ఖమ్మం, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది శాసనసభ నియోజకవర్గాలకు నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. బరిలో నిలిచే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు అందజేస్తున్నారు. సోమవారం ఉమ్మడి జిల్లా నుంచి 24 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఈ నెల 10వ తేదీ వరకు కొనసాగనున్నది. ఖమ్మం నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థులుగా గుంటి నాగరాజు, బాణాల లక్ష్మణాచారి నామినేషన్లు దాఖలు చేశారు. పాలేరు నియోజకవర్గం నుంచి ఇస్లావత్ రాజేందర్, హలావత్ శోభన్బాబు, అజ్మీరా కిషన్, అల్లిక వెంకటరమణి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. వైరా నియోజకవర్గం నుంచి గుగులోతు బావ్సింగ్, మాలోతు శ్యాంలాల్ ఇండిపెండెంట్ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. మధిర నియోజకవర్గం నుంచి ఆధార్ పార్టీ నుంచి అంబోజు బుడ్డయ్య నామినేషన్ వేశారు. సత్తుపల్లి నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా చిప్పలపల్లి వీరయ్య నామినేషన్ దాఖలు చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి యువతరం పార్టీ తరఫున ప్రవీణ్కుమార్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఇల్లెందు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి చీమల వెంకటేశ్వర్లు, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ నుంచి మోకాళ్ల కృష్ణ నామినేషన్లు దాఖలు చేశారు. పినపాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పాయం వెంకటేశ్వర్లు నామినేషన్ వేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా పాల్వంచ దుర్గ, వాసం మంగయ్య, భద్రాచలం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున తెల్లం వెంకట్రావు, తెల్లం సీతమ్మ నామినేషన్ దాఖలు చేశారు. ఇదే నియోజకవర్గం నుంచి పాండ్రు హేమసుందర్ స్వతంత్ర అభ్యర్థిగా రెండో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి మెచ్చా నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. ఇదే నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా కల్లూరి కిశోర్, అంగోతు కృష్ణ, కుంజా నాగమణి, కంగాల కల్లయ్య నామినేషన్లు దాఖలు చేశారు. కాగా.. ఈ నెల 10వ తేదీ ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనున్నది. నామినేషన్ల స్వీకరణకు ఇంకా నాలుగు రోజులు మాత్రమే గడువు ఉండడంతో పోటీ చేసే ఆశావహులు మంచి ముహూర్తం కోసం వేచి చూస్తున్నారు.