ఖమ్మం సిటీ, ఆగస్టు 25 : ఖమ్మం మెడికల్ కళాశాల(కేఎంసీ)లో అడ్మిషన్ల ప్రక్రియ చివరి దశకు చేరింది. ఈనెల 28 నాటికి సీట్లు భర్తీ చేయాలనే ఎన్ఎంసీ నిబంధన మేరకు జాతీయ స్థాయితోపాటు తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సైన్సెస్ కౌన్సిలింగ్ను వేగవంతం చేసింది. అధికారిక సమాచారం మేరకు ఇప్పటివరకు జరిగిన అడ్మిషన్లలో వేర్వేరు రాష్ర్టాలకు చెందిన వారు 12 మంది, తెలంగాణ రాష్ర్టానికి చెందిన విద్యార్థులు 63 మంది కలిపి మొత్తం 75 మంది చేరారు. మరో 25 మంది శనివారం చేరనున్నట్లు తెలిసింది. దీంతో మెడికల్ కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ వంద సీట్లకు సంపూర్ణం కానున్నది. కాగా.. కళాశాలలో చేరేందుకు వస్తున్న విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరరావు సారథ్యంలోని యంత్రాంగం జాగ్రత్తలు తీసుకుంటున్నది. బాండ్ పేపర్లు, పలు జిరాక్స్ ప్రతులు తెచ్చుకోని వారికి స్థానిక సిబ్బందిచే తెప్పించి విద్యార్థుల ఇబ్బందులను తప్పిస్తున్నారు.
ఒకటో తేదీ నుంచి తరగతులు
మెడికల్ కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ అత్యంత వేగవంతంగా కొనసాగుతున్నది. ట్యూషన్ ఫీజు రూ.29వేలు, యూనివర్సిటీ ఫీజు రూ.12వేలు, అడ్మిషన్ ఫీజు రూ.2వేలు కలిపి రూ.43వేలు చెల్లిస్తున్నారు. వీటిలో అడ్మిషన్ ఫీజు మినహాయిస్తే మిగతావన్నీ ఆన్లైన్లో చెల్లించి రిసిప్ట్ ఇవ్వాల్సి ఉంది. దేశంలోనే ఎంతో ఖరీదైన వైద్య విద్య తెలంగాణలో కేవలం రూ.43వేలకే అందుబాటులోకి రావడం గమనార్హం. సీఎం కేసీఆర్ దూరదృష్టి వల్లే ఇది సాధ్యమవుతున్నదని విద్యార్థుల తల్లిదండ్రులు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. జిల్లాకో వైద్య కళాశాల తీసుకురానట్లయితే లక్షలాది రూపాయల ఫీజు చెల్లించాల్సి వచ్చేదని, సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని సంతోషంగా చెబుతున్నారు. కాగా.. కళాశాలలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి తరగతులు జరుగనున్నాయి. ఆ దిశగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
చివరి దశలో హాస్టళ్ల ఆధునీకరణ పనులు
పాత కలెక్టరేట్, ఆర్అండ్బీ, పాత డీఎంహెచ్వో కార్యాలయాలను తెలంగాణ ప్రభుత్వం మెడికల్ కళాశాలకు కేటాయించిన విషయం విదితమే. తరగతి గదులు, విద్యార్థినీ విద్యార్థులకు వేర్వేరుగా హాస్టల్ వసతి, అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ విభాగాల ఆధునీకరణకు రూ.11.25కోట్లు మంజూరు చేశారు. వాటిల్లో నుంచి జిల్లా సార్వజనీన ఆస్పత్రికి, మెడికల్ కళాశాల(పాత కలెక్టరేట్)కు అనుసంధానంగా నిర్మించనున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జికి రూ.3.25కోట్లు ఖర్చు చేయనున్నారు. కాగా.. వైద్య కళాశాలలోని తరగతి గదులు, అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ విభాగాల ఆధునీకరణ పనులన్నీ పూర్తయ్యాయి. ఆర్అండ్బీలోని విద్యార్థినుల హాస్టల్, పాత డీఎంహెచ్వో కార్యాలయంలోని విద్యార్థుల హాస్టల్ పనులు చివరి దశకు చేరాయి. తరగతులు ప్రారంభమయ్యే నాటికి పూర్తి కావాలని ఇప్పటికే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. దీంతో మెడికల్ కళాశాల యంత్రాంగం, గుత్తేదారులు పెండింగ్ పనులపై దృష్టి సారించారు.