ఖమ్మం రూరల్, మే 8: బీఆర్ఎస్ అంటేనే యావత్ తెలంగాణ ప్రజలకు భరోసా అని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి స్పష్టం చేశారు. నామా నాగేశ్వరరావు అంటే ఇక్కడి ప్రజలకు ఎంతో నమ్మకమని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మం రూరల్ మండలంలో మంగళవారం రాత్రి విస్తృత ప్రచారం నిర్వహించిన ఆయన.. ఆరెంపుల, కొండాపురం, చింతపల్లి, తల్లంపాడు, పొన్నెకల్, మద్దులపల్లి గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు.
అనంతరం, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, జడ్పీటీసీ యండపల్లి వరప్రసాద్తో కలిసి ఆయా గ్రామ కమిటీల బాధ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆది నుంచి బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే వెన్నుముక అని, ప్రతి ఎన్నికల విజయంలోనూ వారిదే ముఖ్య భూమిక అని గుర్తుచేశారు. అదే విధంగా ఈ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు పాలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో అధిక మెజార్టీ అందించాలని, ప్రభంజనం సృష్టించి పార్టీకి పూర్వవైభవం తేవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలపై గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలని అన్నారు. పార్టీ నాయకులు జీవన్కుమార్, గూడ సంజీవరెడ్డి, అక్కినపల్లి వెంకన్న, బండి సతీశ్, ముత్యం కృష్ణారావు, ఆనంద్, సుదర్శన్, రమణయ్య తదితరులు పాల్గొన్నారు.