ఖమ్మం, ఫిబ్రవరి 27: వైద్యం ఖరీదైంది. ముఖ్యంగా పట్టణ పేదలు అత్యవసర సమయంలో ప్రైవేటు దవాఖానలకు వెళ్లి వైద్యం చేయించుకునే పరిస్థితి లేనేలేదు. ఈ పరిస్థితిని గమనించిన తెలంగాణ ప్రభుత్వం పట్టణాల్లో నిరుపేదలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తోంది. పట్టణాల్లో ప్రతీ పది వేల మందికి ఒకటి చొప్పున బస్తీదవాఖాన ఉండేలా ప్రణాళిక రూపొందించి దానాని అమలు చేస్తుంది. వీటిని దశల వారీగా విస్తరించాలని నిర్ణయించింది. జిల్లాలో ఖమ్మం నగరంతో పాటు సత్తుపల్లి, వైరా, మధిర మున్సిపాలిటీల్లో కూడా బస్తీ దవానలను ఏర్పాటు చేస్తోంది. మంత్రి అజయ్కుమార్ చొరవతో ఖమ్మం నగరంలో ఏడు ప్రదేశాల్లో బస్తీ దవాఖాలను నిర్మించింది. ఒక్కో బస్తీ దవాఖాన నిర్మాణానికి ప్రభుత్వం రూ.15 లక్షలను వెచ్చించింది. ఈ దవాఖానల్లో ఉచితంగా చికిత్సలు అందిస్తారు. వీటికి తోడు అనేక రకాలకు చెందిన వ్యాధి నిర్ధారణ పరీక్షలను కూడా చేసి మందులను సైతం అందజేస్తారు.
ఖమ్మం కార్పొరేషన్లో ఏడు చోట్ల బస్తీ దవాఖానలను నిర్మించింది. వీటిలో పాండురంగాపురం, వైఎస్ఆర్కాలనీ, రమణగుట్ట, గోళ్లపాడు చానల్ కాలువ, పాత మున్సిపాలిటీ కార్యాలయం, కొత్తగూడెం, 25వ డివిజన్లలో ఒక్కోటి చొప్పున ఏర్పాటు చేసింది. ఖమ్మంలో నిర్మించిన వీటిని మంత్రి అజయ్కుమార్ ఇప్పటికే ప్రారంభించారు. సత్తుపల్లిలో ఒక దవాఖానను గత నెలలో ప్రారంభించారు. మధిర మడుపల్లిలో అధికారులు ఒక బస్తీదవాఖానను నిర్మించారు. వైరాలో నిర్మిస్తున్నారు.
బస్తీ దవాఖానల్లో అన్ని సౌకర్యాలనూ ఏర్పాటు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఒక్కో భవనానికి రూ.15 లక్షలు వెచ్చించింది. రెండు గదులు, టాయిలెట్లు, డాక్టర్ రూమ్, ఫర్నీచర్ రూమ్, మందులను నిల్వ చేసుకోవడానికి ఒక రూము చొప్పున నిర్మించారు. రోగులు కూర్చోవడానికి బల్లాలు కూడా ఏర్పాటు చేశారు. మంచినీటి సదుపాయాన్నీ కల్పించారు. ప్రతి బస్తీ దవాఖానలో ఒక డాక్టర్, ఒక స్టాఫ్ నర్సు, ఒక నర్సు విధులు నిర్వహిస్తారు. మందులు, రోగ నిర్ధారణ పరీక్షలు ఉంటాయి. ప్రాథమిక చికిత్సలన్నీ చేస్తారు.
సెలవు రోజులు మినహా మిగతా అన్ని రోజుల్లోనూ ఈ బస్తీ దవాఖానలు తెరిచే ఉంటాయి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఓపీ ఉంటుంది. 200 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు, 145 రకాల మందుల పంపిణీ అందుబాటులో ఉంటాయి. గర్భిణులకు 9 నెలల పాటు పరీక్షలు చేస్తారు. క్యాల్షియం, ఐరన్ మాత్రలు ఇస్తారు. థైరాయిడ్ సమస్యలను గుర్తించి ప్రసవం సులభంగా జరిగేలా సూచనలు చేస్తారు. ప్రతీ బుధ, శనివారాల్లో చిన్నారులకు పోలియో, టీబీ, డీపీటీ టీకాలు వేస్తారు.
పేదల ఆరోగ్యం కోసం సీఎం కేసీఆర్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వారి కోసం నగరాల్లో బస్తీ దవాఖానలను నిర్మిస్తున్నారు. పట్టణ పేదలకు ఇవి ఎంతగానో మేలు చేస్తాయి. ఖమ్మంలో కూడా మంత్రి అజయ్ అనేక ప్రాం తాల్లో బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నారు. రోజుకు సుమారు 100 మందికి పైగా రోగులు వచ్చి ఇక్కడ వైద్య సేవలు పొందుతున్నారు.
-గోళ్ల చంద్రకళ, కార్పొరేటర్