోగా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు కావడమే కాకుండా హోం ట్యూషన్లు కూడా ఊపందుకున్నాయి.
యోగా మన జాతి సంపద
భారతదేశపు సంప్రదాయ కానుక యోగా విశిష్టతను ప్రపంచం నలుమూలలా ప్రచారం చేసేందుకు ఐక్యరాజ్య సమితి జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. దీన్ని పురస్కరించుకొని భారత ఆయుష్శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రజలు ఎంతో ఆనందంతో యోగాసనాలలో పాలు పంచుకుంటున్నారు. దీనిపై ఇటు ప్రభుత్వం సామాన్య యోగా విధివిధాన క్రమాన్ని 2016లో రూపొందించింది.
ఏకగ్రీవ తీర్మాణంతో యోగా దినోత్సవం
ఐక్యరాజ్య సమితి వేదికపై 27 సెప్టెంబర్ 2014న జరిగిన 69వ సమావేశంలో భారత ప్రధాని అంతర్జాతీయ యోగా దినోత్సవం జరపాలని పిలుపునిచ్చారు. ఐరాస 2014 డిసెంబర్ 11న 193 సభ్యదేశాల్లో 177దేశాలు ఏకగ్రీవ తీర్మానంతో జూన్ 21న ప్రతి ఏడాది యోగా దినోత్సవంగా జరిపేందుకు ఆమోదించింది.
సంఘటిత ఆరోగ్య సాధన…
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు నేడు అనేక సంస్థలు, సంప్రదాయ గురువులు యోగా ప్రాశస్త్యాన్ని తెలుసుకొని ముందడుగు వేస్తూ అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఆ సంస్థ వెలుగులో సిద్దార్ధ యోగా విద్యాలయం ఎంతో మంది యోగా మాస్టర్లు తయారు చేసింది. దీనిలో భాగంగా జిల్లాలో క్వాలిఫైడ్ మాస్టర్లు పెరిగారు. జిల్లాలో యోగా వ్యాప్తికి ప్రభుత్వరంగ అతిపెద్ద సంస్థ సింగరేణి కూడా నాలుగేండ్ల నుంచి సామూహిక యోగా కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
ఆరోగ్యమే మహాభాగ్యం
క్రీస్తు పూర్వం నుంచి యోగా అభ్యున్నతి కోసం మన దేశంలో ఎందరో కృషి చేశారు. ఆరోగ్యమే మహాభాగ్యం యోగా వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుంది. అందుకే ప్రపంచం అటువైపు చూస్తోంది. యోగాతో అలసటను ఆందోళనను ఒత్తిడిని తగ్గించుకొని, ఏకాగ్రత ద్వారా అద్భుతాలు సాధించవచ్చు.
– మల్లేష్ గురూజీ, సంకల్ప సమాధి యోగ ఫౌండర్ అధ్యక్షుడు