ఖమ్మం వ్యవసాయం, జనవరి 17 : ఐదు రోజుల వరుస సెలవుల అనంతరం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో బుధవారం క్రయవిక్రయాలు ప్రారంభమయ్యాయి. మిర్చి యార్డుకు రైతులు భారీగా సరుకు తీసుకొచ్చే అవకాశం ఉన్నదని అధికారులు, వ్యాపారులు భావించినా ఆశించిన మేర విక్రయానికి రాలేదు. సెలవులకు ముందు మిర్చి ధర పడిపోవడం తదితర కారణాల వల్ల యార్డుకు 20 వేల బస్తాలు మాత్రమే విక్రయానికి వచ్చినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. ఉదయం జెండా పాట సమయానికి వివిధ జిల్లాల నుంచి 18,803 బస్తాల మిర్చి, 4,491 బస్తాల పత్తి, 14 బస్తాల పెసర, తాలు మిర్చి మరో 2,752 బస్తాలను రైతులు మార్కెట్కు తరలించారు.
మిర్చి జెండా పాటలో గరిష్ట ధర క్వింటా రూ.21,300 పలుకగా.. మధ్య ధర క్వింటా రూ.18వేలు కాగా.. కనిష్ట ధర రూ.6,300 పలికింది. పత్తి పంట ఆన్లైన్ బిడ్డింగ్లో గరిష్ట ధర క్వింటా రూ.6,700 కాగా.. మధ్య ధర రూ.6,300, కనిష్ట ధర రూ.5,500 పలికింది. తాలు రకం మిర్చి గరిష్ట ధర రూ.12వేలు పలికింది. పెసర పంట గరిష్ట ధర క్వింటా రూ.5,600 చొప్పున ధర నిర్ణయించి ఖరీదుదారులు కొనుగోలు చేశారు. క్రయవిక్రయాలను మార్కెట్ కమిటీ గ్రేడ్-టూ అధికారి బజార్, అసిస్టెంట్ సెక్రటరీ వజీరుద్దీన్ పర్యవేక్షించారు.