పొరుగు రాష్ర్టాల నుంచి బతుకుదెరువు కోసం వలస వచ్చిన గొత్తికోయ ఆదివాసీలు ఉమ్మడి పాలనలో ఎన్నో ఏళ్లు పడరాని పాట్లు పడ్డారు. చేసుకోవడానికి చేతినిండా పనిలేక.. తాగేందుకు గుక్కెడు నీళ్లు లేక.. రాత్రుళ్లు విద్యుత్ లేక కటిక చీకట్లో బిక్కుబిక్కుమంటూ కుటుంబాలు మగ్గిపోయాయి. గతంలో ఏ సర్కారూ వీరి బాగోగులు పట్టించుకోలేదు. పనికోసం సుదూర ప్రాంతాలకు వెళ్లారు. వాగులు వంకల చుట్టూ తిరిగి చెలమ నీరు తెచ్చుకున్నారు. విద్యుత్ సౌకర్యం లేక ఏళ్లతరబడి చీకట్లోనే కాలం వెళ్లదీశారు. తెలంగాణ సిద్ధించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పొరుగు రాష్ర్టాల వలసవాసులూ మా బిడ్డలే అని అక్కున చేర్చుకుంది. గొత్తికోయగూడేల్లో వెలుగులు ప్రసాదించింది. మిషన్ భగీరథతో స్వచ్ఛమైన తాగునీరు, సోలార్ విద్యుత్ దీపాలు, చిన్నపిల్లల కోసం అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేసింది. పొద్దంతా వ్యవసాయ, కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకునే ఈ ఆదివాసీ బిడ్డలు ప్రభుత్వ పనితీరును మెచ్చుకుంటున్నారు.
– భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ)
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొన్నేళ్లుగా వలస వచ్చి జీవనం సాగిస్తున్న గొత్తికోయ ఆదివాసీలకు తాగునీటితోపాటు మౌలిక సదుపాయాలు కల్పించి అండగా నిలుస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. గత ప్రభుత్వాల పాలనలో వారు తాగునీరు లేక, విద్యుత్ సౌకర్య లేక, చేతినిండా పనిదొరకక ఇబ్బందులు పడిన కష్టాన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం వారిని తమ బిడ్డలుగానే భావిస్తూ మౌలిక సదుపాయాలు కల్పించింది. ఇలా ఒక్క గొత్తికోయగూడెంలోనే కాకుండా 85 గూడేల్లో ఉండే ఆదివాసీల కోసం ప్రభుత్వం సౌకర్యాలు కల్పించింది. వారి జీవన విధానానికి ఎలాంటి లోటు లేకుండా జిల్లా యంత్రాంగం భరోసా కల్పిస్తున్నది. వైద్య శిబిరాలు నిర్వహిస్తూ మందులను ఉచితంగా పంపిణీ చేస్తున్నది.
అడవిని నమ్ముకున్నోళ్లకు అండగా..
గొత్తికొయ ఆదివాసీలు ఏళ్లతరబడి అడవినే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. వారికి ఉమ్మడి పాలనలో తాగేందుకు గుక్కెడు నీరు కూడా దొరకని పరిస్థితి. కూలీ పనులకు వెళ్లి కుటుంబాలను పోషించుకుంటున్న వీరికి ఏ కాలమైనా చెలమల నీళ్లే దిక్కవుతున్నాయి. వీరి తాగునీటి కష్టాలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం వారికి మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందిస్తోంది. అడవుల్లో కటిక చీకట్లో మగ్గుతున్న వీరికి ప్రభుత్వం సోలార్ వెలుగులు తీసుకొచ్చింది. పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో ప్రతి ఒక్కరికీ బతికే హక్కు ఉన్నదని జగమెరిగిన సత్యం. కానీ.. నాటి పాలకుల చేతకాని విధానాల వల్ల ఇలాంటి ఆదివాసీ కుటుంబాలు బలి కాకూడదని, వారికి మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నది. జిల్లావ్యాప్తంగా గిరిజన గూడేలో బతుకు దెరువు కోసం వచ్చిన గొత్తికోయల గ్రామాల్లో భగీరథ నీరు సోలార్ ద్వారా సరఫరా అవుతున్నది.
85 గ్రామాల్లో గొత్తికోయల జీవనం
ఛత్తీస్గఢ్, ఒడిశా, దంతెవాడ, గొల్లపల్లి, మల్కాన్గిరి ప్రాంతాల నుంచి వలస వచ్చిన ఆదివాసీలు జిల్లాలోని పలు ప్రాంతాల్ల్లో ప్రశాంత వాతావరణంలో జీవనం సాగిస్తున్నారు. చర్ల, దుమ్ముగూడెం, ములకలపల్లి, బూర్గంపాడు, చండ్రుగొండ, అశ్వారాపుపేట, లక్ష్మీదేవిపల్లి, కరకగూడెం, దమ్మపేట మండలాల్లో అడవుల్లో ఎక్కువగా గొత్తికోయలు జీవనం సాగిస్తున్నారు. వీరు ఉంటున్న ప్రాంతాల్లో గతంలో తాగునీరు దొరకకపోవడం.. చేతినిండా పనులు లేక ఇబ్బందులుపడ్డారు. ఒకదశలో కుటుంబాలు పస్తులున్న సందర్భాలూ ఉన్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత వారి జీవన విధానం మెరుగుపడింది. చేసుకోవడానికి చేతినిండా వ్యవసాయ పనులు దొరుకుతుండడం.. పారిశ్రామిక ప్రాంతాల్లో కూలీలుగా పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. వారి గూడేల్లో తెలంగాణ ప్రభుత్వం తాగునీటి సౌకర్యం కూడా అందిస్తుండడంలో ఇబ్బందులు, సమస్యలు లేకుండా జీవిస్తున్నారు.
రూ.7కోట్లతో సోలార్ ద్వారా తాగునీరు
85 గొత్తికోయ గూడేల్లో ఇప్పటివరకు 75 గ్రామాలకు తాగునీటి సౌకర్యాన్ని మిషన్ భగీరథ అధికారులు కల్పించారు. ఒక్కో యూనిట్కు రూ.8లక్షలు ఖర్చు చేసి 75 గ్రామాలకు రెండు యూనిట్ల చొప్పున అందుబాటులో ఉంచారు. మొత్తం రూ.7కోట్ల వ్యయంతో 2020లో దశరవారీగా సోలార్ విధానం ద్వారా గొత్తికోయలకు తాగునీరు అందిస్తున్నారు. తుపాను, వర్షాల వల్ల సోలార్ విధానం పని చేయకపోయినా చేతి పంపును కూడా ఏర్పాటు చేశారు. దీంతో ఆదివాసీ గొత్తికోయ గ్రామాల్లో తాగునీటి ఇబ్బంది పూర్తిగా తీరిపోయింది. మరో పది గ్రామాలకు వెసులుబాటు లేనందున అక్కడ నీటి సౌకర్యాన్ని కల్పించలేకపోయారు. దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు.
ప్పుడు వాగుకి పోయేవాళ్లం
మేమొచ్చి 20 ఏళ్లు అయింది. వచ్చినప్పుడు తాగునీరు లేదు. వాగుకు పోయి చెలమ నీళ్లు తెచ్చుకునేటోళ్లం. ఇక్క చేసుకోవడానికి పనులు కూడా లేవు. ఉపాధి కార్డు ఉంటేనే పని అన్నరు. చుట్టుపక్కల పొలం పనులకు వెళ్లినం. ఇప్పటి ప్రభుత్వంలో ఉపాధి కార్డు వచ్చింది. ఇబ్బంది లేదు. పనులు చేతినిండా దొరకుతున్నాయి. నీటి కోసం పంపు వేశారు. బాగానే నీళ్లు వస్తున్నాయి. అంగన్వాడీ బడి, పెద్ద పిల్లల బడి కూడా ఉంది.
– మడకం దేవె, గంగమ్మ కాలనీ, గట్టుమళ, లక్ష్మీదేవిపల్లి మండలం
మాకు ఇక్కడే బాగుంది
వేరే ప్రాంతం నుంచి సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాం. అక్కడ ఎలాంటి పనులు లేవు. ఇక్కడికి వచ్చిన కొత్తలో చానా ఇబ్బందులుపడ్డాం. రాత్రివేళల్లో చీకట్లోనే ఉన్నాం. ఇప్పుడు రాత్రుళ్లు వీధి లైట్లు వేయడంతో కాంతి వచ్చింది. ఇబ్బంది లేదు. తాగునీరు మాత్రం ఎప్పుడూ వస్తూనే ఉంది. మరమ్మతు వచ్చినా వెంటనే బాగు చేస్తున్నారు. మా పక్కనే క్రాంతినగర్ ఉంది. వాళ్లకి కూడా నీరు ఇస్తే బాగుంటది.
– మడివి నిర్మల, గంగమ్మ కాలనీ, లక్ష్మీదేవిపల్లి మండలం
అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం..
గొత్తికోయ కుటుంబాలు ఎక్కడున్నా వారికి ప్రభుత్వం తరఫున అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. తాగునీటి సమస్య లేకుండా ఆయా గ్రామాల్లో సోలార్ ద్వారా మోటర్ల సాయంతో నీటిని అందిస్తున్నాం. ప్రస్తుతం 75 గ్రామాలకు తాగునీరు సరఫరా అవుతోంది. మరో 10 గ్రామాలు అభయారణ్యలో ఉన్నాయి. వాటికి ఇవ్వాలంటే అటవీ శాఖ అనుమతి ఉండాలి. సాధ్యమైనంత వరకు తాగునీటి సమస్య లేకుండా చూస్తున్నాం.
– తిరుమలేశ్, ఈఈ భగీరథ ఇంట్రా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా