సారపాక, జూలై 16 : ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదని, ఎలాంటి సమస్య ఉన్నా నేరుగా తన దృష్టికి తెస్తే ఆ పరిష్కారానికి ముందుంటామని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆదివారం మణుగూరు పట్టణంలోని విఠల్రావునగర్లో ఆయన కాలినడకన పర్యటించి ప్రజా సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. విఠల్రావునగర్ ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం మణుగూరుతోపాటు విఠల్రావునగర్లో అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం ప్రజాసేవలో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూ జీవితాన్ని ప్రజలకే అంకితం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, గ్రామాల్లో మౌలిక సదుపాయాలను పూర్తిస్థాయిలో కల్పించి భవిష్యత్లో సమస్యలు లేకుండా సత్వర చర్యలు తీసుకుంటామన్నారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు గడపగడపకు అందుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. పేదలకు భరోసా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అర్హులైన ప్రతిఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మంత్రి కేటీఆర్ సహకారంతో పినపాక నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కోట్లాది రూపాయలు నిధులు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలను ముమ్మరంగా చేపడుతున్నట్లు తెలిపారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ
మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో పలు బాధిత కుటుంబాలను ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పరామర్శించారు. అనారోగ్యంతో బాధపడుతున్న రావుల కుమారస్వామి, గంజి రాజ్కుమార్, బోలా నాగరాజుని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పోశం నర్సింహారావు, సొసైటీ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు, బీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు ముత్యం బాబు, అడపా అప్పారావు, కార్యదర్శులు బొలిశెట్టి నవీన్, రామిడి రామిరెడ్డి, కోఆప్షన్ సభ్యులు జావేద్పాషా, తాళ్లపల్లి యాదగిరిగౌడ్, వట్టం రాంబాబు, తాతా రమణ, ముద్దంగుల కృష్ణ, బీరెల్లి అచ్చయ్యచౌదరి, ఎడ్ల శ్రీను పాల్గొన్నారు.