అశ్వారావుపేట, ఏప్రిల్ 21: రైతు సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ప్రచార ఆర్భాటం కోసం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన అధికారులు కొనుగోళ్లలో జాప్యం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ నిబంధనలకు విసుగు చెందిన రైతులు తక్కువ ధర అయినా ప్రైవేట్ వ్యాపారులకే విక్రయిస్తున్నారు. ఫలితంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిరుపయోగంగా దర్శనమిస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 40 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ కేవలం 12 కేంద్రాల్లోనే ధాన్యం సేకరణ జరుగుతోంది. మిగతా 28 కేంద్రాల్లో ధాన్యం సేకరణ ఇంకా ప్రారంభం కాలేదు. ఈ నెల 1వ తేదీన అధికారులు కొనుగోలు కేంద్రాలను ఆర్భాటంగా ప్రారంభించారు. కనీస సౌకర్యాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గత కేసీఆర్ ప్రభుత్వంలో దీమాగా పంటలు సాగు చేసిన రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంలో అవస్థలు పడుతున్నారు. ఒక ప్రక్క రైతుబంధు సకాలంలో అందక రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. పండించిన ప్రతి గింజను కొంటామని అధికారులు చెపుతున్నా ప్రభుత్వ నిబంధనలతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రైతుల నుంచి ధాన్యం సేకరణలో అధికారులు నిబంధనల పేరుతో కొర్రీలు పెడుతున్నారు. నాణ్యత, తూర్పాబెట్టడం, తాలు వంటి నియమ, నిబంధనతో రైతులు కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయాలకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. తక్కువ ధర అయినప్పటికీ నిబంధనలు లేకుండా ప్రైవేట్ వ్యాపారులు ధాన్యం కొనుగోలు చేస్తుండటంతో అటు వైపు మొగ్గు చూపుతున్నారు. కల్లాల నుంచి తీసుకొచ్చిన ధాన్యాన్ని భద్ర పరచటం కంటే ఎక్కడికక్కడ ధాన్యం కొనుక్కొని అక్కడ నుండే తీసుకెళ్లిపోతున్న ప్రైవేట్ వ్యాపారులే నయం అంటూ సర్ధుకుపోతున్నారు.
ధాన్యం పండించే రైతులకు సాగు కష్టాలు తప్పటం లేదు. పండించిన పంటను అమ్ముకోవటానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేక ఎండల్లోనే కేంద్రాల్లో పడిగాపులు పడుతున్నారు. తాగటానికి తాగునీరు, కూర్చోవటానికి నీడ లేక చెట్ల కింద చేరుతున్నారు. ధాన్యం ఆరబెట్టుకోవడానికి చోటు లేక రహదారి ప్రక్కనే రాసులు పోసుకుని కాపలా కాస్తున్నారు. సకాలంలో కొనుగోలు చేయకపోవటంతో అక్కడే పడిగాపులు కాయాల్సి వస్తుంది. దేవుడిపైనా భారం వేసి కొనుగోలు కేంద్రాల చుట్టూ ధాన్యం అమ్ముకునే వరకు ప్రదక్షణలు చేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు అన్ని ఇబ్బందులే ఎదురవుతున్నాయి. పెట్టుబడి సాయం కింద ‘రైతుబంధు’ అందక ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు లేక ఆశించిన స్థాయిలో దిగుబడులు కూడా రైతు చేతికి అందని పరిస్థితి. కాంగ్రెస్ ఎన్నికల హామీగా ఇచ్చిన వరి రూ.500 బోనస్ బోగస్గానే అభిప్రాయపడుతున్నారు. రైతు బీమా ప్రభుత్వం చెల్లించిందో లేదో కూడా అర్ధం కావటం లేదని రైతులు అంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఏ సమస్య లేకుండా ధాన్యం పండించామని, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ సంపతృప్తికరంగా సాగాయని, నగదు చెల్లింపులు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేవని పేర్కొంటున్నారు.
గత్యంతరం లేక ప్రైవేట్ వ్యాపారులకు ధాన్యం అమ్ముకుంటున్నాం. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అనేక నిబంధనలు పెట్టడంతో ఇబ్బందులు పడుతున్నాం. ప్రైవేట్ వ్యాపారులు పంట కోసిన వెంటనే ఎటువంటి నిబంధనలు లేకుండా తీసుకెళ్ళిపోతున్నారు. అందుకే ధర తక్కువ అయినా వారికీ విక్రయిస్తున్నాము. 77 కేజీల ధాన్యం బస్తాకు రూ.1,500 ఇస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఎటువంటి సమస్యలు లేకుండా ధాన్యం విక్రయాలు సాఫీగా జరిగాయి.