కూసుమంచి (నేలకొండపల్లి), డిసెంబర్ 1 : కౌలు వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చే మార్గంలేక మనోవేదనకు గురై పురుగులమందు తాగి ప్రాణాలు తీసుకున్న కౌలు రైతు బానోత్ వీరన్న (వీరూ) స్వగ్రామంలో సోమవారమూ విషాదఛాయలే కన్పించాయి. ఉండేందుకు సరైన ఇల్లులేక, ఏడాది వయసున్న చంటి పిల్లవాడికి తండ్రిలేక, వృద్ధ తల్లిదండ్రులకు కొండంత అండగా ఉండే కొడుకులేక.. అతడి కుటుంబం చేస్తున్న ఆర్తనాదాలు అత్యంత దయనీయంగా ఉన్నాయి. అక్కడి సన్నివేశాలను చూసిన ప్రతి ఒక్కరికీ కంటితడి పెట్టిస్తున్నాయి.
తన కొడుకు నమ్ముకున్న వ్యవసాయమే తమను నట్టేట ముంచిందని, ప్రభుత్వమూ తమను ఆదుకోలేకపోయిందని వీరన్న తల్లి గుండెలోతుల్లోంచి వస్తున్న ఆక్రందన.. అక్కడి వారందరినీ కళ్లు చెమర్చేలా చేసింది. కౌలు రైతు వీరన్న ప్రాణాలు విడిచిన రెండో రోజైన సోమవారం రాత్రి.. ఏడాది వయసున్న చంటి పిల్లాడిని ఒళ్లో కూర్చోబెట్టుకొని వెలుతురులేని వసారా (గోడ పక్క వేసిన గుడారం)లో వీరన్న భార్య విలపిస్తున్న తీరు ప్రతి ఒక్కరి హృదయాలను కలిచివేసింది. తన తండ్రి తమను ఒంటరిని చేసి ఈలోకాన్ని వీడాడని, అందుకే తన తల్లి, తన నానమ్మ, తన తాతయ్య గుండెలవిసేలా బోరున విలపిస్తున్నారని తెలియని పసితనంతో అందరి మొఖాలూ చూస్తున్న ఏడాది వయసున్న వీరన్న కొడుకును ప్రతి ఒక్కరూ చూసి కన్నీటి పర్యంతమయ్యారు. సోమవారం అంత్యక్రియలు పూర్తయిన కౌలు రైతు బానోత్ వీరన్న నివాసమంతా అంతులేని విషాదమే.
పదిన్నర ఎకరాలు కౌలుకు చేసిన గిరిజన కౌలు రైతు బానోత్ వీరన్న.. కౌల్లు కట్టలేక, అప్పులు తీర్చేమార్గం లేక.. సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడిన విషయం విదితమే. అన్నం పెట్టే కౌలు రైతులు కన్నీళ్లు పెడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ, కౌలు రైతులను కూడా ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటూ గత నెల 29న పురుగుల మందు తాగిన కౌలు రైతు వీరన్న.. చికిత్స పొందుతూ ఆ మరుసటి రోజైన 30న ప్రాణాలు విడిచిన సంగతి తెలిసినదే. గ్రామస్తులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం శంకరగిరి తండాకు చెందిన బానోత్ వీరన్న నిరుపేద గిరిజన యువ రైతు.
వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్నారు. తల్లి బోడమ్మ. తండ్రి బాలా. తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. రెండేళ్ల క్రితమే వీరన్నకు సాలమ్మతో వివాహమైంది. వీరికి ఏడాది వయసున్న కుమారుడు ఉన్నాడు. పీజీ వరకూ చదువుకున్న వీరన్న ఈ మధ్యకాలం వరకూ ఉద్యోగ ప్రయత్నాలు చేశాడు. ఎస్ఐ పోస్టుకూ పోటీ పడ్డాడు. చేరుకోలేకపోయాడు. దీంతో వ్యవసాయం చేసైనా కుటుంబాన్ని పోషించుకోవాలని సంకల్పించాడు. తండ్రికి ఉన్న అర ఎకరం పొలంలో సాగు చేపట్టాడు. తొలుత నష్టం వచ్చింది. అర ఎకరంతో కుటుంబ పోషణ కష్టమని భావించి.. నాలుగేళ్ల కిందట రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేశాడు. కాస్త లాభసాటిగా ఉండడంతో కౌలు భూమి విస్తీర్ణాన్ని క్రమంగా పెంచాడు. ఈ ఏడాది సొంతంగా పదిన్నర ఎకరాలు, పొత్తులో మరో ఎనిమిది ఎకరాలు కౌలుకు చేస్తున్నాడు.
వాటిల్లో పత్తి, మిర్చి, వరి, చెరుకు పంటలు వేశాడు. తుపాన్లు, వర్షాలు, వరదల కారణంగా పంటలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. కొద్దోగొప్పో చేతికొచ్చినా సరైన ధర పలకలేదు. కానీ వీటి కోసం తెచ్చిన రూ.15 లక్షల అప్పులు మిగిలాయి. అవి తీర్చేమార్గం కన్పించపోవడంతో ఈమధ్య కొన్నాళ్లుగా మదనపడుతున్నాడు. పంటలను తుపాన్లు తుడిచిపెట్టుకుపోవడంతో ఇక అప్పులు తీర్చడం కష్టమని భావించాడు. గత నెల 29న తాను కౌలుకు చేస్తున్న చేను వద్దకు వెళ్లాడు. సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగాడు. కౌలు రైతులను కూడా ప్రభుత్వం ఆదుకోవాలని, కౌలు చెల్లించలేని కౌలు రైతులను భూయజమానులు కూడా కనికరించాలని వేడుకున్నాడు.
విషయం తెలుసుకున్న అతడి కుటుంబ సభ్యులు అతడిని అదే రోజు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గత నెల 30న ప్రాణాలు విడిచాడు. సోమవారం స్వగ్రామంలో అతడి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఉండేందుకు సరైన ఇల్లు కూడా లేని నిరుపేద కౌలు రైతు వీరన్నకు ఇటీవలే ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ప్రస్తుతం అది నిర్మాణ దశలో ఉంది. దాని గోడకు పరదా కట్టుకొని అతడి కుటుంబమంతా అక్కడే వెళ్లదీస్తోంది. ఈ క్రమంలో అతడు అర్ధాంతరంగా తనువు చాలించడంతో అతడి కుటుంబం తల్లడిల్లిపోతోంది.
వీరన్న ఆత్మహత్యపై ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి ఖమ్మం జిల్లా వ్యవసాయశాఖ అధికారి (డీఏవో) పుల్లయ్య స్పందించారు. వివరాలు సేకరించాలని మండల అధికారులను ఆదేశించారు. దీంతో ఏవో రాధ తన సిబ్బందితో కలిసి తండాకు వెళ్లి వీరన్న ఆత్మహత్యకు కారణాలను, అప్పుల వివరాలను తెలుసుకున్నారు. అలాగే, తహసీల్దార్ వెంకటేశ్వర్లు కూడా తన సిబ్బందితో కలిసి తండాకు వచ్చి వీరన్న అప్పుల పత్రాలు పరిశీలించారు. తండాలోని మిగతా కౌలు రైతులనూ విచారించారు. వివరాలు నమోదు చేసుకున్నారు.