న్యూఢిల్లీ : 80 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రక్షణ దళాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాల సిబ్బందికి 13 మరణానంతర పురస్కారాలతో కలిపి మొత్తం 78 శౌర్య పురస్కారాలను శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రకటించారు. ఈ అవార్డులలో తొమ్మిది కీర్తి చక్ర, 19 శౌర్య చక్ర, ఐదు సేనా పతకాలు (రెండవసారి అందుకున్నవి), 36 సేనా పతకాలు ఉన్నాయి. కీర్తి చక్ర గ్రహీతలలో 21 పారా(స్పెషల్ ఫోర్సెస్)కు చెందిన లెఫ్టినెంట్ కల్నల్ మనోజ్ ఫ్రాన్సిస్, మేజర్ చంద్ర రాఠీ ఉన్నారు. మరో ఏడు కీర్తి చక్రలను మరణానంతరం ప్రదానం చేశారు.
స్వాతంత్య్ర దినోత్సవ వేళ 21 మంది సీబీఐ సిబ్బంది రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం, ప్రతిభావంతులైన సేవాపతకాలు అందుకోనున్నారని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఒక ప్రకటనలో తెలిపింది.
పంద్రాగస్టు సందర్భంగా పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి 301 శౌర్య పతకాలను ప్రకటించినట్లు కేంద్రం శుక్రవారం వెల్లడించింది. ఈ పతకాలలో 197 పతకాలను మావోయిస్టు ప్రాంతాలలో సేవలు అందించిన వారికి అందజేయనున్నారు. మొత్తంగా 1,057 మంది పోలీసు, అగ్నిమాపక సిబ్బంది సేవా పతకాలకు ఎంపికయ్యారు.
ఛత్తీస్గఢ్ మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లో పాల్గొన్న 20 మంది బార్డర్ ఫోర్స్ సెక్యూరిటీ(బీఎస్ఎఫ్) సిబ్బంది సేనా పతకానికి ఎంపికయ్యారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర పారామిలిటరీ బలగాలలో అత్యధికంగా 86 శౌర్య, సేవా పతకాలను రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) దక్కించుకుంది.