ఖమ్మం, జనవరి 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బడి బయట ఉన్న పిల్లలను బడిలో చేర్చించేందుకు సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో విద్యాశాఖ ఏటా సర్వే నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా ఖమ్మం జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం సర్వే కొనసాగుతున్నది. సీఆర్పీలు ప్రతి గ్రామం, ప్రతి పట్టణంలో ఇంటింటికీ వెళ్లి సర్వే చేపడుతున్నారు. సర్వేను పకడ్బందీగా చేపట్టేందుకు జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖరశర్మ గత నెల 6న సీఆర్పీలతో ఆన్లైన్ సమావేశం నిర్వహించారు. అలాగే ఎంఈవోలు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులతో గత నెల 8న ఖమ్మం నగరంలోని రిక్కాబజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సమావేశం నిర్వహించి సర్వేపై దిశానిర్దేశం చేశారు. విద్యార్థుల వివరాలను చైల్డ్ ఇన్ఫో, ప్రబంధ్ పోర్టల్లో అప్లోడ్ చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఈ నెల 10వ తేదీ వరకు సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రప్రభుత్వం సర్కార్ పాఠశాలల్లో విద్యార్థుల కోసం కల్పిస్తున్న సౌకర్యాలను తల్లిదండ్రులకు వివరించాలని, ఏ ఒక్క విద్యార్థీ బడి బయట ఉండకుండా చూడాలన్నారు. సర్వే జరుగుతున్న తీరును ప్రతి రోజు సెక్టోరల్ అధికారులు పర్యవేక్షణ చేయడంతోపాటు వారి నుంచి డీఈఓ వివరాలు సేకరిస్తున్నారు.
జిల్లాలోని ఐదు నియోజకవర్గాల పరిధిలో అర్బన్, రూరల్ ప్రాంతాల వారీగా సీఆర్పీలు సర్వే చేపడుతున్నారు. సర్వేలో 6 నుంచి 14 సంవత్సరాలు, 15 నుంచి 19 సంవత్సరాలలోపు బడి బయట బాల బాలికలను గుర్తిస్తున్నారు. వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. అసలు బడిలో చేరకుండా, బడిలో చేరి కూడా 30 రోజులకు పైగా గైర్హాజరవుతున్న బాలలను గుర్తిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 81 పాఠశాల సముదాయాల పరిధిలో మొత్తం 111 సీఆర్పీలు సర్వే చేపడుతున్నారు. నవంబర్ 1వ తేదీ నుంచి వరుసగా 30 రోజులుగా హాజరు కాని 108 మంది లాంగ్ డ్రాపౌట్స్ను గుర్తించారు. వారిని కూడా తిరిగి పాఠశాలకు పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
జిల్లాలోని 21 మండలాల పరిధిలో ప్రస్తుతం సర్వే జరుగుతున్నది. సీఆర్పీలు జిల్లావ్యాప్తంగా 173 మంది బడి బయట పిల్లలను గుర్తించారు. వీరిలో 6-14 సంవత్సరాల లోపు పిల్లలు 88 మంది ఉన్నారు. వీరిలో బాలురు 48 మంది. బాలికలు 40 మంది. 15 నుంచి 19 సంవత్సరాలలోపు బడి బయట పిల్లలు 85 మంది ఉన్నారు. వీరిలో బాలురు 57 మంది. బాలికలు 28 మంది.
బడి బయట పిల్లలను గుర్తించేందుకు సీఆర్పీలు ఇంటింటికీ వెళ్తున్నారు. సర్వేలో గుర్తించిన పిల్లలను వారి వయస్సుకు తగిన తరగతిలో చేర్పించేందుకు విద్యాశాఖ చర్యలు తీసుకుంటున్నది. సదరు బాలబాలికలకు అందుబాటులో ఉండే ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తుంది. లేదా కేజీబీవీలో చేరేందుకు అర్హత ఉన్న బాలికలను అక్కడ చేర్పించారు. 2022 సర్వేలో విద్యాశాఖ 6-14 ఏళ్లలోపు బాలబాలికలను 79 మంది, 15-19 ఏళ్లలోపు బాలబాలికలను 122 మందిని గుర్తించింది. వీరిలో 39 మందిని పాఠశాలల్లో చేర్పించింది. మిగిలిన వారు పాఠశాల వయస్సు పైబడిన వారు కావడంతో వారు ఓపెన్ స్కూల్లో చదువు కొనసాగించే విధంగా ప్రోత్సహించింది.
డిసెంబర్ 11వ తేదీ నుంచి జిల్లాలో బడి బయట పిల్లలను గుర్తించే సర్వే ప్రారంభమైంది. ఈ నెల 10వ తేదీ వరకు సర్వే కొనసాగుతుంది. కాంప్లెక్స్ రిసోర్స్ పర్సన్స్ సర్వే చేపడుతుండగా, సర్వేను కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, మండల నోడల్ అధికారులు, మండల విద్యాధికారులు పర్యవేక్షిస్తున్నారు. సర్వే తర్వాత బడి ఈడు పిల్లలను బడికి పంపించేలా చర్యలు తీసుకుంటున్నాం.
జిల్లాలో ఉన్న బడి బయట పిల్లల వివరాలు సేకరించేందుకు 111 మంది సీఆర్పీలతో సర్వే చేయిస్తున్నాం. సర్వే ముగిసే నాటికి గుర్తించిన పిల్లలను బడికి పంపించేలా చర్యలు తీసుకుంటున్నాం. విద్యాశాఖ పరిధిలోని అన్నిస్థాయిల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. నూరుశాతం లక్ష్యం సాధించే దిశలో ముందుకు వెళ్తున్నాం.