కోస్గి, ఆగస్టు 14 : ఓ దళిత సర్పంచ్పై అధికార కాంగ్రెస్ పార్టీ నేత అధికార మదంతో విచక్షణ కోల్పోయి దాడికి యత్నించాడు. అడ్డొచ్చిన కుటుంబ సభ్యులను సైతం పరుష పదజాలంతో బెదిరిస్తూ వారిపై దాడికి యత్నించాడు. మాది అధికార పార్టీ, అధికారం మాదే.. అధికారులు మా వాళ్లే.. అంటూ ఎవరూ వినని భాషను ఉపయోగిస్తూ గ్రామ సర్పంచ్పై దాడికి యత్నించాడు. చుట్టు పక్కలవారు ఆపడానికి ప్రయత్నించినా వారిని సైతం కాదని సర్పంచ్తో పాటు అత ని కుటుంబ సభ్యులపై దాడి చేయడమే లక్ష్యంగా వారి ఇంటిపైకి వెళ్లిన ఘటన సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మండలంలో చోటు చేసుకున్నది.
బాధితులు ప్రత్యక్ష సాక్షుల కథనం మేర కు కోస్గి మండలం చెన్నారం గ్రామానికి చెందిన సర్పంచ్ కృష్ణ గురువారం రాత్రి అందరూ నిద్రపోయిన సమయంలో ఇంటి దగ్గర ఉండగా అదే గ్రామానికి చెందిన వార్డు మెంబర్ భర్త జీడీ వెంకటయ్య సర్పంచ్ కృష్ణ ఇంటికి వచ్చి మా వార్డులో స్తంభాలకు లైట్లు పడడం లేదంటూ చెప్పాడు. సమస్య విన్న సర్పంచ్ కృష్ణ శుక్రవారం ఉదయం సిబ్బంది రాగానే సరి చేయిస్తానని చెప్పాడు. అప్పటికే మద్యం మత్తు లో ఉన్న సదరు కాంగ్రెస్ నేత విచక్షణ మరిచి నిన్నెవడురా సర్పంచ్ చేసింది.. అంటూ వాగ్వాదానికి దిగాడు.
ఉదయం మాట్లాడదాం వెళ్లండి అంటూ సర్పంచ్ కృష్ణ సర్ది చెప్పే ప్రయత్నం చేసినా అతడు వినకుండా బూతులు మాట్లాడుతూ దాడికి యత్నించాడు. అప్పటికే గొడవ విషయం తెలుసుకున్న చుట్టు పక్కల వారు అక్కడికి చేరుకుని సర్ది చెప్పినా అతడు వినకుండా కులం పేరుతో దూషించినట్లు సర్పంచ్ కుటుంబ సభ్యులు తెలిపారు. మాది అధికార పార్టీ మమ్మల్ని ఎవడూ ఏం చెయ్యలేరు అంటూ వారిపై దాడికి దిగాడు. గంటపాటు సర్పంచ్ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడంతో భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అధికార కాంగ్రెస్ నేతలు బరి తెగించి
కోస్గి మండలంలో అధికార పార్టీ నేతలు అభివృద్ధి మరిచి పాలన చేతకాక దాడులకు దిగుతున్నారని కోస్గి బీఆర్ఎస్ నేతలు వెంకట్ నర్సిములు, మాజీ వైస్ ఎంపీపీ సాయిలు అన్నారు. సర్పంచ్ కృష్ణపై జరిగిన దాడి హేయమైనదని ఈ దాడిని ఖండిస్తున్నట్లు వారు తెలిపారు. సీఎం ఇలాకాలో ఇచ్చిన హామీల అమలు చేతకాక ప్రతిపక్ష నాయకులపై విచక్షణ మరిచి దాడులకు దిగుతున్నారని అన్నారు. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అని వ్యాఖ్యనించారు.
ఇలాం టి ఘటనలతో అధికార పార్టీ నేతలు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారని ప్రశ్నించారు. అనంతరం వారు సర్పంచ్ కృష్ణతో కలిసి పోలీసులతో విషయంపై చర్చించారు. అధికార మదంతో సర్పంచ్ను కులం పేరుతో దూషించిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.