భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 24 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ ఆస్పత్రుల్లో మూత్రపిండాల రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నదని, దీనికి అనుగుణంగా బెడ్ల సంఖ్య పెంచాలని జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో బుధవారం జరిగిన స్థాయీ సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత కేసీఆర్ ప్రభుత్వం వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. జిల్లా కేంద్రానికి వైద్య కళాశాలను తీసుకురావడంతోపాటు 30 పడకలు ఉన్న ఆస్పత్రులను వంద పడకలకు పెంచిందన్నారు. ప్రస్తుతం ఆస్పత్రులకు మూత్రపిండాల రోగుల సంఖ్య పెరగడంతో బెడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని, ఇందుకోసం కొత్తగూడెం, భద్రాచలంలో బెడ్ల సంఖ్య పెంచాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు బాగున్నా మార్కెట్ ధరలకు అనుగుణంగా వారికి గిట్టుబాటు కాకపోవడంతో రోజూ పప్పు, కూరలకే పరిమితం కావాల్సి వస్తోందన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్య కార్మికులు ఉండాలని, ప్రస్తుతం పంచాయతీ కార్మికులు పని చేస్తున్నా వారు సరిపోవడం లేదని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అన్నారు. వైద్య రంగంలో మార్పులు వచ్చినా ప్రతి పీహెచ్సీలో ముగ్గురు వైద్యులు ఉండాలన్నారు. ఆర్ఎంపీల వద్ద ఉన్న రోగులు ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద ఉండడం లేదన్నారు. సంబంధిత శాఖల అధికారులు నిజాలు చెప్పినప్పుడు ప్రభుత్వం వద్దకు మంచి సమాచారం చేరుతుందన్నారు. సమావేశంలో జడ్పీ సీఈవో విద్యాలత, డిప్యూటీ సీఈవో నాగలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పాఠశాల విద్య బలోపేతం కావాలంటే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. బుధవారం జడ్పీ కార్యాలయంలో చైర్మన్ అనుమతితో విద్యాశాఖపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీచర్ పోస్టులను భర్తీ చేయడంతోపాటు రెగ్యులర్ ఎంఈవోలను నియమించాలన్నారు. ప్రతి పాఠశాలలో స్వీపర్ ఉండాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రీప్రైమరీ నుంచి 10వ తరగతి వరకు ఒకే ఆవరణలో ఉంటే ఎక్కువ మంది విద్యార్థులు చదువుకునే అవకాశం కలుగుతుందన్నారు. సమీక్షలో డీఈవో వెంకటేశ్వరాచారి, ఎంఈవోలు పాల్గొన్నారు.