కొత్త ఓటరుగా నమోదు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. 1 జనవరి 2024 వరకు 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటరుగా నమోదు చేసుకోవాలని, మార్పులు, చేర్పులు, తప్పొప్పులు సరి చేసుకోవాలని సూచించింది. ఈ నెల 20వ తేదీ నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది. జనవరి 5వ తేదీ వరకు కొత్త దరఖాస్తులను పరిశీలించి.. 6న ముసాయిదా ప్రకటించి అభ్యంతరాలను స్వీకరిస్తారు. తుది జాబితాను జిల్లా ఎన్నికల సంఘం అధికారులు ఫిబ్రవరి 8న అధికారికంగా ప్రకటించనున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ)/సారపాక : కేంద్ర ఎన్నికల సంఘం కొత్త ఓటర్లకు మరోసారి అవకాశం కల్పించింది. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు పూర్తి కావడం.. వచ్చే పార్లమెంట్, గ్రామపంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో జనవరి 1, 2024 వరకు 18 ఏళ్లు నిండిన యువతీ యువకులకు ఓటరుగా నమోదు చేసుకోవడానికి వీలు కల్పించింది. అర్హత ఉన్న వారు ఆన్లైన్ లేదా ఆఫ్ లైన్ లేదా బీఎల్వోలకు ఫామ్-6 సమర్పించి నూతన ఓటరు జాబితాలో పేరు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతోపాటు చిరునామా తప్పుగా ఉన్న వారు కూడా సవరణకు దరఖాస్తు ఇవ్వవచ్చని పేర్కొన్నది. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ-2024 పేర ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఎన్నికల్లో తమకు ఓటు లేదు.. మిస్ అయింది.. అనే మాట రాకుండా ఎన్నికల సంఘం ముందస్తు చర్యల్లో భాగంగా ఈ వెసులుబాటు కల్పించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సైతం కొత్త ఓటర్లను చేర్పించడంలో ఎన్నికల అధికారులు పకడ్బందీ ప్రణాళికతో సక్సెస్ అయ్యారు. యువతకు కొత్త ఓటర్లుగా అవకాశం కల్పించడంతోపాటు పాత ఓటర్ల చేర్పులు, మార్పులకు అవకాశం కల్పించి జిల్లావ్యాప్తంగా ఓటర్ల సంఖ్యను పెంచగలిగారు.
కొత్తగా ఓటర్లను చేర్చుకునే ప్రక్రియకు ఈ నెల 20వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం చుట్టనున్నది. దీంతోపాటు సవరణలకు కూడా వెసులుబాటు కల్పించారు. బూత్ లెవల్ అధికారులు ఇంటి వద్దకు వచ్చి కొత్త ఓటర్ల వద్ద దరఖాస్తులు స్వీకరిస్తారు. చేర్పులు, మార్పులను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఈ ప్రక్రియ జనవరి 5వ తేదీ వరకు కొనసాగుతుంది. 6న ముసాయిదా ప్రకటించి అభ్యంతరాలను స్వీకరిస్తారు. తుది జాబితాను ఫిబ్రవరి 8న అధికారికంగా ప్రకటించనున్నారు. ఇందుకోసం కలెక్టర్ ప్రియాంక ఆల ప్రకటన కూడా చేశారు. కొత్తగా ఓటర్లుగా చేరేవారు జనవరి 1 తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారిని అర్హులుగా గుర్తిస్తారు.
కొత్త ఓటర్ల నమోదుకు గతంలో మాదిరిగానే ప్రభుత్వ కళాశాలలు, ప్రధాన కూడళ్ల వద్ద అధికారులు విస్తృతంగా ప్రచారం చేయించనున్నారు. ఓటు విలువ గురించి సాంస్కృతిక సారథులు పాటలు, మాటల ద్వారా తెలియపరచనున్నారు. ముఖ్యంగా కళాశాలల విద్యార్థినీ విద్యార్థులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించనున్నారు.అయితే ఎన్నికల సంఘం ఓటు హక్కు వినియోగంపై ఎంత ప్రచారం చేసినా పోలింగ్ అన్ని నియోజకవర్గాల్లో 20 శాతం తక్కువగానే అవుతున్నది. 90 శాతం వరకు పోలింగ్ జరగాలంటే మరింత ప్రచారం అవసరమని పలువురు భావిస్తున్నారు. యువతకు ఓటు హక్కుపై అవగాహన పెరిగినా మధ్య వయస్సు వాళ్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం లేదని తెలుస్తోంది.
శాసనసభ ఎన్నికల తర్వాత జనవరి ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారు కొత్త ఓటరుగా చేరే అవకాశం ఉన్నది. ఆన్లైన్, ఆఫ్లైన్లో కూడా నమోదు చేసుకోవచ్చు. కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి అవకాశం కల్పించింది. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తాం. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి. ఓటు హక్కును వినియోగించుకోవాలి.