సత్తుపల్లి టౌన్, డిసెంబర్ 28 : కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయనున్న ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఏర్పాటు చేసిన ప్రజాపాలన గ్రామసభల్లో అవగాహన కొరవడింది. దీంతో ప్రజలు అయోమయానికి గురయ్యారు. ఆరు గ్యారెంటీలకు సంబంధించి పథకాలకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు గురువారం అట్టహాసంగా గ్రామసభలు ప్రారంభమయ్యాయి. సత్తుపల్లి పట్టణంలోని 1, 2, 5, 6వ వార్డుల్లో జరిగిన సభల్లో చాలామంది ఏ పథకానికి దరఖాస్తు చేసుకోవాలో తెలియక అయోమయ పరిస్థితి నెలకొంది. కొన్నిచోట్ల దరఖాస్తు ఫారాలు కోసం వేచిచూడాల్సి వచ్చింది. ఒకటి, రెండు పథకాలకు మాత్రమే దరఖాస్తు చేసి అందజేశారు. తర్వాత తెలుసుకొని తాము ఆరు గ్యారెంటీలకు సంబంధించి దరఖాస్తు చేసుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ముందస్తుగా అధికారులు అవగాహన కల్పించకపోవడంతో గిజిబిజి నెలకొంది.
నాకు ప్రస్తుతం వృద్ధాప్య పింఛన్ వస్తున్నది. నాకు సొంత ఇల్లు లేదు. తిరిగి మళ్లీ వృద్ధాప్య పింఛన్ కోసమే దరఖాస్తు చేసుకున్నాను. ఉచిత పథకాలు ఇచ్చే విషయంలో నాకు ఎవరూ చెప్పకపోవడం, దరఖాస్తుఫారం ఎలా నింపాలనే దానిపై అవగాహన లేకపోవడంతో పింఛన్ కోసమే తిరిగి దరఖాస్తు చేసుకున్నాను.
గ్రామసభ వద్ద ఏ పథకానికి దరఖాస్తు చేసుకోవాలో చెప్పకపోవడంతో అయోమయానికి గురయ్యా. కేవలం వృద్ధాప్య పింఛన్కు మాత్రమే దరఖాస్తు చేసుకున్నా. అందులో మిగిలిన వాటి గురించి తెలియక.. అవగాహన లేమితో పింఛన్కు దరఖాస్తు చేసి అధికారులకు ఇచ్చా.