పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఆస్పత్రుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వాటి స్థాయిని పెంచుతూ సౌకర్యాలు కల్పిస్తోంది. 30 పడకలు ఉన్న ఆస్పత్రులను 100 పడకలకు అప్గ్రేడ్ చేస్తోంది. నిత్యం ఆరోగ్య సమస్యలతో బాధపడే వారికి స్థానికంగానే వైద్యం అందేలా.. గర్భిణులు పురిటినొప్పులతో అవస్థలు పడొద్దనే ఉద్దేశంతో సుఖప్రసవాలు చేసేందుకు ప్రత్యేక వైద్యులు, సిబ్బందిని నియమిస్తోంది. ఆరోగ్య తెలంగాణే లక్ష్యమంటూ ఆస్పత్రుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న సీఎం కేసీఆర్, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తిరుమలాయపాలెం ఆస్పత్రి అభివృద్ధికి రూ.4.50 కోట్ల నిధులు కేటాయించారు. త్వరలోనే 100 పడకల ఆస్పత్రి అందుబాటులోకి రానున్నది.
– తిరుమలాయపాలెం, ఆగస్టు 16
తిరుమలాయపాలెం, ఆగస్టు 16 : సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని ‘ఆరోగ్య తెలంగాణ’ వైపు నడిపిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తున్నారు. ఆసుపత్రుల్లో అధునాతన వైద్యసదుపాయాలు కల్పిస్తున్నారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి తిరుమలాయపాలెం పీహెచ్సీని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాలని సీఎం కేసీఆర్, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావును కోరగా వారు సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు ఆసుపత్రిని అప్గ్రేడ్ చేస్తూ సీఎం ఉత్తర్వులు జారీ చేశారు. ఆసుపత్రిలో వసతులు కల్పించేందుకు రూ.4.50 కోట్ల నిధులు కేటాయించారు. దీంతో గతంలో 30 పడకలు ఉన్న ఆసుపత్రి 100 పడకల ఆసుపత్రిగా మారనున్నది. అతి త్వరలో ఆసుపత్రిలో అన్నిరకాల వైద్యసదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.
చిన్న చిన్న రుగ్మతలైతే ఫర్వా లేదు గానీ క్లిష్టమైన ఆరోగ్య సమస్యలు వస్తే మండలవాసులు గతంలో ఖమ్మం నగరానికి పరుగులు పెట్టేవారు. ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి వేలకు వేలు ఫీజులు, మెడిసిన్కు చెల్లించేవారు. తిరుమలాయపాలెం పీహెచ్సీ అప్గ్రేడ్ అయితే ఇక అలాంటి వ్యయప్రయాసలకు తావే ఉండదు. ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో వైద్యారోగ్యశాఖ ఆసుపత్రిలో ఆధునాతన వైద్యపరికరాలు సమకూర్చనున్నది. వైద్యపరీక్షలకు అత్యాధునిక ల్యాబ్ అందుబాటులోకి రానున్నది. ఆసుపత్రిలో ఒక సివిల్ సర్జన్, నలుగురు డిప్యూటీ సివిల్ సర్జన్లు, 15 మంది వైద్యులు, 10 మంది ప్రత్యేక వైద్యనిపుణులు, 20 మంది నర్సులు, ఇద్దరు ఫార్మసిస్ట్లు, ల్యాబ్అసిస్టెంట్ ప్రజలకు వైద్య సేవలు అందిస్తారు. ఆసుపత్రి అప్గ్రేడ్ అయి అందుబాటులోకి వస్తే ఒక్క తిరుమలాయపాలెం మండల ప్రజలకే కాదు చుట్టు పక్కల మండలాలకు చెందిన ప్రజలకూ వైద్యసేవలు చేరవవుతాయి. ఆసుపత్రిని అప్గ్రేడ్ చేస్తున్నందుకు మండలవాసులు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డితో పాటు సీఎం కేసీఆర్, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
తిరుమలాయపాలెం పీహెచ్సీని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసినందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. ఉత్వర్వు ప్రకటన నాకెంతో ఆనందాన్నిచ్చింది. ఆసుపత్రి అప్గ్రేడ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తాం. యుద్ధప్రాతిపదికన వైద్యులు, సిబ్బంది నియామకాలు చేపడతాం.
– ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి
ఆసుపత్రి అప్గ్రేడ్ అయిన తర్వాత ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందుతాయి. మా సొంత మండలంలోని పీహెచ్సీ అప్గ్రేడ్ కావడం సంతోషాన్నిచ్చింది. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగానే ప్రభుత్వ ఆసుపత్రులను అప్గ్రేడ్ చేస్తున్నారు. పేదలకు వైద్యసేవలను మరింత చేరువ చేస్తున్నారు.
– ఎమ్మెల్సీ తాతా మధుసూదన్
తిరుమలాయపాలెం దవాఖాన పె ద్దాసుపత్రిగా మారుతుందని తెలిసి మేమేంతో ఆనందపడుతు న్నాం. గతంలో ఏదైనా పెద్ద ఆరో గ్య సమస్య వస్తే ఖమ్మం నగరానికి పోయేటోళ్లం. బస్సు ఖర్చులు, వైద్యం ఖర్చులు భరించలేని పరిస్థితి. ఇప్పుడు మా ఊర్లోని సర్కారు ఆసుపత్రే పెద్దాసుపత్రిగా మారుతుండడంతో మా కష్టాలు తీరుతాయి. పైసా ఖర్చు లేకుండా అన్నిరకాల వైద్యసేవలు అందుబాటులోకి వస్తే అంతకంటే మాకు కావాల్సింది ఏముంటుంది.
– ఎం. వెంకటేశ్వర్లు, గ్రామస్తుడు, తిరుమలాయపాలెం
మా ఊరులోని చిన్నాసుపత్రి పెద్దాసుపత్రిగా మారుతుందని తెలిసింది. సీఎం కేసీఆర్ సారు పేదోళ్ల గురించి ఆలోచించే నాయకుడు కాబట్టే సర్కార్ దవాఖానలను బాగు చేస్తున్నడు. మాలాంటి పేదోళ్లు ప్రవేట్ ఆసుపత్రికి వెళ్లి డబ్బులు గుల్ల చేసుకోకుండా మంచి పని చేస్తున్నడు. కేసీఆర్కు సారుకు వేల దండాలు.
– కొమ్ము లక్ష్మి, గ్రామస్తురాలు, తిరుమలాయపాలెం