భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సమాయత్తమవుతున్నది. ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఎన్నికల విధులు, కోడ్ పరిశీలనకు 5,629 మంది నియమితులయ్యారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లాలోని ఐదు నియోజకవర్గాల అసిస్టెంట్ ఎన్నికల అధికారులు సభలు, సమావేశాలు, అవగాహన సదస్సులు ప్రారంభించారు. కలెక్టర్ ప్రియాంక ఆల ఐదు నియోజకవర్గాలకు ఐదుగురు ఏఆర్వోలను నియమించారు. వీరు ఎన్నికల విధి విధానాలపై రాజకీయ నాయకులకు అవగాహన కల్పిస్తూ, ఓటు హక్కుపై వినియోగంపై ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలపై ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విధంగానే పార్లమెంట్ ఎన్నికల్లోనూ వృద్ధులు, దివ్యాంగులు ఇంటి వద్ద నుంచే తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. జిల్లాలో 85 ఏళ్లు దాటిన వృద్ధులు 6,481 మంది ఉండగా.. దివ్యాంగులు 14,021 మంది ఉన్నారు. వీరంతా ఇంటి నుంచే తమ ఓటు వేయనున్నారు.
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన మరుక్షణం నుంచే యంత్రాంగం వీధుల్లోని రాజకీయపరమైన ఫ్లెక్సీలను తొలగింపజేసింది. రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేయించింది. కోడ్ పర్యవేక్షణకు ఐదుగురు అసిస్టెంట్ ఎక్స్పెన్డీచర్ అబ్జర్వర్లు, ఐదుగురు అకౌంటెంట్లు, 30 మంది ఎంసీసీ కమిటీ, 16 మంది ఫ్లయింగ్ స్కాడ్స్, 15 మంది స్టాటిక్ సర్వెలెన్స్ సిబ్బంది, 18 మంది వీడియో సర్వెలెన్స్ సిబ్బందితోపాటు ఇతర సభ్యులు నియమితులయ్యారు. ఇప్పటికే వీరంతా విధుల్లో నిమగ్నమై పనిచేస్తున్నారు.
ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ ఊపందుకున్నది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఓటర్ల నమోదు ప్రక్రియ జరిగినప్పటికీ ఎన్నికల కమిషన్ పార్లమెంట్ ఎన్నికలకూ కొత్త ఓటర్లకు అవకాశం ఇస్తున్నది. కొత్త ఓటర్లు ఫారం-6 నింపి ఈ నెల 29లోపు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉన్నది. కలెక్టర్ జిల్లావ్యాప్తంగా 1,095 పోలింగ్ కేంద్రాలను ఎన్నికలకు సిద్ధం చేయిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో జిల్లావ్యాప్తంగా మొత్తం 9,84,629 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళలు 5,06,471 మంది, పురుషులు 4,78,098 మంది, ఇతరులు 60 మంది. కొత్త ఓటర్లు ఓటు హక్కు పొందిన తర్వాత ఈ సంఖ్య మరింత పెరగనున్నది.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో యంత్రాంగం పకడ్బందీగా ఎన్నికల కోడ్ను అమలు చేస్తున్నది. పోలీసులు చెక్పోస్టులు, ప్రధాన రహదారి మార్గాల్లో విస్తృతంగా వాహన తనిఖీలు చేపడుతున్నారు. రూ.50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్లే వారి నుంచి నగదు తీసుకుని సీజ్ చేస్తున్నారు. ఎన్నికల కోడ్, ఓటు హక్కు విలువపై అధికారులు జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమాల్లో ఉన్నతాధికారులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేస్తున్నారు.
పార్లమెంట్ ఎన్నికలకు జిల్లాలో 1,095 పోలింగ్ కేంద్రాలు కేటాయించాం. వాటి పరిధిలో పీవోలు 1,401, ఏపీవోలు 1,401 మంది, ఓపీవోలు 2,827 మంది విధులు నిర్వర్తిస్తారు. పినపాక మండలంలో మరో 9 కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాం. ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.