మంచి వానలు కురవక నెలాయె.. జల్లులకే పరిమితమాయె.. రైతుల్లో గుబులు షురువాయె.. వరుణుడు కరుణిస్తాడనే ఆశతో రైతులు పొద్దంతా నింగివైపు చూస్తూ నారు మడులు సిద్ధం చేస్తూ.. దుక్కులు దున్నుతూ.. పత్తి విత్తనాలు విత్తుతూ సాగులో నిమగ్నమాయె.. వర్షాలు ఆలస్యమైనకొద్దీ ఆందోళన మొదలాయె.. రైతు కుటుంబాల కష్టానికి వరుణుడు చలించాడేమో.. వాన దేవుడిలా వరుసబెట్టి కురుస్తుండబట్టె.. చినుకూ చినుకూ తోడై వరదాయె.. చేలల్లకు నీరు చేరె.. నారుమడులు మురిసిపోయె.. పత్తి మొక్కలకు ప్రాణమొచ్చె.. అవధులు లేని ఆనందంలో రైతులు సంబురంగా సాగు పనుల్లో మునిగిపాయె. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు విస్తారంగా వర్షాలు కురిశాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో అత్యధికంగా 115 మి.మీ వర్షపాతం నమోదైంది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వాగులు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో 113.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
-భద్రాద్రి కొత్తగూడెం, జూలై 13 (నమస్తే తెలంగాణ)
నిన్న మొన్నటి వరకు వాన చిరుజల్లులకే పరిమితమైంది. అక్కడ క్కడా మోస్తరు వర్షం తప్ప ఈ సీజన్లో ఏక బిగిన కురిసి సాగుకు భరోసా ఇచ్చిన దాఖలాలు లేవు. భద్రాద్రి జిల్లాలో బుధవారం రాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం వరకు మోస్తరు నుంచి అతి భారీ వర్షం కురిసింది. అశ్వారావుపేట నియోజకవర్గంలో వర్ష తీవ్రత ఎక్కువగా కనిపించింది. పంట పొలాల్లోకి వరద చేరింది. అశ్వారావుపేట పట్టణంతోపాటు చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాల్లోని లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది.
ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. అశ్వారావుపేట నియోజకవర్గంలోని వాగులు పొంగి రహదారులపై ప్రవహించాయి. దీంతో ఆయా మార్గాల్లో రాకపోకలు బంద్ అయ్యాయి. జూలూరుపాడు మండలంలో అత్యధికంగా 115 మీ.మీ వర్షపాతం నమోదైంది. అశ్వారావుపేట మండలంలో 112 మి.మీ, దమ్మపేట, సుజాతనగర్ మండలాలు 98 మి.మీ, అన్నపురెడ్డిపల్లి 47 మి.మీ, చండ్రుగొండలో 60 మి.మీ వర్షపాతం నమోదైంది. మరోవైపు పంటల సాగుకు సరిపడా వర్షం కురవడంతో రైతులు ఆనందపడుతున్నారు. సాగు పనులు ముమ్మరంగా చేపట్టవచ్చంటున్నారు.