Annabathula Ravindranath | ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఆయన ‘తొలి’ ఊపిరి.. ఆంధ్రా పాలకుల కుట్రలను 1969లోనే పటాపంచలు చేసిన ధీశాలి.. ‘నాన్ ముల్కి గో బ్యాక్..’ అంటూ గర్జించిన కేసరి.. నిరుద్యోగులను కూడగట్టి నూనూగు మీసాల ప్రాయంలో 12 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన విప్లవ కిషోరం.. ఆయనెవరో కాదు.. ఆరు దశాబ్దాల క్రితం పాల్వంచ కేంద్రంగా ఉద్యమించిన అన్నాబత్తుల రవీంద్రనాథ్. ఆయన ఉద్యమ స్ఫూర్తి.. తరతరాలకు కీర్తి..! తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు ‘అమరుల దినోత్సవం’ నిర్వహించనున్న నేపథ్యంలో ‘అన్నాబత్తుల’ పోరాట ప్రస్థానంపై ప్రత్యేక కథనం.
– ఖమ్మం, జూన్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఖమ్మం, జూన్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉద్యమ స్ఫూర్తికి ప్రతీక అన్నాబత్తుల రవీంద్రనాథ్. నాటి పాలకులు, అధికారులు తెలంగాణ ప్రాంత యువతకు దక్కాల్సిన ఉద్యోగాలను ఆంధ్రా ప్రాంతం వారికి కట్టపెడుతున్న కుట్రలను గ్రహించిన రవీంద్రనాథ్ 1969లోయువతలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని రగిలించారు. నాడు ఖమ్మం ఎస్ఆర్ఎండ్బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న రవీంద్రనాథ్ ఉద్యమ బాటలో నడిపించారు. నాడు పాల్వంచలో కేంద్ర ప్రభుత్వం స్పాంజ్ ఐరన్ కర్మాగారాన్ని నిర్మించగా, అక్కడి కొలువులన్నీ తెలంగాణ ప్రాంత నిరుద్యోగులకు దక్కకుండా ఉన్నతాధికారులు కుట్ర పన్నుతున్నారని తెలిసి తిరుగుబావుటా ఎగురవేశారు. ముల్కీ నిబంధనలు అమలు చేయాలని యువతను కూడగట్టి ఉద్యమించారు.
తెలంగాణ వస్తేనే ఇక్కడి ప్రజలు, నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని గొంతెత్తి చాటాడు. పాలకులు చేస్తున్న కుట్రలను తన వాగ్ధాటితో ఎలుగెత్తాడు. 12 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాడు. నాటి పాలకులు బలవంతంగా అన్నాబత్తులను అరెస్ట్ చేసి దీక్షను విరమింపజేశారు. ఇలా రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న మొదటి దశ ఉద్యమాన్ని అణచివేశారు. 2009లో ఉద్యమ నేత కేసీఆర్ తిరిగి తెలంగాణ ఉద్యమ నినాదాన్ని అందుకోవడంతో అన్నాబత్తుల ఎంతో సంతోషపడ్డారు. చివరి దశ ఉద్యమ సమయంలో తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, నేటి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఓ సందర్భంలో అన్నాబత్తులను కలిసి ఉద్యమం జరుగుతున్న తీరును ఆయనకు వివరించారు. తెలంగాణ స్వప్నం నెరవేరుతుందని చెప్పడంతో అన్నాబత్తుల ఎంతో ఆనందించారు. 23 జూలై 2013న అన్నాబత్తుల వయోభారంతో కాలం చేశారు.
అమరుల ఆకాంక్షలను సీఎం కేసీఆర్ నెరవేరుస్తున్నారు..
“కొట్లాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు తీసుకున్నారు. ఆయన నాయకత్వంలో తెలంగాణ అమరుల కలలు నెరవేరుతున్నాయి. రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో సకల సంతోషంగా ఉన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతున్నది. అమరుల ఆకాంక్షలైన ‘నీళ్లు, నియామకాలు, నిధుల’ను నెరవేర్చారు. కాళేశ్వరం వంటి ప్రాజెక్టు నిర్మించి పంటలకు సాగునీరు అందిస్తున్నారు. తెలంగాణ వస్తే రాష్ట్రంలో చీకట్లు అలుముకుంటాయని నాటి పాలకులు వెక్కిరించారు. కానీ సీఎం కేసీఆర్ రాష్ట్రం వచ్చిన కొద్ది నెలల్లోనే విద్యుత్ సమస్యలకు పరిష్కారం చూపించారు. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు రైతులకు భరోసానిస్తున్నాయి. కేసీఆర్ విజన్తో విద్యా వైద్య రంగాలో గణనీయమైన మార్పులు వచ్చాయి. బడి పిల్లలకు ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్య అందుతున్నది. కాంట్రాక్ట్ ఉద్యోగాలను క్రమబద్ధీకరించారు. పల్లె, పట్టణ ప్రగతితో అభివృద్ధికి బాటలు వేశారు. అమరుల కలలను సాకారం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అమరుల కుటుంబాలను 2016లో రాష్ట్ర ప్రభుత్వం ఆదుకున్నది. దీనిలో భాగంగానే మా కుటుంబానికి ఆర్థిక సాయం అందింది. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. కేసీఆర్ చేయూతతో ప్రస్తుతం మా కుటుంబం హాయిగా గడుస్తున్నది..’
– అన్నాబత్తుల రవీంద్రనాథ్ భార్య కోమలవల్లి