హాలియా, ఆగస్టు 12 : ‘శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమకు అక్రమంగా నీటిని తరలించుకుపోతోంది. ఆంధ్ర జలదోపిడీని అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది’ అని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. గురువారం హాలియాలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి వరదనీరు వచ్చి నిండినా నాగార్జున సాగర్కు నీటిని తీసుకురావడంతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిగులు జలాలను ఉపయోగించుకోవాలే తప్ప శ్రీశైలం ప్రాజెక్టులోని మిగులు జలాలను ఉపయోగించుకునే హక్కు వారికి లేదన్నారు.
గత పది రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు నుంచి 6 టీఎంసీల నీటిని అక్రమంగా రాయలసీమకు తరలించుకుపోతున్నా తెలంగాణ ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. రైతులను తప్పుదారి పట్టించేందుకే వరుణయాగం చేశారని విమర్శించారు. కృష్ణ, గోదావరి నదుల నీటిని సక్రమంగా ఉపయోగించుకోవడం లేదన్నారు, ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి, ఈ ప్రాంత రైతుల సంక్షేమంపై జిల్లా మంత్రులకు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కురాకుల వెంకటేశ్వర్లు, వడ్డే సతీశ్రెడ్డి, వర్రా వెంకట్రెడ్డి, నల్లగొండ సుధాకర్, పిడిగం నాగయ్య, కడమంచి శ్రీనివాస్, చేగొండి కృష్ణ, సురభి రాంబాబు, యడవల్లి నాగారాజు, చిట్టిపోలు శ్రీనివాస్, కురాకుల రవి, సైదాచారి, పిల్లి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.