కొత్తగూడెం ఎడ్యుకేషన్, జనవరి 4 : ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నదని, చిన్నతనం నుంచే విద్యార్థులకు ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన కల్పించాలని డీఈవో వెంకటేశ్వరాచారి అన్నారు. స్థానిక సింగరేణి ఉన్నత పాఠశాలలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై జిల్లాస్థాయి నాటికలు, ఏకపాత్రాభినయం పోటీలు నిర్వహించారు.
గురువారం జరిగిన పోటీల ముగింపు కార్యక్రమంలో డీఈవో పాల్గొని విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందించారు. అలాగే రాష్ట్ర నేషనల్ గ్రీన్ కార్ప్ ప్రాజెక్టు ఆఫీసర్ ఆఫీసర్ రాధిక, జిల్లా సైన్స్ ఆఫీసర్ చలపతిరాజులు ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్ధాల గురించి తమ అభిప్రాయాలను వెల్లడించారు. కార్యక్రమంలో ఎన్జీసీ కో ఆర్డినేటర్ ఎం.రాజశేఖర్, న్యాయ నిర్ణేతలు కొండల్రావు, సత్యనారాయణ, రాజు, కరుణ తదితరులు పాల్గొన్నారు.