రఘునాథపాలెం, మే 23: ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి డబ్బు మదం, అహంకారంతోనే విర్రవీగుతున్నారని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, కేఎంసీ మేయర్ నీరజ, బీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, కార్పొరేటర్ కమర్తపు మురళి విమర్శించారు. పార్టీలో ఉంటూనే నేతలకు వెన్నుపోటు పొడిచిన పొంగులేటిది నీచ బుద్ధి అని దుయ్యబట్టారు. ‘అనవసరంగా అవాకులు చవాకులు పేలుతున్న పొంగులేటీ.. ఖబడ్దార్’ అంటూ హెచ్చరించారు. మంత్రి పువ్వాడను విమర్శిస్తే పుట్టగతులుండవని స్పష్టం చేశారు.
ఖమ్మంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఇటీవల ఖమ్మంలో తాను నిర్వహించుకున్న ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. చైతన్యవంతమైన ఖమ్మం జిల్లా ప్రజలు పొంగులేటి తప్పుడు మాటలను నమ్మే స్థితిలో లేరని అన్నారు. పువ్వాడది ఆరు దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబమని అన్నారు. జిల్లా అభివృద్ధి కోసం పువ్వాడ కుటుంబం ఎంతో చేసిందని అన్నారు.
రాజకీయ చైతన్యం కలిగిన కుటుంబంలో జన్మించిన పువ్వాడ అజయ్కుమార్ను ఖమ్మం ప్రజలు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన విషయాన్ని మర్చిపోతే ఎలా అని అన్నారు. మంత్రిగా అజయ్ చేసిన అభివృద్ధి ఏమిటో అందరికీ కన్పిస్తోందని అన్నారు. స్థాయిని మరిచి మాట్లాడడం, మంత్రి పువ్వాడను విమర్శించడం వంటివి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. పువ్వాడను విమర్శించే పొంగులేటికి రాజకీయ పుట్టగతులుండవని స్పష్టం చేశారు. ఖమ్మం పార్లమెంటు సభ్యుడిగా కొనసాగిన మీరు.. జిల్లాలో చేసిన అభివృద్ధి ఏమిటో చూపించాలని డిమాండ్ చేశారు.
‘ముఖ్యమంత్రి కేసీఆర్ను గద్దె దించుతా.. మంత్రి పువ్వాడను ఓడిస్తా..’ అంటూ చెప్పే మాటలు తాడూ బొంగరం లేని వాళ్లకే సాధ్యమవుతాయని ఎద్దేవాచేశారు. కళ్లముందు ఉన్న అభివృద్ధి చూడలేని పొంగులేటి.. మంత్రి అజయ్ని విమర్శించడం విడ్డూరంగా ఉందని అన్నారు. గెలుపు ఎవరిదో ప్రజాక్షేత్రంలో తేలుతుందని అన్నారు. బచ్చాగాడిని పెడతానంటూ పొంగులేటి చేస్తున్న వ్యాఖ్యలు.. ఆయన ఓటమి భయానికి నిదర్శనాలని అన్నారు.
పొంగులేటి నిజ స్వరూపం ఏమిటో గతంలో ఆయన చెంత ఉండి ఇప్పుడు దూరమైన నేతలను అడిగితే తెలుస్తుందని అన్నారు. ఇప్పుడు ఆయన వద్ద ఉన్నది మూడో బ్యాచ్ అని అన్నారు. గతంలో తన వెంట ఉన్న నాయకులు.. ఇప్పుడెందుకు లేరో పొంగులేటి ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. డీసీసీబీ మాజీ చైర్మన్ విజయ్బాబు వ్యాఖ్యలనూ తాము ఖండిస్తున్నామన్నారు. ఆయన డీసీసీబీ చైర్మన్గా ఉన్న సమయంలో రైతులను మోసగించి కోట్లు దండుకున్న విషయం జిల్లా ప్రజలందరికీ తెలిసిందేనని అన్నారు.
సీ స్టార్ హాస్పిటల్ పేరుతో రూ.8 కోట్లు స్వాహా చేసిన విషయం పత్రికల్లో పతాక శీర్షికలుగా వచ్చిన విషయం నిజం కాదా? అని ప్రశ్నించారు. ఆదివారం నాటి పొంగులేటి ఆత్మీయ సమ్మేళనం జనంలేక వెలవెల బోయిందని విమర్శించారు. సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, కార్పొరేటర్లు కర్నాటి కృష్ణ, దండా జ్యోతిరెడ్డి, కూరాకుల వలరాజు, మక్బూల్, బీఆర్ఎస్ నాయకులు రావూరి సైదుబాబు, తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.