ఖమ్మం వ్యవసాయం, జూలై 17 : జిల్లాలో పత్తిసాగు మరోసారి భారీగా జరిగే అవకాశం స్పష్టంగా కనపడుతున్నది. మైదాన, ఆయకట్టు ప్రాంతాల్లో సైతం రైతులు పత్తి పంటను విరివిగా చేపట్టారు. ప్రస్తుత వానకాలం సీజన్లో ప్రధాన పంటగా పత్తి సాగు.. రెండో పంటగా వరిసాగు కనపడుతున్నది. సాగుకు మరికొంతకాలం గడువు ఉండడంతో పత్తితోపాటు వరిసాగు విస్తీర్ణం పోటాపోటీగా పెరగనున్నది. పత్తిసాగుకు అనువుగా జిల్లావ్యాప్తంగా నల్ల, ఎర్రనేలలు కలిగి ఉండడం, భౌగోళికంగా వాతావరణం సైతం అనుకూలంకావడంతో దశాబ్దాలుగా రైతులు పత్తి పంట పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. తక్కువ పెట్టుబడి.. మార్కెట్లో నిలకడమైన మద్దతు ధర లభిస్తుండడంతో సన్న, చిన్నకారు రైతులు మొదలుకొని భూస్వాముల వరకు పత్తిసాగుపై మక్కువ చూపుతున్నారు. దీనికితోడు పంట చేతికొచ్చే సమయంలో ప్రైవేట్, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉండడం కలిసొచ్చే అంశంగా రైతులు భావిస్తున్నారు.. తెలంగాణ పత్తికి గత రెండు సంవత్సరాల నుంచి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ పలుకుతుండడంతో నూతనోత్సాహంతో అన్నదాతలు సాగు చేస్తున్నారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా గత సంవత్సరం ప్రైవేట్ మార్కెట్లో పత్తి క్వింటాల్ రూ.10 వేలకు పైగా పలకడంతో రైతుల్లో మరింత ఆసక్తి పెరిగింది.
మండలాల వారీగా సాగు..
ప్రస్తుతం జిల్లా వ్యవసాయశాఖ అధికారుల గణంకాల ప్రకారం అన్నిరకాల పంటలు కలిసి 2లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. వీటిలో పత్తిసాగు 1,31,181 ఎకరాలకు చేరడం విశేషం. మండలాల వారీగా పరిశీలిస్తే బోనకల్ మండలంలో 13,394 ఎకరాలు, చింతకాని 14,510 ఎకరాలు, ఏన్కూరు 9,389 ఎకరాలు, కల్లూరు 1,311 ఎకరాలు, కామేపల్లి 6,803 ఎకరాలు, ఖమ్మంరూరల్ 6,566 ఎకరాలు, ఖమ్మంఅర్బన్ 155 ఎకరాలు, కొణిజర్ల 10,575 ఎకరాలు, కూసుమంచి 6,230 ఎకరాలు, మధిర 11,491 ఎకరాలు, ముదిగొండ 8,699 ఎకరాలు, నేలకొండపల్లి 1,693 ఎకరాలు, పెనుబల్లి 534 ఎకరాలు, రఘునాథపాలెం 7,013 ఎకరాలు, సత్తుపల్లి 202 ఎకరాలు, సింగరేణి 7,667 ఎకరాలు, తల్లాడ 2,459 ఎకరాలు, తిరుమలాయపాలెం 11,886 ఎకరాలు, వేంసూరు 249 ఎకరాలు, వైరా 1,284 ఎకరాలు, ఎర్రుపాలెం మరో 8,797 ఎకరాల్లో దూదిపంట సాగవుతున్నది.
రికార్డుస్థాయిలో ధర..
గతంలో కంటే ఈ సంవత్సరం పత్తిపంటకు మార్కెట్లో రికార్డుస్థాయి ధర పలికే అవకాశం స్పష్టంగా కనపడుతున్నది. ప్రసుత్తం మార్కెట్లో దూదిపంట అడుగంటిన పరిస్థితి ఉంది. జిన్నింగ్ మిల్లుల్లో, గోడౌన్ల బేల్స్ పూర్తిస్థాయిలో ఎగుమతి అయినట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా పత్తి బేల్స్ ఇతర దేశాలకు ఎగుమతికావడం వల్ల మార్కెట్లోకి పంట వచ్చిందే తరువాయి పంటను చేజిక్కుంచుకునేందుకు పత్తి ఖరీదుదారులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. దీనికితోడు తెలంగాణలో సాగవుతున్న పత్తికి నాణ్యతలో మంచిపేరు ఉండడంతో ఇతర రాష్ర్టాల వ్యాపారులు ప్రతి ఏటా జిల్లాలో మకాం వేసి పంటను కొనుగోలు చేస్తున్నారు. ప్రైవేట్ మార్కెట్లో రైతుకు మరింత ధర రావాలనే ఉద్దేశంతో భారత పత్తి సంస్థ(సీసీఐ) మద్దతు ధర ప్రకటించి గత కొద్ది సంవత్సరాలుగా పత్తి పంటను కొనుగోలు చేస్తున్నది. అయితే ప్రస్తుతం ప్రైవేట్ వ్యాపారులు సీసీఐ కంటే అధిక మొత్తం ధర నిర్ణయించి పంటను కొనుగోలు చేయడం విశేషం. దీంతో వచ్చే నూతన పంటకు సైతం ఈ సంవత్సరం ప్రైవేట్ వ్యాపారులు సీసీఐ కంటే అదనంగా ధర ప్రకటించి పంటను కొనుగోలు చేసే అవకాశం కనపడుతున్నది. ఈ సంవత్సరం పత్తిసాగు చేపట్టిన రైతుల ఇంట తెల్లబంగారం కనకవర్షం కురిపించనున్నది.
చీడపీడల నివారణపై దృష్టి
పత్తిపంటను ఆశించే చీడపీడల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాం. ఇప్పటికే హైదరాబాద్కు చెందిన పలు కంపెనీల నిపుణులు, వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్తవేత్తల సహకారంతో చీడపీడల నివారణకు అవగాహన కార్యక్రమాలు చేపట్టే విధంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. ముఖ్యంగా పత్తిని ఆశించే గులాబీ పురుగు ఉధృత్తిని ప్రారంభంలోనే గుర్తించి సకాలంలో లింగాకర్షక బుట్టలు పెట్టుకునే విధంగా ఏఈవోలు రైతులకు అవగాహన కల్పిస్తారు. ప్రస్తుతం పత్తిపంటలు ఆరోగ్యంగా కనపడుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో పత్తి సాగు చేసిన రైతులు వరద, మురుగునీటిని వెంటనే బయటకు పంపిస్తూ ఉండాలి. అనంతరం సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. మార్కెట్లో పత్తికి మంచి ధర ఉన్నందున రైతులకు మంచి ప్రయోజనం చేకూరనున్నది.
– ఎం.విజయనిర్మల, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, ఖమ్మం