తడబడిన అడుగులు ఒక్కటవుతున్నాయి. సఖి కేంద్రాలు ఎన్నో కుటుంబాలకు దారి దీపం అవుతున్నాయి. అగాథంలో కూరుకుపోయిన జీవితాలకు భరోసా కల్పిస్తున్నాయి. భార్యాభర్తలు విడిపోయినా, మహిళలు లైంగిక వేధింపులకు గురైనా, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను సంతానం పోషించకపోయినా, చిన్నారులపై లైంగికదాడులు జరిగినా వెంటనే స్పందిస్తున్నాయి. 2019లో ఏర్పాటైన సఖి కేంద్రాలు భద్రాద్రి జిల్లాలో విస్తృత సేవలందిస్తున్నాయి. జిల్లాలో ఏకంగా 1,181 కేసులు సఖి వద్దకు రాగా వాటిలో 802 కేసులు పరిష్కారమయ్యాయి. మిగతా కేసులు పరిష్కార దశలో ఉన్నాయి. కుటుంబ బాంధవ్యాలు, భార్యాభర్తల బంధాలు బలపడేలా అవగాహన కల్పిస్తున్నాయి. సఖ్యతను పెంచుతున్నాయి.
– భద్రాద్రి కొత్తగూడెం, మే 13 (నమస్తే తెలంగాణ)
‘సింగరేణిలో పనిచేస్తున్న ఉద్యోగికి వివాహమైంది. భార్య అంటే అతడికి ఇష్టం లేదు. పాప పుట్టినప్పటికీ అయిష్టతే ఉంది. అసలు ఆడవాళ్లంటేనే అసహ్యించుకునేవాడు. ఈ క్రమంలో భార్యను వేధించడం మొదలుపెట్టాడు. సంస్థ హెల్త్ కార్డులో కూడా భార్యపిల్లల పేర్లు నమోదు చేయలేదు. పెళ్లికానట్టుగానే వ్యవహరిస్తున్నాడు. వేధింపులకు తాళలేక ఆమె అతడిపై వేధింపుల కేసు పెట్టింది. వెంటనే సఖి సిబ్బంది రంగప్రవేశం చేశారు. అతడిని పిలిచారు. రాలేదు. చాలాసార్లు చెప్పినా నో అన్నాడు. చివరికి అతడి సంస్థలోని ఉన్నతాధికారికి చెప్పి నోటీసు పంపారు. సఖి సెంటర్లో కౌన్సెలింగ్ ఇచ్చారు. సుమారు ఐదు నెలలపాటు కౌన్సిలింగ్ కొనసాగింది. ఆడవాళ్లలో మంచివాళ్లూ ఉంటారనే విషయంపై అవగాహన కల్పించారు. ఐదు నెలల కౌన్సిలింగ్ తర్వాత అతడిలో మార్పు కనిపించింది. ఆ తరువాత ఆ దంపతులు అనోన్యంగా జీవిస్తున్నారు. కారు కొనుక్కొని దర్జాగా సంసారం సాగిస్తున్నారు.’
చూడడానికి చక్కగా ఉండే ఆమెకు మతిస్థిమితం లేదు. వివాహం కాలేదు. తండ్రి లేడు. తల్లి ఉంది. కానీ బిడ్డను పోషించలేని పేదరికం. దీంతో ఆమెను అలాగే వదిలేసింది. తల్లి కూడా దేవుడి సన్నిధిలో బతికీడ్చేందుకు వెళ్లిపోయింది. మతిస్థిమితం లేక రోడ్లపై తిరుగుతున్న ఆ యువతి జిల్లా దాటి వెళ్లిపోయింది. ములుగు జిల్లాకు చేరుకుంది. అక్కడి సఖి సిబ్బంది గమనించి అక్కున చేర్చుకున్నారు. చేరదీసి వసతి కల్పించారు. కొంత సమాచారం సేకరించగా ఆమె కొత్తగూడెం అని తెలిసింది. తరువాత ఆమెను కొత్తగూడెం సఖి కేంద్రంలో అప్పగించారు. ఇక్కడి సిబ్బంది తల్లి సమాచారం తెలుసుకొని బిడ్డ గురించి చెప్పారు. తల్లి కూడా పోషించే స్థితిలో లేకపోవడంతో ఖమ్మంలోని అన్నం ఫౌండేషన్లో చేర్పించారు. ఇలాంటి వందలాది కేసులను, సమస్యలను సఖి కేంద్రాలు పరిష్కరిస్తున్నాయి. కౌన్సెలింగ్తో బంధాలను కలుపుతున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం, మే 13 (నమస్తే తెలంగాణ) : 2019లో ఏర్పాటైన సఖి కేంద్రాలు బాధిత కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నాయి. భార్యాభర్తలు విడిపోయినా, మహిళలు లైంగిక వేధింపులకు గురైనా, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను సంతానం పోషించకపోయినా, చిన్నారులపై లైంగికదాడులు జరిగినా వెంటనే స్పందిస్తున్నాయి సఖి కేంద్రాలు. భద్రాద్రి జిల్లాలో విస్తృత సేవలందిస్తున్నాయి. జిల్లాలో ఏకంగా 1,181 కేసులు సఖీ వద్దకు రాగా వాటిలో 802 కేసులు పరిష్కారమయ్యాయి. మిగతా కేసులు పరిష్కారం దశలో ఉన్నాయి. కుటుంబ బాంధవ్యాలు, భార్యాభర్తల బంధాలు బలపడేందుకు అవగాహన కల్పిస్తున్నాయి సఖి కేంద్రాలు. సఖ్యతను పెంచుతున్నాయి.
సంసారంలో చిన్న చిన్న పొరపాట్లు, కలతలు ఎంతో సహజం. ఆలూమగల కోపతాపాలు అంతలోనే సర్దుకుపోతుంటాయి కూడా. అయితే చిన్న చిన్న గొడవల్లో సర్దుకుపోలేని కొన్ని జంటలు పట్టువిడుపుల మాటే లేకుండా అహానికి పోతున్నాయి. అన్యోన్యానికి మారుపేరుగా ఉండాల్సిన దంపతులు ఇగోలకు పోవడం వల్ల బంధాలు బీటలు వారే పరిస్థితులు వస్తున్నాయి. చివరికి కోర్టుల మెట్లెక్కి విడాకుల దాకా వెళ్తున్నాయి. ఫలితంగా వారి పిల్లలు మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో చిన్న చిన్న సమస్యలను సఖ్యతో పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాయి సఖి కేంద్రాలు. భార్యాభర్తలిద్దరూ అర్థం చేసుకునే వారకూ కౌన్సెలింగ్ ఇస్తూ వారిలో మార్పును తీసుకొస్తున్నాయి. చిన్న చిన్న విషయాలకు కలత చెందొద్దని, సఖ్యతతో సర్దుకుపోతే సంసారం సవ్యంగా ఉంటుందని అవగాహన కల్పిస్తున్నాయి. ఎంతో మంచి ఫలితాలను సాధిస్తున్నాయి.
సమస్య ఏదైనా సరే బాధితులు ఫోన్ చేస్తే చాలు క్షణాల్లో చేరుకుంటోంది రెస్క్యూ వ్యాన్. అందులో వెళ్తున్న సఖి సిబ్బంది అక్కడి సమస్యను తెలుసుకుని పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నారు. కాల్ సెంటర్ నెంబర్ 181కు ఫోన్ వచ్చాక ఎంత మారుమూల గ్రామానికైనా చేరుకుంటున్నారు. అవసరమైతే బాధితులను సఖి కేంద్రాలకు తీసుకొచ్చి ఆశ్రయం కల్పిస్తున్నారు. ఐదు బెడ్లున్న ఈ షెల్టర్లో ఆహారం కూడా అందిస్తున్నారు. వైద్య సేవలు అందించడానికి ఓ ఏఎన్ఎం కూడా అందుబాటులో ఉంది. న్యాయపరంగా సమస్యలను పరిష్కరించేందుకు లీగల్ అడ్వైజర్ కూడా ఉన్నారు. జిల్లా సంక్షేమ అధికారి వరలక్ష్మి నేతృత్వంలో సఖి అడ్మిన్ పర్యవేక్షణ చేస్తున్నారు.
ప్రస్తుతం ఎక్కువ జంటలు కేవలం ‘ఇగో’తోనే కాపురాలను కల్లోలం చేసుకుంటున్నాయి. వివాహం చేసుకున్న తర్వాత కొద్దికాలంలోనే తమ బంధాన్ని తెంచుకునేందుకు సిద్ధపడుతున్నారు. కాస్త సహనం ఉండి సమస్య పరిష్కారం కోసం ఆలోచించడం లేదు. అలా చేస్తే కచ్చితంగా ఆ బంధం నిలబడుతుంది. కానీ అహానికి పోతున్నారు. సఖి సెంటర్కు వచ్చిన వారికి కనీసం వారం రోజులు కౌన్సెలింగ్ ఇస్తాం. ఇలా ఎన్నో జంటలను కలిపాం. అలాగే బాల్యవివాహాలనూ నిలుపుదల చేశాం. బాధితుల వివరాలను, సఖి సెంటర్కు కాల్ చేసి సమాచారం ఇచ్చిన వివరాలను గోప్యంగా ఉంచుతాం.
– శుభశ్రీ, సఖి అడ్మిన్, కొత్తగూడెం
సెంటర్కు వచ్చిన కేసులు – 1,181
పరిష్కారం లభించినవి – 802
పెండింగ్ కేసులు – 191
స్వధార్కు సిఫార్సైన కేసులు – 40
గృహహింస కేసులు – 798
రేప్ కేసులు – 6
లైంగిక వేధింపులు – 19
చిన్నారులపై లైంగిక దాడులు – 21
బాల్య వివాహాలు – 13
మిస్సింగ్, కిడ్నాప్ కేసులు – 111
చీటింగ్ కేసులు – 57
వరకట్న వేధింపులు – 49
సీనియర్ సిటిజన్ కేసులు – 116
రోడ్లపై బనాయించిన కేసులు – 4