ముఖ్యమంత్రి కేసీఆర్కు దళితులు జేజేలు పలికారు. సత్తుపల్లి నియోజకవర్గం, బోనకల్లు మండలంలోని దళితులందరికీ దళితబంధు పథకం వర్తింపచేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడం పట్ల ఆదివారం ఊరూరా సంబురాలు అంబరాన్నంటాయి. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర చిత్రపటాలకు క్షీరాభిషేకాలు, పూలాభిషేకాలు చేశారు. కల్లూరు మండలం చిన్నకోరుకొండిలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి క్షీరాభిషేకం చేశారు.
బోనకల్లు మండలంలోని 22 గ్రామాల నుంచి దళితులు పెద్దఎత్తున రావినూతల గ్రామం నుంచి బోనకల్లు వరకు 1,500 మోటార్సైకిళ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి బోనకల్లు దళితకాలనీలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
– నమస్తే నెట్వర్క్
మధిర/వేంసూరు/తల్లాడ/సత్తుపల్లి రూరల్/పెనుబల్లి, అక్టోబర్ 1: దళిత బాంధవుడు సీఎం కేసీఆర్ అని ఖమ్మం జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ అభ్యర్థి లింగాల కమల్రాజు పేర్కొన్నారు. ఎస్సీల తలరాతను మార్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. మధిర నియోజకవర్గంలోని బోనకల్లు మండలంలోనూ, సత్తుపల్లి మండలంలోని అన్ని మండలాల్లోనూ దళితబంధును అమలు చేస్తామంటూ శనివారం నాటి జిల్లా పర్యటనలో మంత్రి కేటీఆర్ ప్రకటించడం, ఆ వెంటనే జీవోలు జారీ కావడంతో ఆయా మండలాల్లో ఆదివారం సంబురాలు మిన్నంటాయి.
ఆయా మండలాల్లోని అన్ని గ్రామాల్లోనూ బీఆర్ఎస్ నాయకులు, దళితులు కలిసి సీఎం కేసీఆర్, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు, పుష్పాభిషేకాలు చేశారు. బోనకల్లు మండలంలోని 22 గ్రామాల నుంచి దళితులు పెద్ద సంఖ్యలో వచ్చి జడ్పీ చైర్మన్కు కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు. జడ్పీ చైర్మన్ ఆధ్వర్యంలో రావినూతల గ్రామం నుంచి బోనకల్లు వరకు 1,500 బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామాల నుంచి తరలివచ్చిన మహిళలతో కలిసి రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజులు బోనకల్లులో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేశారు.
అనంతరం ఎస్సీ కాలనీలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ.. అడిగిన వెంటనే బోనకల్లు మండలాన్ని దళితబంధుకు ఎంపిక చేసి సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు. అలాగే ఆయనను మూడోసారి ముఖ్యమంత్రిని చేసి రుణం తీర్చుకుందామని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు చేబ్రోలు మల్లికార్జునరావు, బంధం శ్రీనివాసరావు, బాణోతు కొండా, వేమూరి ప్రసాద్, గద్దల వెంకటేశ్వర్లు, వెంగళ కనకయ్య, చావా వెంకటేశ్వరరావు, కరివేద సుధాకర్, కొమ్మినేని ఉపేందర్, జెర్రిపోతుల రవీందర్, కిన్నెర పాపారావు, తమ్మారపు బ్రహ్మయ్య, పారా ప్రసాద్, కంచర్ల బాబు, పోటు వెంకటేశ్వర్లు, పిల్లెం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
సత్తుపల్లి నియోజకవర్గంలో..
సత్తుపల్లి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ సంబురాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. దళితుల అభ్యున్నతికి పాటుపడుతున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని స్పష్టం చేశారు. దళితబంధు పథకానికి నియోజకర్గంలోని అన్ని మండలాలనూ ఎంపిక చేసిన సీఎం కేసీఆర్కు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు. ఈ సందర్భంగా అన్ని గ్రామాల్లోనూ సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, అజయ్, ఎమ్మెల్యే సండ్ర ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు, పుష్పాభిషేకాలు చేశారు.
వేంసూరు, తల్లాడ, సత్తుపల్లి, పెనుబల్లి మండలాల్లో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పుచ్చకాయల శంకర్రెడ్డి, సర్పంచ్ శీలం కోటారెడ్డి, పిల్లి కృష్ణ, నల్లంటి ఉదయలక్ష్మి, తుమ్మూరి సరస్వతి, బొగ్గు విజయలక్ష్మి, పాలకుర్తి సునీత, కాలినేని వెంకటేశ్వరరావు, మోరంపూడి బ్రదర్స్, పాలకుర్తి రాజు, ఒగ్గు శ్రీనివాసరెడ్డి, ఐనంపుడి సత్యనారాయణ, రవి, శ్రీనివాసరెడ్డి, సిద్దయ్య, నాగేంద్ర, పురుషోత్తం, చల్లా రవీందర్రెడ్డి, సామేలు, కనగాల వెంకట్రావు, లక్కినేని అలేఖ్య, చెక్కిలాల మోహన్రావు, తేజావత్ తావునాయక్, కోటగిరి సుధాకర్బాబు, తేళ్లూరి నాగేశ్వరరావు, భూక్యా ప్రసాద్, కొత్తగుండ్ల అప్పారావు, గువ్వల వెంకటరెడ్డి, కాక సీతారాములు, రాయపుడి మల్లయ్య, ఎస్కే గౌస్, పాన్నెం నాగేశ్వరరావు, వంగా గిరిజాప్రదీప్, గంధం దుర్గయ్య, వంగా చిన్నపండు, తోట వెంకటేశ్వరరావు, గడ్డం పండు, మద్దెల పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.