ఖమ్మం : బస్సు ఢీకొంటుందనే భయంతో ఓ బాలుడు మున్నేరులో దూకాడు. ఈ సంఘటన ఖమ్మం నగరంలోని కాల్వోడ్డు ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపినవివరాల ప్రకారం.. ఖమ్మం రూరల్ మండలం, కొత్తూరు గ్రామానికి చెందిన బీమనబోయిన ఈశ్వర్(14)అనే బాలుడు ఖమ్మం నుంచి జలగం నగర్ వైపు వెళుతున్నాడు. ఆ సమయంలో మున్నేరు వంతెన మీదకు రాగానే రెండు బస్సులు పక్క పక్కనే రావడంతో తనకు ప్రమాదం జరుగుతుందనే భయంతో మున్నేరు వంతెన గోడపై నిల్చున్నాడు. ఈ సమంయంలో బస్సుల శబ్ధానికి భయపడిన ఈశ్వర్ మున్నేరులో దూకాడు. దీంతో బాలుడుకు రెండు కాళ్లు విరిగి పోవడంతో పాటు, వెన్నెముక దెబ్బతగిలింది.
రాత్రి సమయంలో జరగడంతో ఎవరికీ తెలియక, సహాయం కోసం తీవ్రంగా అరిచిన బాలుడు స్పృహ కొల్పోయాడు. ఉదయం ఈ సంఘటన విషయం తెలియగానే విధుల్లో ఉన్న బ్లూకోట్స్ కానిస్టేబుల్ వెంటనే సంఘటన స్థలానికి చేరకుని గాయలైన ఈశ్వర్ ను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కండిషన్ మరింత సీరియస్ గా ఉండడంతో ఈశ్వర్ వైద్యుల పర్యవేక్షణలో ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నాడు. ప్రమాదానికి గురైన బాలుడు ఖమ్మం నయాబజార్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడని సీఐ సర్వయ్య తెలిపారు.